వేల్పూర్, మే 12: సీఎం కేసీఆర్ జనరంజక పాలన నచ్చి వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు టీఆర్ఎస్లో చేరుతున్నారని రాష్ట్ర రోడ్లు, భవనాలు, హౌసింగ్, శాసన సభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. పార్టీ కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా ఉంటామన్నారు. బాల్కొండ నియోజకవర్గంలోని వేల్పూర్, ఏర్గట్ల, మోర్తాడ్ మండలాల నుంచి వివిధ పార్టీలకు చెందిన మూడువందల మంది నాయకులు, కార్యకర్తలు హైదరాబాద్లో మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి సమక్షంలో గురువారం టీఆర్ఎస్లో చేరారు. వారికి మంత్రి గులాబీ కండు వా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా మంత్రి వేముల మాట్లాడుతూ.. కేసీఆర్ జనరంజక పాలన, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని అన్నా రు. బాల్కొండ నియోజకవర్గంలో అభివృద్ధి కండ్ల ముందే కనిపిస్తోందన్నారు. కేసీఆర్ సహకారంతో రూ.100 కోట్లతో చెక్డ్యాములు నిర్మించినట్లు తెలిపారు. కేసీఆర్ ఎస్సారెస్పీ పునరుజ్జీవ పథకం ద్వారా సాగునీటికి గోస లేకుండా చేశారన్నారు.
నియోజకవర్గంలో ఏ మూలకు చూసినా రూ. 30లక్షలకు ఎకరం తక్కువ లేదన్నారు. వందల కోట్లతో సీసీ రోడ్లు, డ్రైనేజీలు, సెంట్రల్ లైటింగ్, వైకుంఠధామాలు, పల్లె ప్రకృతి వనాలు, రైతు వేదికలు నిర్మించినట్లు వివరించారు. పార్టీలకు అతీతంగా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ముఖ్యమంత్రి కేసీఆర్ చేపడుతున్నారని అన్నారు. నిజామాబాద్ ఎంపీ అర్వింద్ ఏమైనా అంటే జై శ్రీరాం అంటూ మాటలు చెబుతాడే తప్ప, ఒక్క గుడి కట్టించింది లేదన్నారు.
తాను కేసీఆర్ను ఒప్పించి ఒక్క బాల్కొండ నియోజకవర్గంలోనే 50 మందిరాలను కట్టించినట్లు తెలిపారు. కార్యక్రమంలో పార్టీ కన్వీనర్లు ఏలియా, పుర్ణానందం, నాగధర్, ఎంపీపీలు ఉపేంద్ర, శివలింగు శ్రీనివాస్, బోగ ఆనంద్, తాళ్లరాంపూర్ విండో చైర్మన్ పెద్దకాపు శ్రీనివాస్ రెడ్డి, బబ్బురు ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు.
జిల్లాలో శుక్రవారం మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి పర్యటించనున్నారు. పలు వివాహాది శుభకార్యాల్లో పాల్గొననున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు భీమ్గల్ మండలం మెండోరాలో విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమంలో పాల్గొంటారు.