మాదాపూర్ : పిల్లలే మన భవిష్యత్తు అని, చిన్నారుల్లో సృజనాత్మకతను పెంచే కార్యక్రమాలను చేపట్టడం సంతోషకర మని సినీ హీరో అక్కినేని నాగార్జున అన్నారు. మాదాపూర్లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో శుక్రవారం ఏర్పాటు చేసిన కిడ్స్ ఫెయిర్ 14వ ఎడిషన్కు హీరో నాగార్జున హజరై నిర్వాహకులతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ … పిల్లలే మన భవిష్యత్ అని, చిన్నారుల ఆలోచన విధానాన్ని సరైన మార్గంలో నడిపించడానికి ఇటువంటి కార్యక్రమాలు ఎంతగానో ఉపయోగపడుతాయని అన్నారు. చిన్నారులకు విద్యార్తి దశ నుండే అన్ని విషయాలపై అవగాహన కల్పించాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉందని అన్నారు.
సృజనాత్మకత, నైపుణ్యత పిల్లల భవిష్యత్ను ఉన్నత శిఖరాలకు చేర్చుతుందని అన్నారు. అనంతరం హైటెక్స్ బిజినెస్ హెడ్ శ్రీకాంత్ మాట్లాడుతూ… కిడ్స్ ఫెయిర్ పిల్లలకు వ్యక్తిత్వ వికాసాన్ని అందించడానికి ఉపయోగపడుతుందని అన్నారు. చిన్నారులకు అవసరమయ్యే అన్ని రకాల ఉత్పత్తులను ప్రదర్శించడం జరుగుతుందని అన్నారు.
దుబాయ్ ఆదారిత బ్రాండ్ ఫాబీ బేబి వ్యవస్థానకులు మనోజ్ కంకనే మాట్లాడుతూ … ఫాబీ బేబి యుఏఈలో తయారు చేయబడిందని, దీనిని భారతీయ మార్కెట్లోకి తీసుకురావడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో నగర నలుమూలల నుండి చిన్నారులు కుటుంబ సభ్యులతో ఉత్సాహంగా హజరై ప్రదర్శనలో ఉన్న వాటిని గురించి నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు.
మూడు రోజుల పాటు కొనసాగనున్న ఈ ప్రదర్శనలో 150 స్టాల్స్ను అందుబాటులో ఉంచారు. ఇందులో ఎస్కేప్ రూప్, కిడ్స్ రన్, సైన్స్ ఎగ్జిబిషన్, సృజనాత్మకతను పెంచే కోర్సులు, ఆటలు తదితర ఉత్పత్తులను ప్రదర్శించారు.