వారసత్వ సంపద పూర్వవైభవం సంతరించుకోనున్నది. చారిత్రక కట్టడాలకు చెదలు పట్టకుండా
ఉండేలా ప్రభుత్వం పునరుద్ధరణ చర్యలు చేపట్టింది. పాలిటెక్నిక్ కళాశాలగా ఉన్న రాజావారి బంగ్లా, పాన్గల్, ఘణపురం, చంద్రగఢ్ కోట వంటి కట్టడాలు, చారిత్రక ఆలయం శ్రీరంగాపూర్, కృష్ణ విలాస్కు మరమ్మతులపై వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. మంత్రి ఆదేశాల మేరకు ఈ కట్టడాలు చెక్కు చెదరకుండా ఉండేందుకు అధికారులు ప్రణాళికలు రూపొందించారు. వీటిని భవిష్యత్ తరాలకు అందించేలా కవులు, రచయితలకు బాధ్యతలు అప్పగించారు. దీంతో చారిత్రక కట్టడాలతోపాటు సప్తపముద్రాలకు మంచిరోజులు రానున్నాయి.
వనపర్తి, జనవరి 19 (నమస్తే తెలంగాణ) : వనపర్తి జిల్లాలోని వారసత్వ సంపద పూర్వవైభవం సంతరించుకోనున్నది. ఇందుకోసం చకచకా అడుగులు పడుతున్నాయి. చారిత్రక నిర్మాణాలకు ప్రాంతంలో రాజుల పాలనలో ప్రజలకు ఉపయోగపడేలా నిర్మించిన భవనాలను చెక్కు చెదరనీయకుండా ఉండేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. దీనిపై వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. కనీవినీ ఎరుగని రీతిలో అన్ని రంగాల్లో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న నియోజకవర్గ పరిస్థితిని, గత ప్రాంత వైభవాన్ని అనుసంధానం చేస్తూ రచనలు రావాలని ఆయన అభిలాషిస్తున్నారు. బీడుభూములు తప్పా బియ్యం గింజ కోసం తండ్లాడే పరిస్థితి నుంచి.. నిధులు, ప్రాజెక్టులు, సంస్థలతో ప్రజల జీవితాల్లో అనేక మార్పులు వచ్చాయి. గతానికి.. ప్రస్తుతానికి ఉన్న అభివృద్ధి, ప్రజల జీవన ప్రమాణాల మెరుగును భవిష్యత్ తరాలకు తెలిసేలా రికార్డు చేయాలని మంత్రి ప్రయత్నిస్తున్నారు. చరిత్రను పునఃలిఖించేందుకు కవులు, రచయితలకు బాధ్యతలు అప్పగించారు.
పాలిటెక్నిక్ కళాశాల..
వనపర్తి సంస్థానాధీశురాలైన రాణీ శంకరమ్మ.. తన పాలనా సౌలభ్యం కోసం నివాస భవంతిగా నిర్మించిన కోట జిల్లాకు బ్రాండ్ అంబాసిడర్. ఉమ్మడి రాష్ట్రంలో మంజూరైన మొట్టమొదటి పాలిటెక్నిక్ కళాశాల వనపర్తి కోటలో ఇప్పటికీ కొనసాగుతున్నది. ఈ భవనం గొప్పతనాన్ని, నిర్మాణశైలిని వర్ణించాలని మంత్రి కవులు, కళాకారులకు తెలిపారు. ప్రస్తుతం దక్షిణ తెలంగాణలో ఏర్పాటుకానున్న మొట్టమొదటి ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాల కూడా ఇక్కడే కొనసాగనున్నది. ఈ కళాశాల మంజూరు కూడా భవనం అభివృద్ధికి కారణం కానున్నది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి తరగతులు ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రభుత్వం నిధులు మంజూరు చేసి మరమ్మతులు చేపట్టనున్నది. ఎంతో అందమైన ఈ భవంతి.. మరమ్మతులు పూర్తయితే పూర్వవైభవం సంతరించుకోనున్నది. వీటితోపాటు పాన్గల్ కోట, ఘణపురం కోట, చంద్రఘడ్ కోట వంటి కట్టడాలు, శ్రీరంగాపూర్ ఆలయం, శ్రీకృష్ణ విలాస్ వంటి వాటికి మరమ్మతులు చేసేందుకు మంత్రి నిరంజన్రెడ్డి కంకణం కట్టుకున్నారు.
సప్త సముద్రాలు..
వనపర్తి ప్రజల తాగు, సాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకొని రాణి శంకరమ్మ నిర్మించిన సప్త సముద్రాలకు నిండుతనం తీసుకొచ్చేందుకు మంత్రి చర్యలు తీసుకుంటున్నారు. గణప సముద్రం, గోపాల సముద్రం మినహా మిగిలిన ఐదింటిని ఇప్పటికే పునరుద్ధరించారు. గణప, గోపాల సముద్రాల అభివృద్ధికి కూడా క్యాబినెట్లో ఆమోదం లభించి నిధులు కేటాయించబడ్డాయి. పెద్దమందడి మండలంలోని గోపాల సముద్రానికి రూ.10 కోట్లు మంజూరయ్యాయి.
పునరుద్ధరణ, అభివృద్ధే అభిలాష..
వారసత్వ సంపద చెక్కు చెదరకుండా భవిష్యత్ తరాలకు అందించాలన్నదే నా అభిలా ష. ఇప్పటికే సప్త సముద్రాల్లో ఐదింటిని పూర్తిస్థాయిలో పునరుద్ధరించాం. మరో రెండింటికి కూడా నిధులు మంజూరయ్యాయి. వాటి పనులు త్వరలో పూర్తిచేస్తాం. పర్యాటక ప్రాంతాలుగా తీర్చిదిద్దుతున్నాం. సాగు, తాగునీటి అవసరాలకు అనుగుణంగా మారుస్తున్నాం. చారిత్రక, వారసత్వ సంపదగా నగరానికి మణిదీపంలా ఉన్న పాలిటెక్నిక్ కళాశాల మరమ్మతులు పూర్తిచేసి సుందర భవనంగా తీర్చిదిద్దుతున్నాం. జేఎన్టీయూ హెచ్ ఇంజినీరింగ్ కళాశాల రావడం, వాటి తరగతులు పాలిటెక్నిక్ కళాశాలలో నిర్వహిస్తుండడంతో మౌలిక సౌకర్యాలు పూర్తిస్థాయిలో కల్పించనున్నాం. రాష్ట్రంలోని నాలుగు టాప్ నియోజకవర్గాల్లో ఒక్కటిగా వనపర్తిని నిలపాలన్నదే నా లక్ష్యం.