మియాపూర్ : ఐటీకి కేంద్రమైన శేరిలింగంపల్లి నియోజకవర్గంలో చెరువులన్ని శుద్ధమైన జలాలలతో కళకళలాడేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ అన్నారు. వ్యర్థజలాలు నేరుగా చెరువులలోకి చేరకుండా ఎస్టీపీల ద్వారా పకడ్బందీగా శుద్ధి జరిగేలా వాటి నిర్మాణాలను చేపట్టాలన్నారు.
శేరిలింగంపల్లి నియోజకవర్గంలో 7 చెరువులలో నిర్మించాల్సిన ఎస్టీపీలపై సంబంధిత ప్రాజెక్టు విభాగం అధికారులతో విప్ గాంధీ బుధవారం తన నివాసంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్టీపీల నిర్మాణ పనులను త్వరితగతిన ప్రారంభించాలని, నాణ్యతతో పనులను వీలైనంత త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలన్నారు.
చెరువులు కలుషితం కాకుండా ఇప్పటికే డైవర్షన్ ఛానెళ్ల నిర్మాణాలను చేపడుతున్నట్లు పేర్కొన్నారు. ఆయా చెరువుల వద్ద బేబీ పాండ్లను నిర్మించి వాటి పరిరక్షణకు కృషి చేస్తున్నట్లు వెల్లడించారు. చెరువుల పరిసరాలు పరిశుభ్రతతో మెరిసేలా తీర్చి దిద్దాలని అధికారులకు సూచించారు.
ఎస్టీపీలలో శుద్ధి ప్రక్రియ ద్వారా ఎటువంటి దుర్వాసన రాకుండా అధునాతన సాంకేతికతను వినియోగించాలని విప్ గాంధీ సూచించారు. పచ్చని మొక్కలు, వాకింగ్ ట్రాక్ సహా ఇతర సుందరీకరణ పనులను చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో సీజీఎం పద్మజ, జీఎం వాసా సత్యనారాయణ, డీజీఎం దీపాలి పాల్గొన్నారు.