వంటింట్లో ధరల మోత మోగుతోంది. ఇప్పటికే నిత్యావసర ధరలతో కుదేలవుతున్న ప్రజలపై
కేంద్ర ప్రభుత్వం ‘బండ’డు భారం మోపుతోంది. సామాన్యులపై కనికరం లేకుండా వ్యవహరిస్తున్న మోదీ సర్కారు.. సిలిండర్ ధరను ఎడాపెడా పెంచేస్తోంది. వంట గ్యాస్ ధరను రూ. వెయ్యి దాటించిన బీజేపీ ప్రభుత్వం.. తాజాగా మరో రూ.50 పెంచింది. దీంతో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో సిలిండర్ ధర దాదాపుగా రూ.1100కు చేరింది. తాజా పెంపుతో నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల వినియోగదారులపై ప్రతి నెలా సుమారు రూ.6 కోట్లకు పైగా అదనపు భారం పడనున్నది. గ్యాస్ బండ ధరను రికార్డు స్థాయిలో పెంచిన కేంద్రం.. సబ్సిడీకి దాదాపు మంగళం పాడేసింది. మరోవైపు, పెరిగిన పెట్రో ధరలు సామాన్యులకు గుదిబండగా మారాయి. కేంద్ర ప్రభుత్వ అజమాయిషీ లేక వంట నూనెల రేట్లు ఆకాశాన్నంటాయి. నింగినంటిన నిత్యావసర ధరలు ప్రజల ఆర్థిక కష్టాలను రెట్టింపు చేస్తున్నాయి. కరోనాతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న తరుణంలో ధరల మోత మోగిస్తున్న కేంద్రం తీరుపై ప్రజలు దుమ్మెత్తి పోస్తున్నారు. పెంచిన ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తున్నారు.
నిజామాబాద్, మే 12 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): మోదీ ప్రభుత్వ నిర్వాకంతో ఇప్పటికే బహిరంగ మార్కెట్లో నిత్యావసర ధరలు విపరీతంగా పెరిగాయి. ఇప్పుడు సిలిండర్ ధరను మరింత పెంచారు. కొన్ని నెలలుగా చమురు సంస్థలు వంట గ్యాస్ ధరను పెంచుతూ వస్తున్నాయి. కరోనా వైరస్ వ్యాప్తితో అన్ని వర్గాలు ఆర్థికంగా కుదేలయ్యాయి. లాక్డౌన్ నేపథ్యంలో నిత్యాసవర సరకుల ధరలు విపరీతంగా పెరిగాయి. మరోవైపు లీటర్ పెట్రోల్ రూ.121కు చేరుకుంది.
అటు నిత్యావసర సరకులు, ఇటు ఇంధన ధరలు పెరుగుతుండడంతో ఆర్థికంగా చితికిపోతున్న సామాన్యులకు వంటింటి గ్యాస్ బండ సైతం వారి గుండెల్లో గుదిబండగా మారింది. 2020 నవంబర్లో రూ.670 ఉన్న ఎల్పీజీ ధర డిసెంబర్లో రూ.100 పెంచడంతో రూ.770 చేరింది. 2021 ఫిబ్రవరి రూ.75, మార్చిలో రూ.50 పెంచారు. ఏప్రిల్లో కంటితుడుపు చర్యగా రూ.10 తగ్గించారు. తిరిగి జూలైలో రూ.25.50, ఆగస్టులో రూ.25, సెప్టెంబర్లో రూ.25 పెంచగా అక్టోబర్లో మరింత జోడించి రూ.975.50కు చేర్చారు. ఏప్రిల్ 22న రూ.50 పెంచడంతో రికార్డు స్థాయిలో ఎల్పీజీ ధర రూ.వేయి దాటింది. మే 7న(శుక్రవారం) మరో రూ.50 పెరుగుదలతో సిలిండర్ ధర రూ.1075.50కు చేరింది.
గ్యాస్ ధరలను పెంచుతున్న కేంద్రం అందుకు అనుగుణంగా రాయితీ మాత్రం ఇవ్వడం లేదు. సిలిండర్ను తీసుకున్న తర్వాత వినియోగదారుడి బ్యాంక్ ఖాతాల్లో రాయితీ జమవుతుండగా కరోనాకు ముందు ఒక సిలిండర్పై రూ.280 రాయితీని చెల్లించిన కేంద్రం ప్రస్తుతం రూ.46.88 మాత్రమే ఇస్తూ వస్తోంది. రోజురోజుకు పెరుగుతోన్న గ్యాస్ ధరలతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.
మూడు నెలలుగా వంట గ్యాస్ ధరలు పెరుగుతుండడంతో పొయ్యి వెలిగించాలంటే చేతులు వణుకుతున్నాయి. మధ్య, దిగువ తరగతి ప్రజలు కష్టాలు వర్ణనాతీతంగా మారుతున్నాయి. ఎంత పొదుపు చేద్దామనుకుంటున్నా ధరల భారం పడుతూనే ఉంది. పేద, మధ్య తరగతి వర్గాలైతే పెరుగుతోన్న ఎల్పీజీ గ్యాస్ ధరలతో వినియోగంపై పునరాలోచనలో పడ్డారు. భారీ మొత్తంలో సిలిండర్కు ధరలు వెచ్చించలేక కట్టెల పొయ్యి దిక్కంటున్నారు.
నానాటికి పెరుగుతున్న నిత్యావసర ధరలతో సామాన్యులు తీవ్రంగా సతమతమవుతున్నారు. వంట నూనెలు సలసలమంటుండగా, కూరగాయలు కంటతడి పెట్టిస్తున్నాయి. ఇదే సమయంలో వంటింటిపై గ్యాస్ బండ మరో భారంగా మారింది. నిజామాబాద్ జిల్లాలో 26 మంది గ్యాస్ డిస్ట్రిబ్యూటర్ల పరిధిలో 3.26 లక్షల మంది వినియోగదారులున్నారు. ప్రతి రోజు సరాసరి 9 వేల ఎల్పీజీ సిలిండర్లు వినియోగం అవుతున్నాయి.
ఒక నెలలో దాదాపుగా రెండున్నర లక్షల మేర వంట గ్యాస్ సిలిండర్లు అవసరం అవుతున్నాయి. కామారెడ్డి జిల్లాలో 16 మంది డిస్ట్రిబ్యూటర్లు ఉండగా, 2.10 లక్షల మంది వినియోగదారులున్నారు. ప్రతి రోజూ 6 వేల ఎల్పీజీ సిలిండర్లు వినియోగమవుతున్నాయి. ఒక నెలలో దాదాపుగా 1.60 లక్షల సిలిండర్ల వాడకం జరుగుతున్నట్లుగా అధికారిక లెక్కలు చెబుతున్నాయి.
ఒక్కో ఇంట్లో రెండు నెలలకు సగటున ఒక సిలిండర్ వినియోగిస్తే, కొన్ని కుటుంబాలు నెలకొకటి వాడుతున్నాయి. ఇటీవలే వంట గ్యాస్పై రూ.100 పెరగడంతో సామాన్య ప్రజలపై మోయలేని భారం పడుతోంది. గడిచిన 20 రోజుల్లో అమాంతం ఒక సిలిండర్పై పెరిగిన రూ.100తో ఉమ్మడి జిల్లా ప్రజలపై అదనంగా సుమారుగా రూ.6 కోట్ల భారం పడుతోంది.
అతి తక్కువ సమయంలో రెండుమార్లు వంటగ్యాస్ ధరలు పెంచడం బాధాకరంగా ఉంది. నిత్యావసరమైన సిలిండర్ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. మాలాంటి పెద్ద కుటుంబాలకు నెలకు ఒక సిలిండర్ కొనాలంటే భారంగానే మారుతోంది. గ్యాస్ లేకపోతే వంటకు ఇబ్బంది అవుతుంది. తెల్లవారే సరికి గ్యాస్ ధర ఎంత ఉంటుందో తెలియని పరిస్థితి నెలకొంది. గ్యాస్ ఏజెన్సీకి వెళ్లే దాకా పెరిగిన ధరలు తెలియడం లేదు. కేంద్రం తీసుకుంటున్న నిర్ణయాలు సామాన్యుల జీవితాలను అతలాకుతలం చేస్తున్నాయి.
– సయ్యద్ వాజిద్, ఎడపల్లి
వెంటవెంటనే గ్యాస్ ధరలు పెంచడం వల్ల పేద కుటుంబాలపై పెనుభారం పడుతోంది. వంటగ్యాస్ సామాన్యులకు అందని ద్రాక్షలా మారే పరిస్థితి ఏర్పడుతోంది. ఇప్పటికే మా ఊర్లో సగానికి పైగా మహిళలకు వంటగ్యాస్కు బదులుగా కట్టెల పొయ్యిలు వాడే పరిస్థితికి వచ్చారు. రానున్న రోజుల్లో పరిస్థితి ఇలాగే ఉంటే, గ్యాస్ వాడకం మానేయాల్సి వస్తుంది. కేంద్ర ప్రభుత్వ చర్యలు సామాన్యులను రోడ్డున పడేసే విధంగా ఉంటున్నాయి.
– సున్నం లత, గృహిణి, అంబం (వై)
కేంద్ర ప్రభుత్వం సిలిండర్ ధరను 18 రోజుల వ్యవధిలోనే రూ.100 పెంచింది. ప్రస్తుతం వంట గ్యాస్ ధర రూ.1075 చేరింది. రేట్లు ఇలాగే పెంచితే కట్టెల పొయ్యే గతి అయ్యేటట్లు కనిపిస్తున్నది. ఇప్పటికే నిత్యావసర ధరలు ఆకాశాన్ని అంటాయి. వంట గ్యాస్ ధర అమాంతంగా పెంచడంతో సామాన్యులకు భారంగా మారింది.
– తెడ్డు సంధ్య, గృహిణి, నవీపేట
ఇప్పటికే పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. ఇది చాలదన్నట్లు సిలిండర్ ధరను ఇష్టమొచ్చినట్లు పెంచుతున్నారు. నిత్యావసర వస్తువులతోపాటు పెట్రోల్, వంటగ్యాస్ భారం మోపిన బీజేపీ ప్రభుత్వానికి ప్రజలే గుణపాఠం చెబుతారు. పెంచిన ధరలను తక్షణమే తగ్గించాలి లేదంటే కేంద్రానికి వ్యతిరేకంగా ప్రజలు రోడ్డెక్కే పరిస్థితి వస్తుంది.
– గొట్టి రాజు, నారాయణపూర్, నవీపేట మండలం