ఉమ్మడి జిల్లాకు మరో రాష్ట్రస్థాయి పదవి దక్కింది. తెలంగాణ రాష్ట్రరోడ్డు రవాణా సంస్థ చైర్మన్గా సీనియర్ శాసనసభ్యుడు బాజిరెడ్డి గోవర్ధన్ నియమితులయ్యారు. అనుభవానికి పట్టం కడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయంపై హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. 1981లో సర్పంచ్గా రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించి, 40ఏండ్లుగా ప్రజాజీవితంలో ఉన్న బాజిరెడ్డి.. నాలుగు పర్యాయాలు శాసనసభకు ప్రాతినిధ్యం వహించారు.
నిజామాబాద్ (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/ డిచ్పల్లి, సెప్టెంబర్ 16 : సీనియర్ శాసనసభ్యుడు బాజిరెడ్డి గోవర్ధన్కు రాష్ట్ర స్థాయి పదవి వరించింది. సీఎం కేసీఆర్ ఆయనకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ చైర్మన్గా నియమించారు. రాష్ట్రం సిద్ధించిన తర్వాత ఆర్టీసీ చైర్మన్గా నియమితులైన రెండో వ్యక్తి బాజిరెడ్డి గోవర్ధన్. తొలి చైర్మన్గా సోమారపు సత్యనారాయణ పనిచేశారు. ప్రస్తుతం బాజిరెడ్డి ఆ పీఠాన్ని అధిరోహించనున్నారు. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్న బాజిరెడ్డి గోవర్ధన్కు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో సీనియర్ శాసనసభ్యుడిగా పేరున్నది. గతంలో కాంగ్రెస్ పార్టీలో వివిధ స్థాయిల్లో ఆయన పనిచేశారు. ఆర్మూర్, బాన్సువాడ నియోజకవర్గాల నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున ఎమ్మెల్యేగానూ కొనసాగారు. 2014, 2018లో టీఆర్ఎస్ తరఫున పోటీ చేసి వరుసగా గెలిచారు. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ డి.శ్రీనివాస్ను చిత్తుగా ఓడించారు. నిజామాబాద్ జిల్లాలో మాస్ లీడర్గా గుర్తింపు పొందిన బాజిరెడ్డికి ఆర్టీసీ చైర్మన్ పదవి దక్కడంపై జిల్లావాసులు హర్షం వ్యక్తంచేస్తున్నారు. సీనియర్ ఎమ్మెల్యేకు చక్కని పదవితో పట్టం కట్టారని సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు.
సర్పంచ్గా రాజకీయ ప్రస్థానం ప్రారంభం..
బాజిరెడ్డి గోవర్ధన్ స్వస్థలం నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలంలోని చీమన్పల్లి గ్రామం. శాంతాబాయి – దిగంబర్ పటేల్ దంపతుల కుమారుడైన ఆయనది వ్యవసాయాధారిత కుటుంబం. బాజిరెడ్డి రాజకీయ ప్రస్థానం స్వగ్రామం నుంచే ప్రారంభమైంది. తొలుత పోలీస్ పట్వారీగా పని చేసిన బాజిరెడ్డి… అనంతరం 1981లో సర్పంచ్ ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. భీమ్గల్ యూత్ కాంగ్రెస్ ఏజెంట్గా పనిచేసి 1987లో సిరికొండ ఎంపీపీగా, 1992లో సిరికొండ సింగిల్విండో చైర్మన్గా ఎన్నికై రాజకీయంగా రాణించారు. 1993లో ఏపీఎస్ఎఫ్సీ డైరెక్టర్ బాధ్యతలు చేపట్టారు. ఆర్మూర్ నుంచి 1994లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి టీడీపీ అభ్యర్థి అన్నపూర్ణమ్మ చేతిలో ఓటమి పాలయ్యారు. అనంతరం కాంగ్రెస్ పార్టీలో చేరి పలు పార్టీ పదవుల్లో క్రియాశీలకంగా పని చేశారు. 1999లో ఆర్మూర్ నియోజకవర్గం కాం గ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి సిట్టింగ్ ఎమ్మెల్యే అన్నపూర్ణమ్మను ఓడించారు. 2004లో పలు రాజకీయ సమీకరణాల్లో భాగంగా బాన్సువాడ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్యేగా పోటీచేసి పోచారం శ్రీనివాసరెడ్డిపై గెలుపొందారు. 2009లో బాన్సువాడలోనే పోటీ చేయగా పోచారం చేతిలో ఓటమి పాలయ్యారు. 2014లో టీఆర్ఎస్ నుంచి పోటీ చేసి పీసీసీ మాజీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్ను మట్టి కరిపించారు. 2018లోనూ కాంగ్రెస్ అభ్యర్థిని ఓడించి వరుసగా నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ఇప్పటికి తన రాజకీయ జీవితంలో ఆరు సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసిన ఆయన రెండు సార్లు ఓడిపోగా.. నాలుగు పర్యాయాలు ఎమ్మెల్యేగా నిలిచారు.
ప్రజా సమస్యలను పరిష్కరిస్తూ..
ప్రజా సమస్యల పరిష్కారమే ధ్వేయంగా బాజిరెడ్డి ముందుకు సాగుతున్నారు. టీఆర్ఎస్ ప్రభు త్వం ఏర్పడిన అనంతరం ఏడున్నర ఏండ్లలో సీఎం కేసీఆర్ అడుగుజాడల్లో నడుస్తూ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నారు. నియోజకవర్గంలోని అన్ని గ్రామాలకు బీటీ రోడ్లు వేసి నియోజకవర్గ ప్రజల మన్ననలు పొందారు. అనతికాలంలోనే నియోజక వర్గానికి తాగు, సాగునీరు, ఇతర అభివృద్ధి పనుల కోసం కోట్లాది రూపాయల నిధులు మంజూరు చేయించుకున్న ఘనత బాజిరెడ్డికి దక్కింది. నిజామాబాద్ నగరంలోని మహాలక్ష్మీనగర్లో ఉన్న ఆయన నివాసం ఎప్పుడూ ప్రజలతో సందడిగా కనిపిస్తుంది. ఉదయం 8 గంటల నుంచే ప్రజలు ఎమ్మెల్యే గృహానికి చేరుకుంటారు. తమ సమస్యలను ఎమ్మెల్యేకు విన్నవించగా.. ఆయన వెంటనే అధికారులతో మాట్లాడి సమస్యలను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవడంతో.. ప్రజలు తాము వచ్చిన పని అయ్యిందంటూ సంతోషంగా ఇంటికి వెనుదిరుగుతారు. కోట్లాది నిధులను మంజూరు చేయించి పనులు చేపట్టడంతో ఆయన పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజల హృదయాల్లో జననేతగా ముద్రించబడ్డారు. మూడుసార్లు మృత్యువు ఒడిలోకి వెళ్లినప్పటికీ.. ఆయన ప్రజా జీవితంలో నిలబడి.. రాజకీయంగా ఎదుగుతూ సేవలను అందిస్తున్నారు.