నిజామాబాద్ సిటీ, ఆగస్టు 16 : సీజనల్ వ్యాధులపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో సోమవారం జిల్లా అధికారులతో నిర్వహించిన సమన్వయ సమావేశంలో ఆయన మాట్లాడారు. డెంగీ, మలేరియా తదితర సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశమున్నందున వాటి నివారణకు స్పెషల్డ్రైవ్ నిర్వహించి ప్రజలు వ్యాధుల బారిన పడకుండా చూడాలన్నారు. సీజనల్ వ్యాధులు, ఉపకార వేతనాలు, హరితహారం, కోర్టుకు సంబంధించిన నోటీసులు, ఉత్తర్వులపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు సూచించారు. మెడికల్ ఆఫీసర్లు ఫీల్డ్లోకి వెళ్లాలన్నారు. మున్సిపాలిటీలు, గ్రామపంచాయతీల్లో దోమల నివారణకు చర్యలు తీసుకోవాలన్నారు. హరితహారం పనులను వచ్చే సోమవారం నాటికి పూర్తి చేయాలన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వెల్ఫేర్ సంబంధిత ఉపకార వేతనాలు పెండింగ్లో ఉండవద్దన్నారు. సమావేశంలో అడిషనల్ కలెక్టర్లు చిత్రామిశ్రా, చంద్రశేఖర్, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ జితేశ్ వీ పాటిల్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.