మానకొండూర్లో పరిశీలించిన డీఐవో సాజిదా అతహర
ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలని సూచన
తిమ్మాపూర్, ఏప్రిల్ 8: కొవిడ్-19 వ్యాక్సినేషన్ విస్తృతంగా సాగుతున్నది. మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గురువారం 76 మంది వ్యాక్సినేషన్ తీసుకున్నట్లు మండల వైద్యాధికారిణి ఇందు తెలిపారు. వ్యాక్సిన్ తీసుకున్న వారు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
మానకొండూర్ రూరల్, ఏప్రిల్ 8: మానకొండూర్ మండలం లక్ష్మీపూర్ పీహెచ్సీలో 59 మంది కొవిడ్ టీకా తీసుకున్నారని డాక్టర్ స్వాతి వెల్లడించారు. ఊటూర్ సొసైటీ అధ్యక్షుడు ముద్దసాని ప్రదీప్ రెడ్డి మొదటి డోస్ను తీసుకున్నట్లు తెలిపారు. వ్యాక్సినేషన్ ప్రక్రియను డీఐవో డాక్టర్ సాజిదా అతహర పరిశీలించారు. కరోనా విజృంభిస్తున్నందున ప్రతి ఒక్కరూ ముందస్తు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. కార్యక్రమంలో సూపర్వైజర్, ఏఎన్ఎంలు, ఆశ వర్కర్లు, సిబ్బంది పాల్గొన్నారు.
మానకొండూర్, ఏప్రిల్ 8: మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 48 మంది కరోనా టీకా తీసుకున్నట్లు వైద్యాధికారిణి సంధ్యారాణి తెలిపారు. ప్రతి రోజూ ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 3.30 గంటల వరకు కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతుందని తెలిపారు. ఇక్కడ సీహెచ్వో రాజునాయక్, సూపర్వైజర్ రాజు, సిబ్బంది ఉన్నారు.
గ్రామాల్లోనే వ్యాక్సినేషన్
శంకరపట్నం, ఏప్రిల్ 8: ఇక నుంచి గ్రామాల్లోనే క్యాంపులు ఏర్పాటు చేసి కరోనా వ్యాక్సినేషన్ ప్రారంభించనున్నట్లు పీహెచ్సీ వైద్యాధికారి డాక్టర్ షాకీర్ అహ్మద్ తెలిపారు. గురువారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. రవాణా సౌకర్యం లేని దూర ప్రాంతాలైన గద్దపాక, మెట్పల్లి, ధర్మారం, ఆముదాలపల్లి గ్రామస్తుల సౌకర్యం కోసం ఆయా గ్రామాల్లోనే కరోనా వ్యాక్సిన్లు వేయనున్నట్లు వెల్లడించారు. అయితే ఒకేసారి 100 నుంచి 150 మంది టీకా తీసుకునేలా ప్రజాప్రతినిధులు అవగాహన కల్పించాలని కోరారు. అలాగే సెలవు దినాల్లోనూ 45 ఏండ్లకు పైబడిన వారికి మండల కేంద్రంలోని పీహెచ్సీలో కరోనా టీకా వేస్తున్నట్లు తెలిపారు. ప్రజలు ఉదయం 10 నుంచి 12 గంటల మధ్య ఆధార్ లేదా పాన్ కార్డుతో రావాలని వైద్యాధికారి కోరారు.