నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే సంయుక్తంగా నిర్వహిస్తున్న ఆటో షో రెండోరోజైన శనివారం ఉత్సాహపూరిత వాతావరణంలో కొనసాగింది. నిజామాబాద్ కలెక్టరేట్ మైదానం వేదికగా మూడురోజులపాటు నిర్వహిస్తున్న ఈ ఆటోమొబైల్ ప్రదర్శనకు సందర్శకులు పెద్దసంఖ్యలో తరలివస్తున్నారు. ఉచిత ప్రవేశంతోపాటు వీకెండ్ కూడా కావడంతో కుటుంబసమేతంగా వచ్చి వాహనాలను తిలకిస్తున్నారు. 24 స్టాళ్లలో అంతర్జాతీయ బ్రాండ్లు, ఆధునిక మోడల్ వాహనాలు అందుబాటులో ఉండగా.. నేటితో ఈ ప్రదర్శన ముగియనున్నది.
ఖలీల్వాడి/ఇందూరు, సెప్టెంబర్ 25: నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ మైదానంలో నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆటోషోకు అపూర్వ స్పందన లభిస్తున్నది. వివిధ స్టాళ్లలో ఏర్పాటు చేసిన విభిన్నరకాల అధునాతన కార్లు చూపరులను కట్టిపడేస్తున్నాయి. కార్లతోపాటు ద్విచక్రవాహనాల ప్రదర్శన సైతం ఆకట్టుకుంటున్నది. కొనుగోలుదారులు పెద్ద ఎత్తున ప్రదర్శనను తిలకించి తమకు ఇష్టమైన వాహనాలను బుక్ చేసుకుంటున్నారు. ఈ ప్రదర్శనలో యువత మనసు దోచే అత్యధిక సీసీ ఇంజిన్ బైక్లు, పిల్లల నుంచి పెద్దల వరకు గేర్లు వేయకుండా నడిపే ద్విచక్రవాహనాలు, ఎలక్ట్రిక్ బైక్లు, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో, ఆధునిక సదుపాయాలతో రూపుదిద్దుకున్న కార్లు.. ఇవన్నీ ఒకే చోట కొలువుదీరి జిల్లా వాసులను ఆకట్టుకుంటున్నాయి. అతి తక్కువ సమయంలోనే ఒకే వేదికపై వివిధ మోడళ్లు ఎంపిక చేసుకునే చక్కని అవకాశం నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే కల్పించడం అభినందనీయమని సందర్శకులు తెలిపారు.
ఒకే వేదికపై అన్నిరకాల కార్లు
హైదరాబాద్ వెళ్లే పరిస్థితి లేకుండా ఒకే వేదికపై అన్నిరకాల కార్లు తీసుకురావడం బాగుంది. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వాహన ప్రదర్శనను ఏర్పాటు చేశారు. ఆటో షో ఏర్పాటు చేసిన నమస్తే తెలంగాణ యంత్రాంగానికి అభినందనలు.
పోచారం భాస్కర్రెడ్డి,డీసీసీబీ చైర్మన్
హైదరాబాద్ నుంచి వచ్చా..
నమస్తే తెలంగాణ ఆధ్వర్యంలో ఆటో షో నిర్వహిస్తున్నారని తెలుసుకొని ఇక్కడే మా బంధువుల ఫంక్షన్ ఉండడంతో బెనెల్లీ బైక్ టెస్ట్ డ్రైవ్ చేద్దామని హైదరాబాద్ నుంచి వచ్చాను. జంట నగరాలకే పరిమితమైన ఆటోషో నిజామాబాద్లో నిర్వహిం చడం అద్భుతం.
రవికిరణ్
పాల్గొన్న కంపెనీలు..
వాహన ప్రదర్శనలో మారు తీ సుజుకీ నెక్సా, నిస్సాన్, మెర్సిడెస్ బెంజ్, ఎంజీ, హ్యుం దాయ్, మారుతీ సుజుకీ అరెనా(వరుణ్ మోటార్స్), కియా, స్కొడా, మహీంద్రా, హోండా, టాటా సంస్థల నుంచి విభిన్నమైన వాహనాలు ప్రదర్శించారు. ద్విచక్ర వాహనాల కేటగిరిలో హీరో, యమహా, అప్రిలియా(వెస్పా), హోండా, బెనెల్లీ, హీరో ఎలక్ట్రిక్, బిగాస్ సంస్థల నుంచి అధునాతన బైకులు అందుబాటులో పెట్టారు. వేంకటేశ్వర మోటర్ ఆధ్వర్యంలో షోరూం వ్యవస్థాపకుడు నల్ల మహిపాల్రెడ్డి ఆధ్వర్యంలో టాటా నిక్సాన్, ఆల్ట్రోజ్, హెరియార్ కార్లు అందుబాటులో ఉన్నాయి. పీవీఎన్ఆర్ యమహా ఆధ్వర్యంలో ఆర్వన్-5, స్కూటీలను అందుబాటులో ఉంచారు. ఎన్ఎస్ మోటర్స్ ఆధ్వర్యంలో బిగాస్ ఎలక్ట్రిక్ వాహనాలు రూ.70వేల నుంచి రూ.లక్ష వరకు ధరల్లో ఉన్నాయి.
అన్ని బండ్లు ఒక్క దగ్గరే..
నిజాంబాద్ల ఆటో షో పెట్టిన్రని తెలుసుకొని బాడ్సి నుంచి అచ్చిన. ఒక్క దగ్గరనే మస్తు బండ్లు ఉన్నయ్. ఎటూ తిరగాల్సిన అవసరం లేకుండా నచ్చిన బైక్ను కొనుక్కోవడానికి మంచిగ పెట్టిన్రు.
సాయన్న, బాడ్సి
ప్రముఖుల సందర్శన
ఆటో షోను రెండోరోజు శనివారం పలువురు ప్రముఖులు సందర్శించారు. డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్రెడ్డి హాజరై పలు వాహనాలను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నమస్తే తెలంగాణ ఆధ్వర్యంలో కార్లు, బైక్ల ప్రదర్శన నిర్వహించడం అభినందనీయమన్నారు. అనంతరం బెనెల్లీ బైక్పై కూర్చొని సందడి చేశారు. ఎస్ఎస్ఆర్ విద్యాసంస్థల చైర్మన్, తెలంగాణ యూనివర్సిటీ పాలకమండలి సభ్యుడు ఎం మారయ్యగౌడ్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ సికింద్రాబాద్ డిప్యూటీ సర్కిల్ హెడ్ మనోజ్సేట్, సతీశ్, వరుణ్ మోటర్స్ జనరల్ మేనేజర్ రమణగుప్తా, బిగాస్ కంపెనీ సౌత్ ఇండియా జీఎం దుర్గేశ్ గుప్తా ఆటోషోను సందర్శించారు.
ఎలక్ట్రిక్ బైక్ కోసం వచ్చా..
రోజురోజుకూ పెట్రోల్ ధరలు పెరుగుతుండడంతో ఎలక్ట్రిక్ బైక్ కొందామని వచ్చా. నమస్తే తెలంగాణ ఏర్పాటు చేసిన ఆటో షోలో వివిధ రకాల ఎలక్ట్రిక్ బైక్లు అందుబాటులో ఉండడంతో ఎంపిక చేసుకోవడానికి సులభమైంది.
జాదవ్ పండిట్
ఎక్కువ మోడల్స్ అందుబాటులో ఉన్నాయి
కస్టమర్లకు అనుగుణంగా వివిధ మోడళ్లు, వివిధ ధరల్లో ఎంచుకునే అవకాశం కలిగింది. ఆటో షోలో ఎక్కువ కంపెనీలు ఉండడంతో కస్టమర్లకు ఇది ఎంతో ఉపయోగకరం.
ఎస్. ప్రవీణ్
ఆటో షో అదిరింది
నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆటో షో బాగుంది. అన్నిరకాల కార్లు, బైక్లు, ఎలక్ట్రిక్ వాహనాలు అందుబాటులో ఉండడంతో మాలాంటి వారికి ఎంతో ఉపయోగకరంగా మారింది.
రాందాస్,రిటైర్డ్ ఉద్యోగి
బెంజ్ కార్లు అందుబాటులో..
అన్నిరకాల కార్ల ఆటో షో నిజామాబాద్లో నిర్వహించడం బాగుంది. మెర్సిడస్ బెంజ్, ఎంజే, కియాతోపాటు వివిధ కంపెనీల కార్లను ఒకే వేదికపై ఏర్పాటు చేయడంతో నచ్చినవి ఎంచుకునే అవకాశముంది. ఇంత పెద్ద ఆటో షో నిర్వహించడం ఇదే మొదటిసారి.
శ్రీకాంత్ బజాజ్
లక్కీడ్రాలో ఫోన్ గెలుచుకున్నా..
నమస్తే తెలంగాణ పేపర్ ఆధ్వర్యంలో ఆటో షో నిర్వహిస్తున్నారని తెలుసుకొని వచ్చాను. మొదటి రోజు షిఫ్ట్ కారు బుక్ చేసుకున్నాను. నమస్తే తెలంగాణ వారు తీసిన లక్కీడ్రాలో నా పేరు రావడంతో సెల్ఫోన్ను గెలుచుకోవడం ఆనందంగా ఉంది.
అంకాల గంగాధర్, గుండారం
టెస్ట్ డ్రైవ్తో ఆనందం..
ఆటో షోను సందర్శించిన యువతీ యువకులు, మహిళలు పలు వాహనాలను టెస్ట్ డ్రైవ్ చేస్తూ సంబురపడిపోయారు. ప్రధానంగా ఎలక్ట్రిక్ బైక్లు నడిపేందుకు ఆసక్తి చూపారు. బిగాస్, హీరో ఎలక్ట్రిక్ కంపెనీలకు చెందిన వాహనాల గురించి షోరూం నిర్వాహకులు వివరించారు. నంబర్ ప్లేట్ అవసరం లేని బ్యాటరీ వాహనాలు సైతం అందుబాటులో ఉండడంతో ఆసక్తిగా తిలకించారు. అధునాతన కార్లు, వాహనాల వద్ద సెల్ఫీలు దిగుతూ సంతోషం వ్యక్తం చేశారు.