రాష్ట్ర సర్కారు స్త్రీ నిధి ద్వారా అందిస్తున్న చేయూతను సద్వినియోగం చేసుకుంటున్న మహిళా సంఘాలు ఇప్పటికే వివిధ వ్యాపారాల్లో దూసుకెళ్తున్నాయి. విభిన్న ఆలోచనలతో తమకు ఇష్టమైన వ్యాపార, స్వయం ఉపాధి రంగాల్లో రాణిస్తున్నాయి. కాగా ఈ ఆర్థిక సంవత్సరంలో స్వయం సహాయక సంఘాల సభ్యుల ఆధ్వర్యంలో ప్రయోగాత్మకంగా సోలార్ పవర్ ప్లాంట్ల ఏర్పాటుకు అధికార యంత్రాంగం సిద్ధమవుతున్నది. జిల్లా వ్యాప్తంగా 50 యూనిట్ల ఏర్పాటుకు నిర్ణయించగా, ఇందుకోసం ఇప్పటికే ప్రణాళిక తయారు చేసింది. విజయవంతమైతే జిల్లా వ్యాప్తంగా మరికొన్ని ప్రాంతాల్లో ఏర్పాటు చేయనున్నది.
కుమ్రం భీం ఆసిఫాబాద్, మే 13 (నమస్తే తెలంగాణ): స్త్రీ నిధి ద్వారా ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక స హాయ సహకారాలను సద్వినియోగం చేసుకుంటున్న మహిళలు అనేక వ్యాపారాలను ప్రారంభిస్తూ విజయ పథంలో దూసుకుపోతున్నారు. విభిన్నమైన ఆలోచనల తో తమకు ఇష్టమైన వ్యాపార, స్వయం ఉపాధి రంగా ల్లో రాణిస్తున్నారు. గతేడాది ప్రభుత్వం జిల్లాకు కేటాయించిన రూ. 47 కోట్ల రుణాల్లో 98 శాతం సభ్యులు సద్వినియోగం చేసుకున్నారు.
దీంతో ఈ ఏడాది ప్రభు త్వం మరో రూ. 10 కోట్లు అదనంగా కేటాయించి రూ.57 కోట్లతో రుణ ప్రణాళికలను అమలు చేసేందుకు నిర్ణయించింది. గతంలో తీసుకున్న రుణాలతో ఇప్పటి వరకు మహిళలు నిర్వహిస్తున్న వ్యాపారాలు, స్వయం ఉపాధి, పారిశ్రామిక రంగాలకు విభిన్నంగా ఈ ఆర్థిక సంవత్సరం నుంచి సోలార్ విద్యుత్ యూనిట్లను ఏర్పా టు చేసేలా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.
జిల్లాలో మహిళా స్వయం సహాయక సంఘాల ద్వారా ఈ ఏడాది 50 సోలార్ విద్యుత్ యూనిట్లను ఏర్పాటు చేసేందుకు అధికారులు నివేదికలు సిద్ధం చేశా రు. ఒక్కో యూనిట్కు రూ.లక్ష చొప్పున కేటాయించనున్నారు. ఆసక్తి గల మహిళా సంఘాల సభ్యులకు సోలార్ యూనిట్లను అప్పగించనున్నారు. దీనికి సంబంధించిన నివేదికలను అధికారులు సిద్ధంగా ఉంచారు.
1 కేవీ(కిలోవాట్) యూనిట్ మొదలుకొని 10 కేవీ యూనిట్ ఏర్పాటు వరకు అధికారులు పూర్తి వివరాల ను సేకరించారు. జిల్లాలో ప్రయోగాత్మకంగా మహిళా సంఘాల ద్వారా మొదట 1 నుంచి 3 కేవీ యూనిట్లను ఏర్పాటు చేయనున్నారు. 1 కేవీ సోలార్ యూనిట్ ఏర్పాటు చేసేందుకు సబ్సిడీ పోనూ రూ. 65 వేల వరకు ఖర్చవుతుంది. మహిళలు తమ ఇంటి అవసరాలకు వినియోగించుకునే విద్యుత్ పోనూ మిగతాది విక్రయించే వీలుంటుంది
ఒక కేవీ సోలార్ ప్లాంటు ద్వారా ఏడాదిలో 1400 యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. సింగిల్ ఫేస్ ద్వారా గృహ అవసరాలకు వినియోగించుకోవచ్చు. 2 కేవీ యూనిట్ ద్వారా కూడా సింగిల్ ఫేస్ ఏడాదికి 2800 యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. 3 కేవీ ద్వారా సింగిల్, త్రీ ఫేస్ విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. ఏడాదికి 4200 యూనిట్ల విద్యుత్ జనరేట్ అవుతుంది. ఇలా 10 కేవీల వరకు అధికారులు సోలార్ యూనిట్ల ఏర్పాటు ద్వారా విద్యుత్ ఎంత ఉత్పత్తి అవుతుంది అనే విషయాలతో పూర్తి నివేదికలను సిద్ధం చేశారు.
ఈ ఆర్థిక సంవత్సరంలో జిల్లాలో 50 సోలార్ యూనిట్లను ఏర్పా టు చేయనున్నారు. ఇలా ఆన్ గ్రిడ్ సిస్టం, ఆఫ్ గ్రిడ్ సిస్టం ద్వారా సోలార్ విద్యుత్ ఉత్పత్తిపై అధికారులు సమగ్ర నివేదికలు సిద్ధం చేశారు. రోజూ సరాసరి నాలుగు యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేసే ప్లాంట్ను ఏర్పాటు చేయనున్నారు. సోలార్ యూనిట్ ప్లాంట్ను ఒకసారి ఇన్స్టాల్ చేస్తే ఐదేళ్ల వరకు నిరంతరం విద్యుత్ ఉత్పత్తి చేయనున్నది. సోలార్ ప్యానల్కు 25 ఏళ్ల వరకు వారెంటీ ఇవ్వనున్నారు. సోలార్ ప్లాంట్ను చాలా తక్కువ స్థలంలోనే ఏర్పాటు చేయనున్నారు. ఈ ప్లాంట్లు విజయవంతమైతే జిల్లా వ్యాప్తంగా మరికొన్నింటినీ ఏర్పాటు చేసే అవకాశం ఉంది.