కలెక్టర్ నారాయణరెడ్డి ఆదేశం
నిజామాబాద్ సిటీ, సెప్టెంబర్ 1 : జిల్లాలోని స్కూళ్లను తనిఖీ చేయాలని కలెక్టర్ నారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు. పాఠశాలలు పునఃప్రారంభమైన నేపథ్యంలో కలెక్టర్ వీడియోకాన్ఫరెన్స్ ద్వారా అధికారులతో బుధవారం మాట్లాడారు. పాఠశాలల్లో వసతులు, విద్యార్థుల పరిస్థితులు, కరోనా నిబంధనల అమలు తదితర అంశాలను పరిశీలించాలన్నారు. విద్యార్థులకు ఇబ్బందులు ఎదురుకాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. బుధవారం నుంచి శనివారం వరకు మండల ప్రత్యేక అధికారులు, క్లస్టర్ అధికారులు స్కూళ్లను తనిఖీ చేసి రిపోర్టును సమర్పించాలన్నారు. 16 నెలలపాటు స్కూళ్లకుదూరంగా ఉన్న విద్యార్థులకు మళ్లీ ప్రత్యక్ష తరగతులు అలవాటయ్యే విధంగా వాతావరణం ఏర్పర్చాలన్నారు. ఈ మేరకు ఉపాధ్యాయులు ప్రత్యేక చొరవ చూపాలని సూచించారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీల పరిధిలోని అన్ని స్కూళ్లలో శానిటైజేషన్ చేయించాలని, మరుగుదొడ్లకు మరమ్మతులు చేయించాలని ఆదేశించారు. టీచర్లు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని స్పెషల్ క్లాసులను నిర్వహించాలని, ఒక నెల పాటు అన్ని స్కూళ్లు, కాలేజీల్లో బోధించాలని సూచించారు. ఎంపీడీవోలు, తహసీల్దార్లు, ఎంపీవోలు క్లస్టర్గా ఏర్పడి ప్రతి స్కూల్ను సందర్శించాలన్నారు. పాఠశాలలో విద్యుత్ సరఫరాలేనిపక్షంలో డీఈవో దృష్టికి తీసుకువెళ్లాలన్నారు. వీడియోకాన్ఫరెన్స్లో అడిషనల్ కలెక్టర్ చిత్రామిశ్రా, డీఈవో దుర్గాప్రసాద్, డీపీవో జయసుధ, వ్యవసాయాధికారి గోవింద్, డివిజన్, మండలస్థాయి అధికారులు పాల్గొన్నారు.