ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు సంక్షేమం కరువైంది.. అంతటా సంక్షోభమే నెలకొంది. బీడువారిన భూములు.. మోడువారిన బతుకులు.. ఎవరిని కదిలించినా కన్నీళ్లే. కర్షకులకు ‘మద్దతు’ లేదు.. సరిపడా కరెంట్ సరఫరా లేదు. కార్మికులకు చేతి నిండా పని లేదు. కాంగ్రెస్ పాలనలో అంతా ‘హస్త’వ్యస్తమే. కానీ తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత బతుకుచిత్రం మారింది. ఉద్యమ నేత కేసీఆర్ పగ్గాలు చేపట్టిన తర్వాత ప్రగతి రథ చక్రాలు పరుగులు పెట్టాయి. సంక్షేమ ఫలాలు ప్రజలకు చేరువయ్యాయి. సాగునీటికి ప్రాధాన్యం ఇవ్వడంతో దుర్భర పరిస్థితులు దూరమయ్యాయి. సంక్షేమ పథకాల అమలుతో పేదల కష్టాలు తొలగిపోయాయి. సమైక్య పాలన నుంచి విముక్తి లభించాక స్వరాష్ట్ర ఆకాంక్షలను తెలంగాణ సమాజం ఆస్వాదిస్తోంది.
కామారెడ్డి, మే 5: వ్యవసాయన్నే నమ్ముకున్న రైతులు పడుతున్న కష్టాలను ఉద్యమ నాయకుడిగా ప్రత్యక్షంగా చూసిన సీఎం కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత వారి కోసం అనేక సంక్షేమ పథకాలకు రూపకల్పన చేశారు. అందులో భాగంగానే 2018 వానకాలం సీజన్లో రైతుబంధు పథకాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించారు. మొదట ఎకరానికి రూ.4వేల చొప్పున అందించి..
ఆ తర్వాత పెట్టుబడి సరిపోకపోవడంతో ఎకరానికి రూ.5వేలకు పెంచారు. ప్రభుత్వం ఇస్తున్న ఈ ప్రోత్సాహంతో రైతులకు ఆర్థికభారం తగ్గింది. వానకాలం, యాసంగి సీజన్ల ప్రారంభంలోనే రైతుబంధు పెట్టుబడి సహాయం అందిస్తున్నది. దీంతో రైతులకు ఎరువులు, విత్తనాలు, సాగు ఖర్చులకు ఉపయోగపడుతున్నది. కామారెడ్డి జిల్లాలో రైతుబంధు ఆర్థిక సహాయం 2,62,841 మంది రైతులకు అందుతున్నది. వీరి కోసం రూ.254 కోట్ల 12 లక్షల 37వేల 824 విడుదల చేస్తున్నట్లు జిల్లా వ్యవసాయశాఖ అధికారులు వెల్లడించారు.
తెలంగాణ సిద్ధించిన తర్వాత అమరవీరుల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వ పరిపాలన కొనసాగుతున్నది. నీళ్లు, నిధులు, నియామకాలు ట్యాగ్లైన్ను నిజం చేస్తూ మన నిధులను మనకే, సాగుకు గోదావరి, కృష్ణా జలాలను మళ్లిస్తున్నారు. మన ఉద్యోగాలు మనకే దక్కేలా కృషి చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో ఉన్నప్పుడు తెలంగాణ ఉద్యోగాలను ఆంధ్రా ప్రాంతం వారు కొల్లగొట్టేది. మన నీళ్లు మనకు దక్కకుండా దిగువకు మళ్లించుకునేది. మన నిధులను దొడ్డిదారిలో కోస్తాంధ్ర వరద సాయానికి, రాయలసీమ కరువు ప్రాంతానికే మళ్లించేది. కష్టమొచ్చి సాయం చేయమంటే తెలంగాణకు మొండిచేయి చూపిన ఘనులు హస్తం పార్టీకి చెందిన నాటి పాలకులు. సమైక్య పాలన నుంచి విముక్తి సిద్ధించిన తర్వాత స్వరాష్ట్ర ఆకాంక్షలను తెలంగాణ సమాజం ఆస్వాదిస్తున్నది.
రాష్ట్రం వచ్చిన తర్వాత కేసీఆర్ రైతులకు సహాయం చేసే దేవుడిగా మారాడు. కాంగ్రెస్ హయాంలో అప్పుల కోసం అనేక ఇబ్బందులు పడేవాళ్లం. సీఎం కేసీఆర్ రైతుబంధు పథకం పెట్టి మా గుండెల్లో దేవుడిగా మారాడు. పంట పెట్టుబడి కోసం ఏటా ఎకరానికి రూ.5వేలు ఇస్తూ కష్టాలు తీరుస్తున్నడు. రైతుబంధు సకాలంలో అందడంతో అప్పుల ఊబి నుంచి గట్టెక్కినం.
– అంజల్రెడ్డి, రైతు, లింగాయిపల్లి
రాష్ట్ర సాధన అనంతరం నిమిషం కూడా కరెంటు పోతలేదు. గతంలో చాలీచాలని కరెంటు సరఫరాతో పంటలు ఎండిపోయేవి. 24 గంటల ఉచిత విద్యుత్తో బోరుమోటర్ల ద్వారా పుష్కలంగా సాగు నీరందుతుంది.
-దడిగె భూమయ్య, రైతు,మైలారం
నిరుపేదలు ఉన్న ఆడపిల్లల తల్లిదండ్రులు అప్పుల పాలు కాకుండా సీఎం కేసీఆర్ కల్యాణలక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టారు. ఆడబిడ్డల పెండ్లికి రూ.లక్షా116తో చేయూతనివ్వడం సంతోషించాల్సిన విషయం. గతం లో ఏ ప్రభుత్వమూ ఇలాంటి పథకాలు ప్రవేశపెట్టలేదు.
-బోదాసు యమున, నస్రుల్లాబాద్.
సీఎం కేసీఆర్ నూతనంగా ప్రవేశపెట్టిన మన ఊరు -మన బడి కార్యక్రమంతో ప్రభుత్వ పాఠశాలలకు పునరుజ్జీవం లభించింది. గతంలో ఏ ప్రభుత్వాలు పాఠశాలలను పట్టించుకోలేదు. ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రారంభించి నిరుపేద కుటుంబాల పిల్లలకు ఇంగ్లిష్ మీడియం చదువులు ఉచితంగా అందిస్తూ సన్నబియ్యంతో భోజనాన్ని అందిస్తున్నారు.
-సి. సుదర్శన్రెడ్డి, ఉపాధ్యాయుడు, పిట్లం
నా కూతురుకు పెండ్లి చేసిన. తెలంగాణ ప్రభుత్వం కల్యాణలక్ష్మి పథకం కిం ద రూ.లక్షా116 అందజేసింది. దీంతో అప్పు లేకుండా పెండ్లి చేసి పంపించిన. నా భార్యకు నెలనెలా బీడీల పింఛన్ వస్తున్నది. నాలుగు ఎకరాల భూమికి రైతుబంధు సాయం అందుతున్నది.
-తోట నాగన్న, రైతు, బాల్కొండ
రైతుబంధుతో మా కష్టాలు తీరాయి. ఎరువులు, విత్తనాలకు ఉపయోగపడుతున్నాయి. నాకున్న ఐదు ఎకరాలకు రూ.25వేలు చొప్పున రైతుబంధు వస్తుంది. నా బిడ్డ పెండ్లికి కల్యాణలక్ష్మి చెక్కు ఇచ్చారు. నాకు నెలనెలా పింఛన్ వస్తున్నది.
-వాచర్ మల్లయ్య, రైతు,ఇందల్వాయి
రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు ప్రతి గ్రామంలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి మద్దతు ధర అందిస్తున్నది. కేంద్రప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు పెట్టినా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కొనుగోలు చేసి రైతులను ఆదుకున్న ఘనత సీఎం కేసీఆర్కే దక్కింది.
-మహేశ్, రైతు,బాల్కొండ
కేసీఆర్ సీఎం అయ్యాక ప్రాధాన్యత అంశంగా చేపట్టిన పథకాల్లో మిషన్ కాకతీయ ఒకటి. పూడికతీతతో నిల్వ నీటి సామర్థ్యాన్ని పెంచడంతో భూగర్భ జలాలను వృద్ధిలోకి తీసుకువచ్చారు. అంతే కాకుండా ఆయా చెరువు కింది ఆయకట్టు రైతులకు నీటి గోసను తీర్చారు. ఉమ్మడి జిల్లాలో వేలాది చెరువులను బాగు చేయడం ద్వారా లక్షలాది ఎకరాలకు ఆయువు పట్టుగా నిలిచిందనడంలో అతిశయోక్తి కాదు. నాడు కాంగ్రెస్ పాలనలో చెరువులను కబ్జా చేసి రైతుల పొట్ట కొట్టిన వారే అధికం. వాటిని పునరుద్ధరించాలనే ఆలోచన చేసిన నాయకుడు హస్తం పార్టీలో ఒక్కరూ కనిపించకపోవడం దురదృష్టం. ఇక ఎస్సారెస్పీకి జలకళ సంతరించుకోవడంలో సీఎం కేసీఆర్ గొప్పతనం దాగి ఉన్నది.
గతంలో బాబ్లీ ప్రాజెక్టు, ఎగువ మహారాష్ట్ర అక్రమ ప్రాజెక్టులతో శ్రీరాంసాగర్ బోసిపోయేది. పునరుజ్జీవ పథకం పుణ్యానా నేడు వరద కాలువ నుంచి ఎదురొస్తున్న గోదావరి నీళ్లు ఏకంగా ఎస్సారెస్పీకి అండదండగా నిలవడంలో ఎవరి గొప్పతనం ఉందో రైతులకు అవగతం అవుతుంది. అంతేకాకుండా ఎక్కడి నుంచో దారి మళ్లించిన గోదావరి జలాలను కొండపోచమ్మ సాగర్ నుంచి హల్దీ వాగు మీదుగా మంజీరపై నిర్మించిన నిజాంసాగర్ ప్రాజెక్టుకు తరలించి చారిత్రక ప్రాజెక్టుకు జీవం పోసిన సందర్భమూ తెలంగాణలోనే సంతరించుకోవడం విశేషం. ఇలా చెప్పుకుంటూ పోతే ఉమ్మడి జిల్లాలో స్వరాష్ట్రంలో చేకూరిన లాభాలు కోకొల్లలు.
తెలంగాణ సిద్ధించిన తర్వాత అమరవీరుల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వ పరిపాలన కొనసాగుతున్నది. నీళ్లు, నిధులు, నియామకాలు ట్యాగ్లైన్ను నిజం చేస్తూ మన నిధులను మనకే, సాగుకు గోదావరి, కృష్ణా జలాలను మళ్లిస్తున్నారు. మన ఉద్యోగాలు మనకే దక్కేలా కృషి చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో ఉన్నప్పుడు తెలంగాణ ఉద్యోగాలను ఆంధ్రా ప్రాంతం వారు కొల్లగొట్టేది. మన నీళ్లు మనకు దక్కకుండా దిగువకు మళ్లించుకునేది. మన నిధులను దొడ్డిదారిలో కోస్తాంధ్ర వరద సాయానికి, రాయలసీమ కరువు ప్రాంతానికే మళ్లించేది. కష్టమొచ్చి సాయం చేయమంటే తెలంగాణకు మొండిచేయి చూపిన ఘనులు హస్తం పార్టీకి చెందిన నాటి పాలకులు. సమైక్య పాలన నుంచి విముక్తి సిద్ధించిన తర్వాత స్వరాష్ట్ర ఆకాంక్షలను తెలంగాణ సమాజం ఆస్వాదిస్తున్నది.
కాంగ్రెస్ కబంధ హస్తాల నుంచి విముక్తి పొంది కొత్త రాష్ర్టానికి ఉద్యమ నాయకుడినే ముఖ్యమంత్రిగా వరుసగా రెండుసార్లు ప్రజలు గద్దెనెక్కించారు. ప్రజల విశ్వాసానికి తగ్గట్లుగా కేసీఆర్ దాదాపుగా ఏడున్నరేండ్లుగా సబ్బండ వర్గాలకు సంక్షేమాన్ని అందిస్తూ యావత్ దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఒకప్పుడు తెలంగాణ అంటేనే చిన్నచూపు చూసే వారంతా ఇప్పుడు తెలంగాణ అభివృద్ధిని పరిశీలించేందుకు కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ర్టాల నుంచి మంత్రులు, ఐఏఎస్ అధికారుల బృందాలు క్యూ కడుతుండడమే ఇందుకు నిదర్శనం.
ఎవరెన్ని మాటలు చెప్పినా తెలంగాణకు కేసీఆరే శ్రీరామరక్ష. ఆయనే లేకుంటే పడావు పడ్డ భూములు నేడు పచ్చగా కనిపించకపోయేవి. వెలవెలబోయిన చెరువులకు పూర్వవైభవం వచ్చేదే కాదు. బోసిపోయిన జీవనది గోదావరికి తిరిగి జలకళ సంతరించుకునే అవకాశాలే లేకుండేది. సాగుకు నీళ్లు కావాలంటే రైతులంతా రోడ్లపై ధర్నాలు, రాస్తారోకోలకే సగం దినాన్ని వెచ్చించాల్సి వచ్చేది. కరెంట్ కోసం వేయి కండ్లతో వేచి చూసి అలసి సొలసి పొలాల వద్దే తనువు చాలించేది.
లేదంటే బీడు బారిన భూములను చూసి కుచించుకు పోయి దీనవస్థలతో రైతులు కొట్టుమిట్టాడేది. కేసీఆర్ రావడంతో.. తెచ్చుకున్న తెలంగాణకు వరుసగా ముఖ్యమంత్రి కావడంతోనే నేడు తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అభివృద్ధి, సంక్షేమంలో నంబర్ వన్గా నిలుస్తున్నది. నిజామాబాద్, కామారెడ్డి వంటి జిల్లాల్లో గోదావరి జలాలను మళ్లించాలనే ఆలోచన గతంలో ఏ నాయకుడు చేయలేదు. కాంగ్రెస్ పాలనలో ఇసుమంతైనా రైతు కోసం పాటుపడిన దాఖలాలే లేవు. బోధన్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి ఇరిగేషన్ మంత్రిగా పని చేసిన సుదర్శన్ రెడ్డి సైతం ఈ ప్రాంతాన్ని పట్టించుకోలేదు కదా కనీసం సాగు నీటి సౌకర్యాలపై సమైక్య పాలకులను ప్రశ్నించనే లేదు.
సీఎం కేసీఆర్ రైతులను ఆదుకునేందుకు ప్రవేశపెట్టిన రైతుబంధు పథకం దేశానికే ఆదర్శంగా నిలిచింది. రైతు కుటుంబాలను ఆదుకునేందుకు రైతుబీమా పథకాన్ని ప్రవేశపెట్టి రైతు మరణిస్తే బాధిత కుటుంబానికి తక్షణమే రూ.5లక్షలు అందేలా చేసిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కింది. రైతుల కోసం గతంలో ఏ ప్రభుత్వాలూ ఇలా చేయలేదు. వ్యవసాయ రంగానికి పెద్దపీట వేసిన సీఎం కేసీఆర్ మరిన్ని కాలాల పాటు కొనసాగాలి.
– ఎ. దేవేందర్రెడ్డి, పిట్లం
కాళేశ్వరం నీటిని మల్లన్నసాగర్లోకి తీసుకొచ్చి అక్కడి నుంచి నిజాంసాగర్ ప్రాజెక్టులోకి తీసుకొచ్చేందుకు చేపట్టిన బృహత్ ప్రణాళికతో ఆయకట్టు రూపురేఖలు మారనున్నాయి. ఇప్పటికే కాళేశ్వరం నీళ్లు నిజాంసాగర్ను ముద్దాడాయి. కాళేశ్వరం నీటితో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో సాగర్ ఆయకట్టు రైతుల భూములు సస్యశ్యామలం కానున్నాయి. నిజాంసాగర్ ఎల్లప్పుడూ నిండుకుండలా ఉంటూ పూర్వవైభవాన్ని సంతరించుకోనున్నది.
– విఠల్, ఇబ్రహీంపేట, బాన్సువాడ.
భవిష్యత్ తరాలను దృష్టిలో పెట్టుకొని రాష్ర్టాన్ని హరిత తెలంగాణాగా తీర్చిదిద్దేందుకు సీఎం కేసీఆర్ అమలు చేసిన హరితహారంతో గ్రామీణ ప్రాంతాలు హరితశోభను సంతరించుకున్నాయి. ఏటా మొక్కలను నాటడంతో పచ్చదనం పెరిగి వర్షాలు సైతం పుష్కలంగా కురుస్తున్నాయి. సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలతో తెలంగాణ గ్రామీణ ప్రాంతాలు దేశంలోనే ఆదర్శ గ్రామాలుగా రూపుదిద్దుకుంటున్నాయి.
-హర్జ్యానాయక్, పోచారం తండా, బాన్సువాడ
మాకు ఇద్దరు మగ పిల్లలు, ఒక ఆడబిడ్డ. మా ఆయన గల్ఫ్కు పోయిండు. నేను కూలీ పని చేస్త. పని దొరకకుంటే బీడీలు చేస్త. కేసీఆర్ ప్రభుత్వం వచ్చినంకనే మా కష్టాలు తీరినయి. మాకు 6 ఎకరాల భూమి ఉంది. సాగు కోసం పైసలు లేక ఏండ్ల సంది పంటలు వేయలేదు. రైతుబంధు ఇచ్చుడుతోని పంటలు ఏసుడు షురూ చేసిన. నాకు బీడీ పెన్షన్ అస్తుంది. ఈ మధ్యే బిడ్డ పెండ్లి చేసిన. కల్యాణలక్ష్మి కింద లచ్చ రూపాయలు అచ్చినయి. పెట్టువడి సాయం, పింఛన్ ఇస్తున్న కేసీఆర్ సారుకు రుణపడి ఉంటాం.
– టేకులపల్లి లక్ష్మి, వేల్పూర్