
మెట్ట పంటలకు మేలు చేసిన వాన
నల్లగొండ జిల్లాలో పలుచోట్ల భారీ వర్షం
అత్యధికంగా చింతపల్లిలో 6.4సెం.మీ.
మాడ్గులపల్లి, మల్లేపల్లిలో 5సెం.మీకు పైగానే..
ఈ నెలలో సాధారణం కంటే తక్కువ వర్షపాతం
పత్తి, మెట్ట పంటలకు జీవం పోస్తున్న వర్షాలు
సూర్యాపేటలో కొన్ని ప్రాంతాలకే పరిమితం
రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలు రైతులకు ఊరటనిస్తున్నాయి. ముఖ్యంగా వాడుపట్టిన పత్తిచేలకు మేలు చేస్తున్నాయి. తాత్కాలికంగా ఈ వానలు రైతులను గట్టెక్కించినట్లుగా కనిపిస్తున్నది. గురువారం నల్లగొండ జిల్లాలో 2 సెంటీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. చింతపల్లి మండలంలో అత్యధికంగా 6.4 సెంటీమీటర్లు.. మాడ్గులపల్లి, కొండమల్లేపల్లి, మునుగోడు, పీఏపల్లి మండలాల్లో 4 సెంటీమీటర్లకు పైగా వర్షం కురిసింది. రోజుకొక చోట జిల్లా మొత్తం వర్షం ప్రభావం ఉండడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ నెలలో ఇప్పటివరకు సగటు కంటే తక్కువ వర్షం కురవగా ప్రస్తుత వర్షాలు దాన్ని అధిగమించేలా కనిపిస్తున్నాయి. సూర్యాపేట జిల్లాలో గురువారం ఒకటి, రెండు చోట్ల తప్ప పెద్దగా వర్షం కురవలేదు.
నల్లగొండ ప్రతినిధి, ఆగస్టు 26(నమస్తే తెలంగాణ). నల్లగొండ జిల్లావ్యాప్తంగా బుధవారం కొన్నిచోట్ల, గురువారం చాలా ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. గురువారం ఉదయం వరకు మిర్యాలగూడ, దేవరకొండ రెవెన్యూ డివిజన్లలో వర్షం ఎక్కువగా నమోదు కాగా రాత్రి వరకు నల్లగొండ రెవెన్యూ డివిజన్లోనూ మంచి వర్షమే కురిసింది. మెట్ట పంటల ఎదుగుదలకు ఉపయోగపడేలా వర్షం ఉందని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ నెలారంభం నుంచి పెద్దగా వర్షాలు కురవకపోవడం, ముఖ్యంగా పత్తి పంటపై తీవ్ర ఆందోళన నెలకొన్నది. నల్లరేగడి భూముల్లో కొంతమేరకు ఇబ్బంది లేకున్నా దుబ్బ, ఎర్ర నేలల్లో సాగుచేసిన పత్తి పంటకు వర్షం కురవడం అత్యవసరంగా మారింది. పక్షం రోజులుగా చుక్క వర్షం లేకపోవడంతో ఈ నేలల్లోని మెట్ట పంటలు దాదాపు వాడు దశకు చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో రెండ్రోజులుగా కురుస్తున్న వర్షాలు మెట్ట పంటలకు ఊరటనిస్తున్నాయి. పత్తి చేలు ప్రస్తుతం కాత దశకు చేరుకున్నాయి. ఈ దశలోనే భూమిలో సరైన పదును అవసరం. అడుగుమందులు పెట్టడం వల్ల మరింత ఏపుగా పెరిగి మంచి దిగుబడికి ఆస్కారం ఉంది. ప్రస్తుత వర్షాలతో పత్తి రైతులు కలుపుతీతతో పాటు అడుగుమందులు పెట్టనున్నారు. కంది, పెసర, ఇతర పప్పుధాన్యాల పంటలకు ఈ వర్షాలు జీవం పోయనున్నాయి. ఇక మెట్ట ప్రాంతాల్లో ముందస్తు నాట్లు పడిన వరిచేలకు కూడా వర్షాలు ఉపయోగమే.
అత్యధికంగా చింతపల్లిలో…
అత్యధికంగా చింతపల్లి మండలంలో 6.4 సెంటి మీటర్ల వర్షపాతం నమోదైంది. మొత్తంగా దేవరకొండ డివిజన్లోని అన్ని మండలాల్లో కలిపి 26.7 సెంటీ మీటర్లు కురిసినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. మాడ్గులపల్లిలో 5.6సెం.మీ., కొండమల్లేపల్లిలో 5.1సెం.మీ, మునుగోడులో 4.6 సెం.మీ., పీ.ఏ.పల్లి మండలంలో 4.5 సెం.మీ. వర్షపాతం నమోదైంది. గురువారం ఉదయానికి శాలిగౌరారం, నార్కట్పల్లి, చిట్యాల, కట్టంగూర్, నేరేడుగొమ్ము, నకిరేకల్ మండలాల్లో చినుకులు కురిశాయి. సాయంత్రానికి ఈ మండలాల్లోనూ మంచి వర్షమే కురిసింది. డివిజన్ల వారీగా చూస్తే మిర్యాలగూడలో 23.7సెం.మీటర్లు, నల్లగొండలో 12.6సెం.మీటర్ల వర్షపాతం నమోదైంది.
ఈ నెలలో సగటు కంటే తక్కువే…
ఈ వానకాలంలో జూన్, జూలై నెలల్లో సాధారణానికి మించి 50శాతం వరకు అదనపు వర్షపాతం నమోదు కాగా ప్రస్తుత నెల ఆగస్టులో అందుకు భిన్నమైన పరిస్థితి నెలకొన్నది. ఆగస్టులో గురువారం నాటికి 11.6శాతం తక్కువ వర్షపాతం నమోదైంది. ఈ నెల 26 వరకు ఆగస్టులో 108.9 మి.మీటర్ల వర్షం కురవాల్సి ఉండగా 96.2 మి.మీటర్ల వర్షపాతమే నమోదైంది. కాగా జూన్లో 85.2 మి.మీటర్ల వర్షపాతానికి 133.7మి.మీ., జూలైలో 145.2 మి.మీటర్లకు 216.3మి.మీటర్ల వర్షపాతం కురిసింది. ఇక మండలాల వారీగా పరిశీలిస్తే జిల్లాలోని మొత్తం 31 మండలాలకు 20 మండలాల్లో సాధారణం కంటే అధికంగా వర్షం కురవగా 11 మండలాల్లో మాత్రం సాధారణ వర్షపాతం నమోదైంది.
సూర్యాపేటలో ఒకటి, రెండు చోట్లకే పరిమితం
సూర్యాపేట జిల్లాలో వర్ష ప్రభావం ఒకటి,రెండు ప్రాంతాలకే పరిమితమైంది. ఏడు మండలాల్లోనే అది కూడా చినుకులకే పరిమితమైంది. మేళ్లచెర్వులో మాత్రం 27.3 మి.మీటర్ల వర్షపాతం కురిసింది. నేరేడుచర్లలో 2.8మి.మీ, మట్టంపల్లిలో 1.8మి.మీ. వర్షపాతం నమోదైంది. హుజూర్నగర్, పాలకవీడు, నాగారం, చివ్వెంల మండలాల్లో ఒక్క మిల్లీమీటర్ కంటే తక్కువే నమోదు కాగా మిగతా మండలాల్లో అసలు వర్షం కురవలేదని వాతావరణ శాఖ వెల్లడించింది.
బత్తాయికి ప్రాణం
పెద్దఅడిశర్లపల్లి: మండలంలో నీరందక బత్తాయి తోట, పత్తిచేలు ఎండిపోయేదుస్థితికి చేరుకున్నాయి. ప్రస్తుతం రెండ్రోజులుగాకురిసిన వర్షం ప్రాణం పోసింది.