కమ్మర్పల్లి, మే 12 : కన్న తల్లే తన పిల్లలను వదిలి వెళ్లిపోతే పోలీసులు, సర్పంచ్, ఐసీడీఎస్ సిబ్బంది ఎట్టకేలకు ఆ చిన్నారులను వారి నానమ్మ, తాతయ్య చెంతకు చేర్చారు. కమ్మర్పల్లి మండలం హాసాకొత్తూర్లో రెండు రోజుల పాటు కొనసాగిన ఈ ఉదంతానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. గుర్తు తెలియని ఓ మహిళ, మరో వ్యక్తితో కలిసి వచ్చి తన ఆరేండ్ల కూతురు ప్రవళిక, నాలుగేండ్ల కుమారుడు ప్రణయ్ని హాసాకొత్తూర్లోని జగదాంబ ఆలయం వద్ద బుధవారం మధ్యాహ్నం వదిలి వెళ్లారు. వదిలి వెళ్లే క్రమంలో తల్లితో కలిసి వచ్చిన వ్యక్తిని స్థానికులు నిలదీశారు.
అతనిపై సందేహం కలిగి పిల్లలను అతడికి ఇవ్వలేదు. స్థానికులకు మాయ మాటలు చెప్పి తల్లి, సదరు వ్యక్తి అక్కడి నుంచి చాకచక్యంగా జారుకున్నారు. దీంతో ఈ చిన్నారులను స్థానిక ఉపసర్పంచ్ ఏనుగు రాజేశ్వర్, ఐసీడీఎస్ సూపర్వైజర్ సవిత, అంగన్వాడీ టీచర్ జానకి తమ వద్ద ఉంచుకొని పోలీసులకు సమాచారం ఇచ్చారు. గురువారం పిల్లలు తమది నిర్మల్ అనే వివరాలు తప్ప మరేమీ చెప్పకపోవడంతో సమస్య జఠిలంగా మారింది. ఎస్సై రాజ శేఖర్ నిర్మల్ పోలీసులకు ఫొటోలు పంపడంతో పాటు ఇతర ప్రయత్నాలన్నీ చేస్తూ పిల్లలతో కలిసి పలు గ్రామాలన్నీ తిరిగి ఆరా తీశారు.
ఎట్టకేలకు సమాచారం అందుకున్న పిల్లల తండ్రి దండుగుల రమేశ్, నానమ్మ లస్మవ్వ, తాతయ్య లక్ష్మయ్య వచ్చి పిల్లలను గుర్తించడంతో గురువారం రాత్రి పోలీసులు వారికి పిల్లలను అప్పగించారు. రెండు రోజులుగా పిల్లల ఆలనా పాలనా చూసిన హాసాకొత్తూర్కు చెందిన చాకలి బొంబాయి సాయన్నను పిల్లలు వదలకుండా ఏడ్చారు. కథ సుఖాంతం కావడంతో గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు.