ఫొటోలో కపిస్తున్నది నిజాంసాగర్ మండలం పిప్పిరేగడి తండా ప్రభుత్వ పాఠశాల. ఒకటినుంచి ఐదు వరకు తరగతులున్న ఈ బడికి ఇంతవరకు ఉపాధ్యాయుల్లేరు. ఇన్నాళ్లూ విద్యావలంటీర్ తోనే ఐదు క్లాసులూ చెప్పిస్తూ వచ్చారు. ఈ ఏడాది ఆయన కూడా మానేయడంతో బడి మూతపడింది. టీచర్లను కేటాయించాలని గ్రామస్తులు చేయని ప్రయత్నం లేదు. నూతన జోనల్ విధానంలో భాగంగా తెచ్చిన జీవో-317 కింద తాజాగా ఆ బడికి ప్రభుత్వం ఓ ఉపాధ్యాయుడిని కేటాయించింది.
నిజాంసాగర్, జనవరి 13 : మండలంలోని హసన్పల్లి పంచాయతీ పరిధిలోని పిప్పిరేగడి తండాలోని పాఠశాలలో ఒకటి నుంచి ఐదో తరగతి వరకు 25 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. పదేండ్లుగా పాఠశాలకు ఉపాధ్యాయులు రాకపోవడంతో విద్యావలంటీరే దిక్కుగా మారాడు. ప్రధానరహదారి నుంచి తండా సుమారు ఐదు నుంచి ఆరు కిలో మీటర్లు ఉండడంతో ఈ పాఠశాలకు ఉపాధ్యాయులు వచ్చేందుకు ఆసక్తి కనబర్చలేదు. ఎట్టకేలకు 317 జీవో కారణంగా నిజాంసాగర్ మండలం నుంచి 14 మంది ఉపాధ్యాయులు బదిలీపై వెళ్లగా.. 56 మంది ఉపాధ్యాయులు మండలానికి వచ్చారు. పిప్పిరేగడి తండా పాఠశాలకు ఉపాధ్యాయుడు రావడంతో తండావాసులు సంతోషం వ్యక్తంచేస్తున్నారు. 317 జీవోతో ఎన్నో సంవత్సరాలుగా ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టు భర్తీ అయ్యిందని ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు.
ఎన్నో సంవత్సరాల కల
మా పంచాయతీ ప రిధిలోని పిప్పిరేగడి తం డా పాఠశాలలో ఎన్నో సంవత్సరాల నుంచి ఉపాధ్యాయ పోస్టు భర్తీ కాకపోవడంతో విద్యావలంటీర్తోనే కొనసాగిస్తున్నాం. ఈ సంవత్సరం వలంటీర్లు సైతం లేకపోవడంతో చదువు చెప్పే వారే లేకుండాపోయారు. ప్రభుత్వం నూతన జోనల్ విధా నం అమలుచేయడంతో తండాలోని పాఠశాలలో ఉపాధ్యాయుడి నియామకం జరిగింది.
-సంగమేశ్వర్గౌడ్, సర్పంచ్, హసన్పల్లి
చాలా సంతోషంగా ఉంది
మా పంచాయతీ పరిధిలోని పాఠశాలకు ఉపాధ్యాయుడు రావడం సంతోషంగా ఉంది. ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడు లేకపోవడంతో చాలా మంది పిల్లలు ప్రైవేటు పాఠశాలకు వెళ్లలేక ఇంటి వద్దే ఉంటున్నారు. ప్రభుత్వం నూతన జోనల్ విధానం అమలుచేయడంతో మా పాఠశాలకు ఉపాధ్యాయుడు వచ్చారు. మా పిల్లల సమస్య తీరింది.