వేల్పూర్, మే 8: ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన అనంతరం వ్యవసాయ అభివృద్ధికి సీఎం కేసీఆర్ ఎంతో కృషి చేస్తున్నారని డీసీసీబీ వైస్ చైర్మన్ రమేశ్రెడ్డి, టీఆర్ఎస్ మండల కన్వీనర్ నాగధర్, రామన్నపేట్ సొసైటీ చైర్మన్ మోహన్రెడ్డి అన్నారు. వేల్పూర్లో ఆదివారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. గతంలో రైతులు వ్యవసాయం చేయాలంటే ఎన్నో ఇబ్బందులు పడ్డారని, పండించిన పంటను అమ్ముకునేందుకు కూడా దళారుల చేతిలో మోసపోయారన్నారు. రైతుల గోస తెలిసిన సీఎం కేసీఆర్.. సాగునీరు, ఉచిత విద్యుత్, నాణ్యమైన విత్తనాలు అందేలా కృషిచేస్తున్నారని చెప్పారు.
బీడు భూములన్నీ సాగు భూములుగా మారాయని తెలిపారు. అర్వింద్ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పసుపు బోర్డును ఏర్పాటుచేయాలని రైతులు ఆందోళన చేస్తున్నారని చెప్పారు. బోర్డు ఏర్పాటుచేస్తే పసుపునకు గిట్టుబాటు ధర లభిస్తుందని చెప్పారు. అర్వింద్ రైతులను విమర్శించడం సరికాదన్నారు. మండలంలోని కుకునూర్ గ్రామానికి చెందిన వీర జవాన్ ర్యాడ మహేశ్ చనిపోయిన రోజున బీజేపీ నాయకులు వచ్చారని, అనంతరం బాధిత కుటుంబం గురించి ఆలోచించలేదన్నారు. వీర జవాన్ కుటుంబాన్ని ఆదుకోవాలని మంత్రి ప్రశాంత్రెడ్డి సీఎం కేసీఆర్కు విన్నవించగా.. బాధిత కుటుంబానికి రూ.50లక్షల ఆర్థిక సహాయంతో పాటు ప్లాటు మంజూరు చేసి ఔదార్యం చాటుకున్నారని తెలిపారు.
ఏప్రిల్ 14న నియోజకవర్గంలో ధాన్యం కొనుగోళ్లు ప్రారంభం అయ్యాయని, ఇప్పటి వరకు 35వేల క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు చేసినట్లు వారు తెలిపారు. 50 శాతం ధాన్యం కొనుగోళ్లు పూర్తయ్యాయన్నారు.
రైతులు విక్రయించిన ధాన్యానికి సంబంధించి ఇప్పటికే రూ.35 కోట్లు వారి బ్యాంకు ఖాతాల్లో జమచేసినట్లు చెప్పారు. నియోజకవర్గంలో మంత్రి ప్రశాంత్రెడ్డి రూ.500 కోట్ల వ్యయంతో అభివృద్ధి పనులను చేయించారని, ఎంపీ అర్వింద్ ఏం చేశారో బీజేపీ నాయకులు వివరించాలని సవాల్ విసిరారు. సమావేశంలో సాహెబ్పేట్ సర్పంచ్ సుధాకర్గౌడ్, టీఆర్ఎస్ నాయకులు కుమ్మరి రాజన్న, ఏలేటి మోహన్ తదితరులు పాల్గొన్నారు.