తాగిన మైకం… డ్రైవర్ నిర్లక్ష్యం….తొమ్మిది నిండు ప్రాణాలను బలితీసుకున్నది. పిట్లం మండలం చిల్లర్గి గ్రామానికి చెందిన మానయ్య అనే వ్యక్తి నాలుగు రోజుల క్రితం మరణించగా బాధిత కుటుంబ సభ్యులను అంగడి తిప్పేందుకు (కల్లు తాగించే ఆచారం) వారి సమీప బంధువులు మొత్తం 26 మంది టాటాఏస్ వాహనంలో ఎల్లారెడ్డికి వచ్చి తిరిగి వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకున్నది. మండలంలోని అన్నాసాగర్ తండా సమీపంలో ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టడంతో ఇద్దరు అక్కడికక్కడే మృత్యువాత పడగా దవాఖానకు తరలిస్తుండగా మరో ఏడుగురు మృతి చెందారు. పరిమితికి మించి వాహనంలో ప్రయాణికులు ఎక్కడంతో ప్రమాద తీవ్రత పెరిగింది.
ఎల్లారెడ్డి రూరల్/బాన్సువాడ, మే 8 : కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం అన్నాసాగర్ తండా సమీపంలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తొమ్మిది మంది మృతి చెందగా.. 17 మంది గాయపడ్డారు. సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. పిట్లం మండలం చిల్లర్గి గ్రామానికి చెందిన మానయ్య నాలుగు రోజుల క్రితం మృతి చెందాడు. ఆయన కుటుంబ సభ్యులను అంగడి తిప్పేందుకు (కల్లు తాగించే ఆచారం) వారి కుటుంబ సభ్యులతో పాటు బంధువులు 26 మంది ఎల్లారెడ్డికి వచ్చి తిరిగి వెళ్తుండగా… మండలంలోని అన్నాసాగర్ తండా సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ఎల్లారెడ్డి నుంచి చిల్లర్గికి బయల్దేరిన టాటా ఏస్ వాహనం ఎదురుగా వస్తు న్న లారీని ఢీ కొట్టడంతో టాటాఏస్ డ్రైవర్ సాయిలు (35), సదర్పల్లి లచ్చవ్వ (60) సంఘటనా స్థలంలోనే మృతి చెందారు.
ప్రమాదంలో గాయపడిన 13 మందిని బాన్సువాడ వైద్యశాలకు తరలించగా సాయవ్వ (38), లచ్చవ్వ (38) మృతిచెందారు. వీరిలో 8 మంది పరిస్థితి విషమంగా ఉండడంతో నిజామాబాద్ దవాఖానకు తరలించారు. మరో ముగ్గురు బాన్సువాడలోని ఓ ప్రైవేటు దవాఖానలో చికిత్స పొందుతున్నారు. నిజామాబాద్కు తరలించిన వారిలో వీరమ్మ (70), వీరమణి (35), పోచయ్య (60), ఎల్లయ్య (53) చికిత్స పొందుతూ మృతి చెందా రు. గాయపడిన మరో 11 మందిని ఎల్లారెడ్డి ప్రభుత్వ వైద్యశాలకు తరలించి చికిత్స అందిస్తుండగా మురగల్ల అంజవ్వ (35) మృతి చెందింది. మిగతా పది మంది పోచయ్య, లక్ష్మి, సాయవ్వ, సాయిరాం, బాల య్య, సాయవ్వ, గంగవ్వ, దేవయ్య, సుశీల, సాయిలుకు తీవ్ర గాయాలు కావడంతో డాక్టర్లు చికిత్స అందిస్తున్నారు. డ్రైవర్ సైతం కల్లు తాగడంతోనే ప్రమాదం చోటు చేసుకున్నదని చికిత్స పొందుతున్న వారు తెలిపారు.
మృతుని కుటుంబ సభ్యులను ఓదార్చేందుకు ఆచరించే అంగడి తిప్పే కార్యక్రమం.. వారి కుటుంబానికి శాపంగా మారింది. బాధిత కుటుంబ సభ్యులను ఎల్లారెడ్డికి అంగడికి తీసుకువచ్చి వారిని ఓదార్చే ప్రయత్నంలో భాగంగా కల్లు తాగించారు. వీరి వెంట వచ్చిన టాటాఏస్ డ్రైవర్ సైతం కల్లు తాగడంతోనే ఘోర ప్రమాదం సంభవించిందని చికిత్స పొందుతున్న వారు పేర్కొన్నారు. చిల్లర్గి నుంచి టాటా ఏస్ వాహనంలో పరిమితికి మించి మంది ఎక్కడంతో ప్రమాద తీవ్రత పెరిగింది. మానయ్య కుటుంబ సభ్యులతో పాటు దగ్గరి బంధువులు, చుట్టుపక్కల వారు వచ్చి ప్రమాదంలో గాయపడడంతో వారి కుటుంబంలో తీవ్ర ఆందోళన నెలకొన్నది.
మండలంలోని అన్నాసాగర్ తండా వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంతో సుమారు గంట పాటు ట్రాఫిక్ నిలిచిపోయింది. ఎల్లారెడ్డి వైపు నుంచి వెళ్తున్న ఆటో ఎదురుగా వస్తున్న లారీని ఢీకొనడంతో ఇరువైపులా ట్రాఫిక్ నిలిచిపోయింది. ఆటోలో ప్రయాణిస్తున్న 26 మందిలో ఇద్దరు అక్కడిక్కడే చనిపోగా మిగతా వారికి తీవ్రగాయాలు కావడంతో స్థానికులు, పలు వాహనాలను నిలిపి గాయపడిన వారిని వైద్యశాలకు తరలించే ప్రయత్నం చేశారు. టాటాఏస్ వాహనం నడిరోడ్డుపై ఉండడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి.
ప్రమాద సమాచారం అందిన వెంటనే అధికారులు స్పందించారు. అన్నాసాగర్తండా వద్ద జరిగిన ప్రమాదం విషయం తెలుసుకున్న ఎల్లారెడ్డి సీఐ శ్రీనివాస్, ఎస్సై గణేశ్ సిబ్బందితో కలిసి ప్రమాద స్థలానికి చేరుకొని అంబులెన్స్లకు సమాచారం అందించారు. ఎల్లారెడ్డి, బాన్సువాడ నుంచి వచ్చిన అంబులెన్స్లలో క్షతగాత్రులను వెంటనే తరలించారు. సంఘటనా విషయం తెలిసి ఎల్లారెడ్డి అగ్నిమాపక సిబ్బంది సైతం ప్రమాదస్థలికి చేరుకొని సేవలు అందించారు. సంఘటనా స్థలానికి దగ్గరలో ఉన్న నిజాంసాగర్ పోలీసులు సైతం వచ్చి సేవలను అందించారు.