ఇందూరు, మే 5 : ఇంటర్మీడియెట్ పరీక్షలు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి. పోలీసు, రెవెన్యూ, విద్య, వైద్యారోగ్యశాఖ, ఆర్టీసీ, విద్యుత్ శాఖ, పోస్టాఫీసు అధికారుల సమన్వయంతో పరీక్షల నిర్వహణకు జిల్లా ఇంటర్ విద్యాశాఖాధికారి లోకం రఘురాజ్ ముందస్తు ఏర్పాట్లు చేశారు. మొత్తం 50 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయగా, ఇందులో 26 ప్రభుత్వ, 23 ప్రైవేట్ కళాశాలలతోపాటు ఒక ప్రైవేట్ హైస్కూల్ ఉంది. మొత్తం 35,522 మంది విద్యార్థులు పరీక్షలు రాయనుండగా, మొదటి ఏడాది విద్యార్థులు 17,553 మంది(బాలురు-8,663, బాలికలు 8,890), రెండో ఏడాది విద్యార్థులు 17,969 మంది (బాలురు-8,915, బాలికలు-9,054) ఉన్నారు. సెంటర్లోని ఒక్కో గదిలో 24 మంది విద్యార్థులు పరీక్ష రాసేలా ఏర్పాట్లు చేశారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష కొనసాగనుండగా, 8.30గంటల నుంచి విద్యార్థులను సెంటర్లోకి అనుమతించనున్నారు. ఒక్క నిమిషం ఆలస్యమైన అనుతించరు.
నగరంలోని ఎస్ఎస్ఆర్ ఇంటర్ కళాశాలలో పరీక్ష నిర్వహణ ఏర్పాట్లను హైపవర్కమిటీ సభ్యుడు చిన్నయ్యతో కలిసి డీఐఈవో రఘురాజ్ గురువారం పరిశీలించారు. అనంతరం సీఎస్, డీవోలు, ఇన్విజిలేటర్లకు పరీక్షలపై కొనసాగుతున్న శిక్షణ తరగతులకు హాజరై పలు సూచనలు చేశారు.
పరీక్షల సమయంలో విద్యార్థులు ఒత్తిడికి లోనైతే టోల్ఫ్రీ నంబర్ 1805 999333కి ఫోన్ చేసి మాట్లాడేలా ఇంటర్ బోర్డు టోల్ ఫ్రీ నంబర్ను ఏర్పాటు చేసింది. ఈ నంబర్ 24 గంటలపాటు అందుబాటులో ఉంటుంది. నగరానికి చెందిన తిరునగరి శ్రీహరి (94916 22838), నక్క నవీన్ (94410 55123), ప్రవీణ్రెడ్డి(98492 30134), డాక్టర్ విశాల్ను విద్యార్థులకు కౌన్సిలింగ్ ఇచ్చేందుకు డీఐఈవో ప్రత్యేకంగా నియమించారు.
ఇంటర్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. విద్యార్థులు గంట ముందుసెంటర్లకు చేరుకోవాలి. ఇప్పటికే అదనపు కలెక్టర్ చిత్రామిశ్రా ఆధ్వర్యంలో సీఎస్, డీవోలకు శిక్షణ ఇచ్చాం. పరీక్షా కేంద్రాల్లో మంచినీటి వసతి, టాయిలెట్లు ఉండేలా చర్యలు తీసుకున్నాం. పరీక్షల సమయంలో ఆందోళనకు, ఒత్తిడికి గురయ్యే విద్యార్థులకు కౌన్సెలింగ్ ఇచ్చేందుకు టోల్ఫ్రీ నంబర్తోపాటు, ప్రత్యేకంగా నియమించిన కౌన్సలర్లు అందుబాటులో ఉంటారు.
– ఇంటర్ విద్యాశాఖాధికారి లోకం రఘురాజ్