హాలియా, మే 12 : నాగార్జునసాగర్ నియోజకవర్గంలో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేసేందుకు ఈ నెల 14న రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్, విద్యుత్శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి, పర్యాటకశాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ రానున్నారు. అందుకు గానూ అధికారులు చకచకా ఏర్పాట్లు చేస్తున్నారు. మొదటగా మంత్రులు సుంకిశాలలో నాగార్జునసాగర్ రిజర్వాయర్ నుంచి కృష్ణా జలాలను హైదరాబాద్కు తరలించేందుకు ఏర్పాటు చేస్తున్న ఇంటెక్వెల్ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం సాగర్లో నిర్మించిన బుద్ధవనాన్ని ప్రారంభిస్తారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో హాలియాకు చేరుకొని హాలియా, నందికొండ మున్సిపాలిటీల్లో రూ.50 కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు.
మంత్రుల రాక సందర్భంగా జిల్లా అధికారులు ఏర్పాట్లను చేశారు. హాలియాలో హెలిప్యాడ్ నిర్మిస్తున్నారు. హెలిప్యాడ్ నుంచి మెయిన్ రోడ్డు వరకు అప్రోచ్ రోడ్డును నిర్మించారు. మంత్రులు శంకుస్థాపన చేయనున్న శిలాఫలకాల ఏర్పాటు పనులు కూడా పూర్తికావచ్చాయి. హాలియాలో నిర్వహించే సభకోసం వేదిక ఏర్పాటు పనులు కొనసాగుతున్నాయి. మంత్రుల రాక సందర్భంగా మున్సిపల్ అధికారులు, సిబ్బంది హాలియాను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు.