డిచ్పల్లి, మే 3 : మంచిప్ప రిజర్వాయర్ ద్వారా రూరల్ నియోజకవర్గంలోని లక్ష ఎకరాలకు సాగునీరు ఇవ్వడమే లక్ష్యమని ఆర్టీసీ చైర్మన్, రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. మండలంలోని అమృతాపూర్ గ్రామంలో పరమహంస సచ్చిదానంద సద్గురు శబరిమాత ఆశ్రమంలోని శ్రీలక్ష్మీనారాయణ శివాలయంలో మంగళవారం ధ్వజస్తంభం ప్రతిష్ఠాపన కార్యక్రమంలో ఎమ్మెల్సీ వీజీ గౌడ్తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బాజిరెడ్డి గోవర్ధన్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ అడుగకుండానే వరాలిచ్చే గొప్ప నాయకుడని అన్నారు.
మంచిప్ప రిజర్వాయర్కు రూ. 2,600 కోట్లు మంజూరు చేసిన ఘనత కేసీఆర్కే దక్కిందన్నారు. త్వరలోనే ఈ పనులు పూర్తయి ప్రతి గ్రామానికి సాగునీరందుతుందని, దీని ద్వారా బీడు వారిన భూములన్నీ సాగులోకి వస్తాయన్నారు. గత పాలకులు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడంలో ఘోరంగా విఫలమయ్యారని విమర్శించారు. నియోజకవర్గంలో పైపులైన్ ద్వారా నీరందించే పథకం పనులు చురుగ్గా సాగుతున్నాయని తెలిపారు.
గ్రామాల్లో పైపులైన్ వేసుకునేందుకు రైతులు సహకరిస్తే పనులు త్వరితగతిన పూర్తవుతాయని అన్నారు. ఇంత పెద్ద ఎత్తున పనులు జరుగుతున్నప్పటికీ ఓర్వలేని బీజేపీ నాయకులు సీఎం కేసీఆర్పై విమర్శలు చేయడం తగదన్నారు. అబద్ధాల కోరు ఎంపీ అర్వింద్ జిల్లాకు చేసింది శూన్యమన్నారు. ఎన్నికల్లో గెలిచిన వంద రోజుల్లోనే పసుపు బోర్డు తెస్తామని చెప్పి ఏండ్లు గడిచినా పసుపు బోర్డు ఊసే లేదన్నారు.
అలాంటి నాయకులు గ్రామాల్లోకి వస్తే అభివృద్ధి విషయంలో నిలదీయాలని పిలుపునిచ్చారు. ప్రజలు పని చేసిన వారినే గెలిపిస్తారని, పని చేయని వారిని ఓటు ద్వారానే తరిమికొడుతారని అన్నారు. బీజేపీ పాలిత రాష్ర్టాల్లో 24 గంటల విద్యుత్, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, రైతుబంధు, రైతుబీమా వంటి పథకాలు లేవన్నారు.