ఎనిమిదేళ్లుగాకూరగాయల సాగు
1.10 ఎకరాల్లో తీరొక్క రకాలు
ఆదర్శంగా నిలుస్తున్న యువరైతు వెంకటేశ్
ప్రత్యేక కథనం. – సారంగాపూర్, ఏప్రిల్ 11: తల్లిదండ్రులను వదిలి ఉపాధి కోసం విదేశాలకు వెళ్లాడు.. అక్కడ పలు కంపెనీల్లో పనిచేశాడు. సంపాదన బాగానే ఉన్నా సంతృప్తి చెందలేదు. సొంతూరికి తిరిగివచ్చి తనకున్న ఎకరం పది గుంటల్లో కూరగాయల సాగుకు ఉపక్రమించాడు. ఎనిమిదేళ్లుగా తీరొక్క రకం పండిస్తూ ఆదర్శంగా నిలుస్తున్న యువరైతు బండారి వెంకటేశ్పైసారంగాపూర్ మండలంలోని పెంబట్లకు చెందిన బండారి వెంకటేశ్ కొన్నాళ్లపాటు సింగపూర్, సౌదీ అరేబియా దేశాలకు వెళ్లాడు. అయితే, అక్కడ సంపాదన బాగానే ఉన్నా సంతృప్తి చెందలేదు. సొంతూరిలోనే స్థిరపడాలని నిర్ణయించుకుని తిరిగి వచ్చాడు. తనకున్న ఎకరం పది గుంటల భూమిలో కూరగాయలు సాగు చేశాడు. తొలుత ఆశించిన మేర లాభాలు రాకున్నా నిరాశ చెందలేదు. మరుసటి ఏడాది నుంచి వినూత్న విధానాలు అవలంబిస్తూ తీరొక్క రకాలను వేశాడు. కూర అలిసంత, కాకర, సొరకాయ, బీర, నువ్వులు సాగు చేశాడు. చీడపీడల నివారణకు సేంద్రియ ఎరువులను వేశాడు. ఇటీవల మూడు గుంటల్లో స్వీట్కార్న్ వేసి రూ.18వేల ఆదాయం గడించాడు. ఈ ఏడాది ఎనిమిది గుంటల్లో పందిరి పద్ధతిలో బీర సాగు చేసి రూ.48 వేలు ఆర్జించాడు. తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు రావడంతో ఎనిమిదేళ్లుగా సాగు బాటలో విజయవంతంగా ముందుకెళ్తున్నాడు.
ఇవి కూడా చదవండి
బైక్ అదుపుతప్పి భర్త మృతి, భార్యకు గాయాలు