ఖలీల్వాడి, మే 11 : జిల్లా ప్రజల సౌకర్యార్థం నిజామాబాద్ నగరంలో ఏర్పాటు చేసిన సిటీ బస్సులను సద్వినియోగం చేసుకోవాలని ఆర్టీసీ చైర్మన్, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. నిజామాబాద్లోని బస్టాండ్లో ఆరు సిటీ బస్సులను అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తాతో కలిసి ఆయన బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. 30 ఏండ్ల తర్వాత మళ్లీ నిజామాబాద్ నగరంలో ఆర్టీసీ సంస్థ ఆధ్వర్యంలో బస్సులను ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు.
సీఎం కేసీఆర్, ప్రతి ఏటా బడ్జెట్లో రూ.1500 కోట్లు మంజూరు చేస్తున్నట్లు చెప్పారు. జిల్లాలో బస్టాండ్కు స్థలం సరిపోవడం లేదని, సీఎం కేసీఆర్ ఆశీర్వాదంతో నగరంలో త్వరలోనే నూతన బస్టాండ్ను ఏర్పాటు చేస్తామని చెప్పారు. డెయిరీ ఫారం, నిజాంప్యాలెస్, అర్సపల్లి, మాలపల్లి, చార్భాయ్ పెట్రోల్పంప్, గాంధీచౌక్, బస్స్టేషన్, రైల్వేస్టేషన్, కోర్టు చౌరస్తా, తిరుమల టాకీస్, దేవీ టాకీస్ ఎక్స్రోడ్డు, పూలాంగ్, రాజీవ్గాంధీ స్టాచ్యూ, ఆర్యనగర్, వినాయక్నగర్, రిలయన్స్ పెట్రోల్బంక్, మాధవ్నగర్ రూట్లలో నూతన బస్సు సర్వీసులను ప్రారంభించామని వివరించారు.
జిల్లా ప్రజలందరూ సిటీ బస్సుల్లో సురక్షిత ప్రయాణం చేయాలని కోరారు. ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా మాట్లాడుతూ.. నగర ప్రజల సౌలభ్యం కోసం 4 ప్రధానదారుల్లో 6 సిటీ బస్సులను ప్రారంభించామని తెలిపారు. రోజువారీ పనుల కోసం నగరానికి వచ్చే పేద, మధ్యతరగతి ప్రజలకు ఉపయోగపడేలా రూట్ మ్యాప్ని తయారుచేశామని, రూ.10 స్వల్ప టికెట్ చార్జీకాగా రూ.20 అధిక చార్జీ అని తెలిపారు. అతి త్వరలోనే స్థల సేకరణ చేసి మోడర్న్ బస్టాండ్ నిర్మాణ పనులను ప్రారంభిస్తామమన్నారు.
కార్యక్రమంలో జడ్పీచైర్మన్ దాదన్నగారి విఠల్రావు, నగర మేయర్ నీతూకిరణ్, డీసీఎంఎస్ చైర్మన్ సాంబారి మోహన్, నుడా చైర్మన్ ప్రభాకర్రెడ్డి, అడిషనల్ కలెక్టర్ చిత్రామిశ్రా, డీసీవో వెంకటరమణ, టీఆర్ఎస్ నాయకులు తారీఖ్ అన్సారీ, కార్పొరేటర్లు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచులు, ఆర్టీసీ ఆర్ఎం, డీవీఎం, డీఎం, సిబ్బంది పాల్గొన్నారు.