రాష్ట్ర ప్రభుత్వ చొరవతో వైద్య రంగంలో వినూత్న మార్పులు వచ్చాయి. సర్కారు దవాఖానల రూపురేఖలు మారాయి. సీఎం కేసీఆర్ దార్శనికతతో అత్యాధునిక సేవలు అందుబాటులోకి వచ్చాయి. పకడ్బందీ చర్యలతో ప్రభుత్వ వైద్యంపై ప్రజల్లో నమ్మకం పెరిగింది. ప్రైవేట్కు దీటుగా ఖరీదైన వైద్యాన్ని సర్కారు ఉచితంగానే ప్రజల చెంతకు చేర్చింది. రూ.లక్షలు ఖర్చయ్యే మోకాలి మార్పిడి శస్త్రచికిత్సలను ఇప్పుడు ఫ్రీగా చేయిస్తోంది.
నిజామాబాద్ ప్రభుత్వ దవాఖాన మోకాళ్ల మార్పిడి శస్త్ర చికిత్సలకు కేంద్రంగా మారుతోంది. వైద్యులు ఇప్పటికే ముగ్గురికి మోకాలి మార్పిడి ఆపరేషన్లను విజయవంతంగా నిర్వహించారు. ఎంతో మంది ఎన్నో ఏండ్లుగా ఎదుర్కొంటున్న మోకాలి సమస్యకు ప్రభుత్వ చర్యలతో శాశ్వత పరిష్కారం లభించనున్నది.
వయస్సు పైబడిన కొద్ది అడుగుతీసి అడుగెయ్యడం కుదరని పరిస్థితి. మోకీళ్ల సమస్యతో కూర్చోలేక.. నడువలేక పడే బాధ వర్ణణాతీతం. ఆపరేషన్లు చేసుకుందామంటే ప్రైవేటు దవాఖానల్లో లక్షల రూపాయల ఖర్చు. ఆర్థికంగా వెనుకబడిన, పేదోళ్లకు ఈ సమస్య ఎదురైతే.. చెప్పలేని బాధ. అలాంటి వారి బాధలు పూర్తిగా తీర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. సర్కారు దవాఖానలోనే మోకాళ్ల చిప్పల మార్పిడి ఆపరేషన్లు చేయిస్తూ అందుకయ్యే ఖర్చును భరిస్తున్నది. నిజామాబాద్ జిల్లా కేంద్ర ప్రభుత్వ దవాఖానలో తాజాగా ముగ్గురికి మోకీళ్లఆపరేషన్లను వైద్యబృందం విజయవంతంగా నిర్వహించింది.
నిజామాబాద్, మే 11(నమస్తే తెలంగాణ ప్రతినిధి) :తెలంగాణ ప్రభుత్వం వచ్చాక వైద్య సేవల్లో సమూల మార్పులు వచ్చాయి. నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు అన్న నానుడి నుంచి నేను వస్తా బిడ్డో సర్కారు దవాఖానకు అన్నట్లుగా పరిస్థితి మారింది.
ఒకప్పుడు నమ్మకం లేని వైద్య సేవలతో పేదలు, మధ్యతరగతి వర్గాలు అటువైపు కన్నెత్తి చూడాలంటే భయపడేవి. ఇప్పుడు సంపన్న కుటుంబాలకు చెంది న వారు కూడా ప్రభుత్వ సేవలను అందిపుచ్చుకుంటున్నారంటే అతిశయోక్తి కాదు. మెడికల్ కాలేజీ అందుబాటులోకి వచ్చాక నిజామాబాద్ వాసులకు అత్యాధునిక వైద్య సేవలు దరిచేరాయి. విభిన్న విభాగాల్లో వైద్య నిపుణులు అందుబాటులో ఉండడంతో హైదరాబాద్కు వెళ్లాల్సిన అవసరమే లేకుండా పో యింది.
కరోనా సమయంలో అమ్మలా ఆదుకున్న ప్రభుత్వ జనరల్ దవాఖాన.. ఇప్పుడు రాష్ట్ర ప్రభు త్వ చొరవతో మోకాళ్ల మార్పిడి శస్త్ర చికిత్సలకు కేం ద్రంగా మారబోతున్నది. మాతృదినోత్సవం సందర్భంగా విజయవంతంగా ముగ్గురు మహిళలకు మో కీలు శస్త్రచికిత్సలు పూర్తిచేయగా ఇదేస్ఫూర్తితో ము న్ముందు మరింత మందికి సేవలు అందించేందుకు సంబంధిత విభాగం డాక్టర్లు సిద్ధంగా ఉన్నారు.
మోకాళ్ల నొప్పి సమస్యతో బాధపడే వారిలో గ్రామీణ ప్రాంతానికి చెందిన వారే అధికం. పట్టణాల్లో అధునాతన సౌకర్యాలు రావడంతో మోకాళ్ల సమస్యకు తాత్కాలిక విరుగుడుతో రోజులు గడిపేస్తారు. కానీ పల్లెల్లో కూర్చోలేక, నడువలేక మోకీళ్ల సమస్యలు ఎదుర్కొనే వారి బాధ వర్ణనాతీతం. వయసు పెరిగేకొద్దీ శారీరకంగా అనేక మార్పులు చోటు చేసుకుంటాయి. మరింత జాగ్రత్తగా జీవనశైలిని అలవర్చుకోవాల్సిన ఆవశ్యకత ఏర్పడుతుంది. ప్రధానంగా కీళ్లలో అరుగుదల మొదలవుతుంది.
ఎక్కువ శాతం 45ఏండ్లు పైబడిన వారిలోనే మోకాళ్ల సమస్య ఉత్పన్నమవుతుంది. వందలో 40మందికి పైగా మోకాళ్ల నొప్పులతో ఇబ్బందిపడుతున్నట్లు వైద్య నిపుణులు చెబుతున్నారు. వృత్తిపరంగా, రోజువారీ చేసే పనుల ఆధారంగా, ఇతరత్రా కారణాలతో మోకాళ్లలో అరుగుదల ఆరంభం అవుతుంది. తీవ్ర గాయాలైన సందర్భంలో వయసుతో సంబంధం లేకుండా ఆ ప్రభావం చూపుతున్నది.
అరుగుదల మొదలైన తర్వాత లక్షణాలు క్రమంగా బయట పడుతుండగా తీవ్రమైన నొప్పి, కొన్నిసార్లు నడవలేని పరిస్థితి ఎదుర్కొనేవారు అనేకం. అలాంటి వారికి బాసటగా నిలిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు ప్రత్యేక చొరవతో మోకీళ్ల ఆపరేషన్లు ఇప్పుడు నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ దవాఖానలో అందుబాటులోకి వచ్చాయి.
మోకాళ్ల నొప్పుల సమస్య మొదటి, రెండు దశల్లో సాధారణ నొప్పులతో ఇంటి వరకే ఉంటుండగా తర్వాత దవాఖానల చుట్టూ తిరుగుతున్నారు. కీలు మార్పిడి శస్త్ర చికిత్సలో భాగంగా మోకాలి చిప్ప వెనుక భాగంలో ఉన్న ఎముకలను సవరించి, కొంత మేర తొలగించి స్టీల్ రకం కృత్రిమ కీలు అమర్చుతారు. తొడ ఎముక, కాలు ఎముక కలిపే చోట ఈ మార్పు చేస్తారు. సాధారణంగా కార్పొరేట్ దవాఖానల్లో ఈ శస్త్ర చికిత్సకు రూ.2లక్షల నుంచి రూ.5 లక్షల వరకు ఖర్చవుతుంది.
ఎక్కువగా ప్రైవేటు దవాఖానల్లోనే ఈ రకమైన ఆపరేషన్లు నిర్వహిస్తుంటారు. సమస్య జఠిలం కాకుంటే మోకాళ్లకు పట్టీలు అమర్చుకునే సదుపాయం కల్పిస్తారు. ఆ తరహా వైద్యం పేదలకు భారంగా మారుతుంది. ఇలాంటి సమయం లో ఉచితంగా చికిత్సల వైపు అడుగేయడం శుభ పరిణామం. 30ఏండ్ల నుంచే జాగ్రత్తలు తీసుకోవడం ఆరంభిస్తే కీళ్లనొప్పులకు దూరంగా ఉండొచ్చని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. రోజువారీగా వ్యాయా మం చేయాలని, జీవనశైలి మార్పుతోపాటు పౌష్టికాహారం ఎక్కువగా తీసుకోవాలని, కండరాలను పటి ష్టం చేసుకోవాలని చెబుతున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిన మోకీలు ఉచిత ఆపరేషన్ల సేవలతో ఎంతో మంది సుదీర్ఘంగా ఎదుర్కొంటున్న సమస్యకు పరిష్కారం లభించనున్నది. గతంలో ఉస్మానియా, గాంధీ, నిమ్స్ దవాఖానలకే పరిమితమైన మోకీలు మార్పిడి శస్త్ర చికిత్సలు ఇప్పుడు జిల్లా ప్రభుత్వ దవాఖానలోనూ నిర్వహిస్తున్నారు. మాతృ దినోత్సవం సందర్భంగా నిజామాబాద్ ప్రభుత్వ దవాఖానలో ముగ్గురు మహిళలకు మోకీలు మార్పిడి శస్త్ర చికిత్సలు విజయవంతంగా నిర్వహించారు. మాక్లూర్ మండలం గొట్టుముక్కులకు చెందిన లలిత, దుర్గానగర్కు చెందిన నీలాబాయి, తడపాకల్కు గంగామణికి ఈ ఆపరేషన్లు విజయవంతంగా నిర్వహించారు.
మోకీలు ఆపరేషన్లతో నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ దవాఖాన మరోసారి ప్రత్యేకతను చాటుకున్నది. సిద్దిపేట తర్వాత నిజామాబాద్లో విజయవంతంగా మోకీ లు ఆపరేషన్లు జరగడం గర్వించదగినది. నిపుణులైన ఆర్థో విభాగం వైద్యులతో మోకీలు ఆపరేషన్లు రెగ్యులర్గా చేసేందుకు నిర్ణయించాం. సమస్య తీవ్రంగా ఉన్నవారు జీజీహెచ్లో వైద్యులను సంప్రదించాలి. 166మందిలో సీరియస్గా ఉన్నవాళ్లను గుర్తించి ముగ్గురికి శస్త్ర చికిత్సలు పూర్తి చేశాం. మిగిలిన వాళ్లకు వరుస క్రమంగా నిర్వహిస్తాం.
– డా.ప్రతిమా రాజ్, జీజీహెచ్, సూపరింటెండెంట్
మదర్స్ డే సందర్భంగా ముగ్గురు 80, 60, 55ఏండ్ల మహిళలకు మోకీలు ఆపరేషన్లు చేశాం. ఇప్పు డు వారు చాలా మంచిగా ఉన్నా రు. ప్రభుత్వ దవాఖానల్లో ఇదో చారిత్రక సందర్భం. జనరల్ దవాఖానలో మోకాలు రీప్లేస్మెంట్ ఆపరేషన్ థియేటర్తోపా టు 30బెడ్లతో ప్రత్యేక వార్డును కేటాయించాం. వారానికి 10 నుంచి 15 శస్త్రచికిత్సలు చేసేలా ఏర్పాట్లు చేస్తున్నాం. వారంలో సగం రోజులు ఆపరేషన్లకే కేటాయించాలని భావించాం. మంత్రి హరీశ్రావు చొరవ అభినందనీయం.
– డా.నాగేశ్వర్ రావు, జీజీహెచ్, ఆర్థో విభాగం అధిపతి
మోకాళ్ల సమస్యతో పడే అవస్థలు చెప్పరానిది. అనేక మంది డాక్టర్లకు చూయించుకున్నాను. మం దులు వాడుతున్నాను. నొప్పి తగ్గుతలేదు. ఆపరేషన్ చేయించుకోవాలంటే మస్తుగా పైసల్ అవుతాయని చెప్పిర్రు. నిజామాబాద్ దవాఖానలో ఫ్రీగా మోకాళ్ల ఆపరేషన్ చేసిండ్రు. చాలా సంతోషంగా ఉంది. ఇంట్లోళ్ల లెక్క దవాఖానలో మంచిగా చూసుకుంటున్నారు.
– లలిత, గొట్టుముక్కుల, మాక్లూర్ మండలం