బాన్సువాడ, మే 5 : ప్రభుత్వం అనేది వ్యాపార సంస్థ కాదని, సేవా సంస్థ అని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. ఒక వ్యాపారి తన వ్యాపారంలో ఎంత లాభం వచ్చిందో ఎలా చూసుకుంటాడో, ప్రభుత్వం కూడా వచ్చే రాష్ట్ర సంపదను చూసి ఏ వర్గానికి న్యాయం చేయాలని ఆలోచిస్తుందన్నారు. అన్ని వర్గాలకూ న్యాయం చేస్తున్న మంచి ముఖ్యమంత్రి కేసీఆర్ అని కొనియాడారు. బాన్సువాడ డివిజన్ కేంద్రంలో రూ. 10 లక్షలతో చేపట్టనున్న పీఆర్టీయూ నూతన భవన నిర్మాణానికి గురువారం ఆయన శంకుస్థాపన చేసి , భూమి పూజ చేశారు. అనంతరం ఉపాధ్యాయ సంఘం ఏర్పాటు చేసిన సమావేశంలో స్పీకర్ మాట్లాడారు.
తెలంగాణ వచ్చింది మన రాష్ర్టాన్ని అభివృద్ధి చేసుకోవడానికి అని, ఏదో ఒక వర్గాన్ని సంతోషపెట్టడానికి కాదన్నారు. కార్మికులు, రైతులు, ఉద్యోగస్తులు, మహిళలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, నిరుద్యోగులు ఇలా ప్రతి వర్గానికి రాష్ట్ర సంపదను ఏ విధంగా పంచిపెట్టాలని సీఎం కేసీఆర్ మంచి ఆలోచన చేశారన్నారు. ప్రతి మూడు మాసాలకు ఒకసారి లెక్కలు వేసుకొని, రాష్ట్ర సంపదను దృష్టిలో ఉంచుకొని ప్రజలకు సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టాలని నిర్ణయం తీసుకుంటారని తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితులను బట్టి నిర్ణయాలు ఉంటాయన్నారు. తాను సీఎం కేసీఆర్ సూచన మేరకు గతంలో రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు చేశానని, మంత్రిగా ఉత్తమ ఫలితాలు సాధించినట్లు తెలిపారు. బాన్సువాడ నియోజక వర్గ అభివృద్ధే తన లక్ష్యమన్నారు. స్పీకర్గా వేల కోట్ల రూపాయలు నిధులు తెచ్చి బాన్సువాడ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నట్లు తెలిపారు. అనంతరం స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డిని పీఆర్టీయూ ఉపాధ్యాయ సంఘం నాయకులు శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో పీఆర్టీయూ జిల్లా కార్యదర్శి కుశాల్, బాన్సువాడ మండల అధ్యక్ష , కారదర్శులు నర్వ శ్రీనివాస్, మంద ప్రవీణ్కుమార్ , పోశెట్టి, శ్రీనివాస్, లక్క నరహరి, వెంకటరమణారావు, దొండోబా తదితరులు పాల్గొన్నారు.
బాన్సువాడ డివిజన్ కేంద్రంలోని సీయూపీఎస్ అభివృద్ధి కోసం రిటైర్డ్ ప్రిన్సిపాల్ శ్రీనివాస్ రూ.25 వేలను స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా రిటైర్డ్ ప్రిన్సిపాల్ శ్రీనివాస్ను స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అభినందించారు. కార్యక్రమంలో ఆర్డీవో రాజాగౌడ్ , రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్ డాక్టర్ అంజిరెడ్డి, మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్, వైస్ చైర్మన్ షేక్ జుబేర్, ఏఎంసీ చైర్మన్ పాత బాలకృష్ణ, సొసైటీ అధ్యక్షుడు ఏర్వాల కృష్ణారెడ్డి, పిట్ల శ్రీధర్, జడ్పీటీసీ పద్మాగోపాల్రెడ్డి, మహ్మద్ ఎజాస్, కౌన్సిలర్ బాడి శ్రీనివాస్, బాబా, హకీం, రఫీ పాల్గొన్నారు.