అంబర్పేట : అంబర్పేట నియోజకవర్గంలో ఎన్నో ఏళ్లుగా పరిష్కారానికి నోచుకొని దీర్ఘకాలిక సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో ఒక్కొక్క సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తున్నానని పేర్కొన్నారు.
బాగ్అంబర్పేట డివిజన్లోని వడ్డెరబస్తీలో రూ.22 లక్షల వ్యయంతో ఏర్పాటు చేయనున్న మంచినీటి, డ్రైనేజీ పైప్లైన్ పనులను డివిజన్ కార్పొరేటర్ బి.పద్మవెంకటరెడ్డితో కలిసి గురువారం ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వడ్డెరబస్తీలో రూ.9లక్షల వ్యయంతో నూతన మంచినీటి పైప్లైన్, రూ.13 లక్షల వ్యయంతో కొత్త డ్రైనేజీ పైప్లైన్ పనులను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.
కొద్ది రోజులుగా బస్తీ ప్రజలు ఎదుర్కొంటున్న మంచినీటి, డ్రైనేజీ సమస్య ఈ పైప్లైన్ల ఏర్పాటుతో పూర్తిగా తొలగనుందని చెప్పారు. అలాగే నియోజకవర్గంలోని అన్ని బస్తీలు, కాలనీల్లో కూడా పురాతన డ్రైనేజీ పైప్లైన్ల స్థానంలో కొత్త పైప్లైన్లను నిర్మిస్తున్నామన్నారు. వేల కోట్లు వెచ్చించి అభివృద్ధి పనులు చేపడుతున్నామని వెల్లడించారు.
అనంతరం ఎమ్మెల్యే బస్తీలో పాదయాత్ర నిర్వహించి అక్కడి ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కొందరు ఒంటరి మహిళలు, వృద్ధులు, వికలాంగులు తమకు పింఛన్లు సరిగా అందడం లేదని ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా స్పందించిన ఆయన సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని చెప్పారు.
ఈ కార్యక్రమంలో డీజీఎం సతీష్, బస్తీవాసులు ఎం.శివ, వి.కుమార్, ఎస్ఎస్ గుప్త, కిషోర్కుమార్, లక్ష్మీ, లక్ష్మమ్మ, యాదయ్య, నర్సింహ, మల్లేశం, టీఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షుడు ఎం.చంద్రమోహన్, నాయకులు శ్రీరాములుముదిరాజ్, నర్సింగ్, యోబు, మహేష్, శివాజీయాదవ్ తదితరులు పాల్గొన్నారు.