బోధన్, మే 5: దళితులను అన్ని విధాలుగా ఆదుకుంటామని బోధన్ ఎమ్మెల్యే షకీల్ అన్నారు. దళితబంధు పథకం లబ్ధిదారుల కుటుంబాల్లో సంతోషాన్ని నింపిందన్నారు. దళితబంధు పథకంలో భాగంగా లబ్ధిదారులు కొనుగోలు చేసిన వాహనాలను గురువారం పట్టణంలోని ఆయన నివాసంలో లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశంలో ఎక్కడాలేని విధంగా సీఎం కేసీఆర్ దళితబంధు పథకం రూపొందించి అమలుచేస్తున్నారని అ న్నారు.
తమది మాటల ప్రభుత్వం కాదని, చేతల ప్రభుత్వమని నిరూపించారని అన్నారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలోనే సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు. దళితబంధు పథకంలో పలువురు లబ్ధిదారులు వాహనాలు కొనుగోలు చేసి ప్రారంభోత్సవానికి తమ వద్దకు కుటంబసభ్యులతో కలిసి రావడం, వారి ముఖాల్లో సంతోషం తనకు ఎంతో ఆనందాన్ని కలిగించిందన్నారు. దళితబంధు పథకం లబ్ధిదారులు రాబోయే రోజుల్లో ఆర్థికాభివృద్ధి సాధించాలని సూచించారు.
ఎన్నో సంక్షేమ పథకాలతో లబ్ధిపొందుతున్న వారితోపాటు బోధన్ నియోజవర్గం తరఫున సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటామని, వారికి పాదాభివందనాలు తెలుపుతున్నామన్నారు. ఈ సందర్భంగా ఆయన రెండు ట్రాక్టర్లు, రెండు కార్లకు ప్రారంభోత్సవం చేశారు. అనంతరం లబ్ధిదారులు ఎమ్మెల్యే షకీల్కు స్వీట్లు తినిపించి, సన్మానం చేశారు. బోధన్ మండలంలోని సిద్దాపూర్ గ్రామానికి చెందిన లక్ష్మణ్, ఎరాజ్పల్లి గ్రామానికి చెందిన చిన్న బాలయ్య, హున్సా గ్రామానికి చెందిన నాగురావు ట్రాక్టర్లు కొనుగోలు చేశారు. ఎడపల్లి మండలంలోని జంలం గ్రామానికి చెందిన పో శెట్టి, జానకంపేట్ గ్రామానికి చెందిన ఎంబ రాజేశ్వర్ స్విఫ్ట్ డిజైర్ కార్లు కొనుగోలు చేయగా వాటిని ఎమ్మెల్యే షకీల్ లాంఛనంగా అందజేశారు.