ఇందూరు, అక్టోబర్ 16 : వహీద్ మెమోరియల్ జాతీయ ఇన్విటేషన్ ఫుట్బాల్ టోర్నీలో తమిళనాడుతోపాటు ఆతిథ్యజట్టు ఫైనల్కు చేరుకున్నాయి. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని రాజారాం స్టేడియంలో నాలుగు రోజులుగా కొనసాగుతున్న జాతీయ స్థాయి పోటీల్లో శనివారం సెమీ ఫైనల్ మ్యాచులు ఆసాంతం ఉత్కంఠభరితంగా కొనసాగాయి. రెండు మ్యాచుల ఫలితాల కోసం టైబ్రేక్ వరకు ఎదురు చూడాల్సి వచ్చింది. నేడు కప్ కోసం ఫైనల్ ఫైట్ జరుగనుండగా, మూడో స్థానం కోసం సెమీ ఫైనల్స్లో ఓడిన కేరళ, తెలంగాణ జట్లు తలపడనున్నాయి.
3-2 తేడాతో తమిళనాడు విజయం..
మొదటి సెమీఫైనల్ మ్యాచ్ తమిళనాడు, కేరళ మధ్య జరిగింది. ఇరు జట్లు నువ్వా నేనా అన్నట్లు పోరాడగా, ఫుల్టైం వరకు 1-1 గోల్స్తో సమానంగా నిలిచాయి. చివరికి టైబ్రేక్ ద్వారా ఫలితం తేల్చాల్సి వచ్చింది. టై బ్రేక్లో తమిళనాడు 3 గోల్స్ సాధించగా, కేరళ రెండు గోల్స్ మాత్రమే చేసి ఓటమి పాలైంది.
సెకండ్ సెమీస్లో గోల్స్ కొట్టని ఇరు జట్లు..
రెండో సెమీఫైనల్ మ్యాచ్ తెలంగాణ, ఆతిథ్య జట్టు కేర్ ఫుట్బాల్ అకాడమీ మధ్య జరిగింది. మ్యాచ్ ముగిసే వరకూ రెండు జట్ల క్రీడాకారులు ఒక్క గోల్ కూడా సాధించలేదు. అనతరం టైబ్రేక్లో ఆతిథ్య జట్టు కేర్ ఫుట్బాల్ అకాడమీ.. తెలంగాణ జట్టుపై 5-4 తేడాతో విజయం సాధించింది.
క్రీడాకారుడు జీవితంలో ఎన్నటికీ ఓడిపోడు: సినీ నిర్మాత దిల్రాజు
క్రీడల్లో గెలుపోటములు సహజమేనని, క్రీడాకారుడు జీవితంలో ఎప్పటికీ ఓడిపోడని ప్రముఖ సినీ నిర్మాత దిల్రాజు అన్నారు. సెమీ చేరిన నాలుగు జట్లను ఆయన అభినందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నిజామాబాద్ నగరంలో ఇంత పెద్ద టోర్నీ నిర్వహించడం జిల్లావాసిగా గర్విస్తున్నానని అన్నారు. క్రీడాకారులకు ఉచితంగా బస ఏర్పాటుచేసిన ఎస్సెస్సార్ డిస్కవరీ పాఠశాల యజమాని మారయ్యగౌడ్కు క్రీడాకారుల తరఫున కృతజ్ఞతలు తెలిపారు. ఇంత పెద్ద టోర్నీని నిర్వహిస్తున్న ఫుట్బాల్ అకాడమీ అధ్యక్షుడు నరాల సుధాకర్, ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఏర్పాట్లు చేస్తున్న కోచ్ గొట్టిపాటి నాగరాజును ప్రత్యేకంగా అభినందించారు. కార్యక్రమంలో రాష్ట్ర ఫుట్బాల్ అసోసియేషన్ కార్యదర్శి ఫాల్గుణ్, వ్యాయామ ఉపాధ్యాయులు సుబ్బారావు, ప్రశాంత్ పాల్గొన్నారు.