మాచారెడ్డి, మే 8: దుష్టులను దండిస్తూ, భక్తులపై అపార కారుణ్యాన్ని కురిపించే మహిమాన్వితుడు శ్రీలక్ష్మీ నృసింహస్వామి. భక్తుల కొంగుబంగారంగా విలసిల్లుతూ కోరిన కోర్కెలు నెరవేరుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలంలోని చుక్కాపూర్ గ్రామ అటవీ ప్రాంతంలో కొండపై వర్ధిల్లుతున్నాడు లక్ష్మీనృసింహస్వామి. నేటి (సోమవారం) నుంచి శ్రీలక్ష్మీనృసింహస్వామి బ్రహ్మోత్సవాలు నిర్వహించేందుకు సర్వంగా సుందరంగా ముస్తాబైంది.
400 ఏండ్ల క్రితం చోళరాజవంశ పాలనలో నిర్మించబడిన ఈ ఆలయానికి ఓ కథ ప్రాచూర్యంలో ఉన్నది. ప్రస్తుతం ఉన్న ఆలయ ప్రాంగణానికి సమీపంలో ఒక పరుపు బండ ఉంది. ఆ బండ మీద రెండు పురాతన హరిహరుల ఆలయాలు ఉన్నాయి. ఈ ఆలయాల్లో లక్ష్మీనృసింహ స్వామి విగ్ర హం కింద నిధి ఉన్నదనే ఉద్దేశంతో పూర్వకాలం పెండారులు (ఆకాలం నాటి దొంగలు) దోచుకునే ప్రయత్నం లో ఆలయం ముందు గడప ఎదుట నల్లని గోమాతను బలి ఇచ్చారు. దీంతో నృసింహస్వామి ఆగ్రహంతో భూమి,ఆకాశం దద్దరిల్లింది. ఉదయం పూజ చేసేందుకు వచ్చిన అర్చకులకు స్వామివారి విగ్రహం కనిపించలేదు. అదే రోజు అర్చకుల కలలోకి వచ్చిన స్వామి మంగబావిలో ఉన్నానని చెప్పాడు. గ్రామస్తులంతా కలిసి మంగబావిలోనుంచి స్వామి వారి విగ్రహాలను తీసి తెల్లని గుర్రంపై తీసుకువస్తుండగా మధ్యలో గుర్రం ఆగిపోయింది. తనను ఇక్కడే ప్రతిష్ఠించండంటూ ఆకాశవాణి వినిపించడంతో అక్కడే స్వామివారి విగ్రహాన్ని ప్రతిష్ఠించినట్లు ఆలయ చరిత్ర చెబుతోంది.
శ్రీలక్ష్మీనృసింహుని బ్రహ్మోత్సవాలను తొమ్మిది రోజుల పాటు నిర్వహిస్తారు. ఈ నెల 9,10,11 తేదీల్లో శ్రీవిష్ణుసహస్రనామ స్తోత్రపారాయణం, అధ్యయనోత్సవం, తిరుప్పావై సేవాకాలం, బాల భోగనివేదన, పరమ పదోత్సవంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. 12న పుణ్యహవాచనము, రక్షాబంధనము, 13న యాగశాల ప్రవేశం, ధ్వజరోహణం, పూర్ణాహుతి, బలిహరణం, తీర్థప్రసాద వితరణ, 14న ఉత్సవ మూర్తులకు నవ కలశ స్నపనము, 15న అష్టోత్తర శతఘటాభిషేకం, అదేరోజు సాయంత్రం జయంతి సందర్భంగా డోలోత్సవం నిర్వహిస్తారు. 16న లక్ష్మీనృసింహస్వామి కల్యాణం, రథోత్సవం, అన్నదాన కార్యక్రమం, 17న చక్రతీర్థోత్సవంతో బ్రహ్మోత్సవాలు సంపూర్ణమవుతాయి.