ఖలీల్వాడి, మే 13 : ప్రభుత్వ దవాఖానల్లో ప్రైవేట్కు దీటుగా వైద్య సేవలందించేలా చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ నారాయణరెడ్డి తెలిపారు. ఇకపై వంద శాతం ప్రసవాలు సర్కారు దవాఖానల్లోనే జరిగేలా చిత్తశుద్ధితో కృషి చేయాలని సూచించారు. కలెక్టరేట్లో ఐసీడీఎస్ అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో శుక్రవారం సమీక్ష నిర్వహించి పలు సూచనలు చేశారు. పర్యవేక్షణాలోపంతో ప్రైవేటు దవాఖానల్లో సీజేరియన్లు పెరిగిపోయాయన్నారు. రాష్ట్రంలో సగటున 66 శాతం సీజేరియన్లు అవుతుండగా, జిల్లాలో 77 శాతం నమోదయ్యిందని తెలిపారు.
ప్రైవేటు దవాఖానల్లో 92 శాతం సీజేరియన్లు చేయడంపై కలెక్టర్ ఆందోళన వెలిబుచ్చారు. ఇది మహిళల ఆరోగ్యం, భావి సమాజానికి శ్రేయస్కరం కాదన్నారు. అత్యవసరమైతే తప్ప సిజేరియన్లు చేయొద్దని, ఇతర ప్రయోజనాల కోసం మహిళల ప్రాణాలను పణంగా పెడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. గర్భిణులకు వైద్యారోగ్య సిబ్బంది క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించి ప్రభుత్వ దవాఖానల్లో సాధారణ ప్రసవాలు చేయించుకునేలా చూడాలన్నారు. ప్రతి గర్భిణీ వివరాలను నమోదు చేయాలని, నిర్లక్ష్యం చేస్తే వేతనాల్లో కోత విధిస్తామని హెచ్చరించారు.
సమర్థవంతంగా పని చేసేవారికి ప్రోత్సాహకాలు అందిస్తామన్నారు. వంద శాతం ఇమ్యూనైజేషన్ లక్ష్యాన్ని సాధించాలని, మాతా శిశు ఆరోగ్య పరిరక్షణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కలెక్టర్ సూచించారు. గ్రామాల వారీగా సర్వే చేపట్టి అనాథ బాలలు, దివ్యాంగులకు వసతి కల్పించాలన్నారు. వృద్ధులు, అనాథలు, బాధితులకు సేవలందిస్తున్న స్వచ్ఛంద సంస్థలను కలెక్టర్ అభినందించారు. వృద్ధాశ్రమాల్లో ఉంటున్న వారికి పెన్షన్, రేషన్ బియ్యం అందించడంతోపాటు క్రమం తప్పకుండా వైద్యసేలందేలా చర్యలు తీసుకుంటామన్నారు. సమావేశంలో మహిళా శిశు సంక్షేమశాఖ జిల్లా అధికారిణి ఝాన్సీ, డీఎంహెచ్వో సుదర్శనం, డీపీవో జయసుధ, డీఈవో దుర్గాప్రసాఆద్, మాతాశిశు ఆరోగ్య విభాగం జిల్లా పోగ్రాం ఆఫీసర్ అంజన పాల్గొన్నారు.