ఆ ఊరి పేరుకు తగ్గట్లే గ్రామంలో ఎటుచూసినా సమస్యల చీకట్లే. సరైన మౌలిక వసతులు లేక గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడేవారు. అలా కష్టాలతో సావాసం చేస్తున్న గ్రామలో రాష్ట్ర ప్రభుత్వం అమలుచేసిన ‘పల్లె ప్రగతి’ కార్యక్రమం వెలుగులు నింపింది. అనతి కాలంలోనే ఎంతో అభివృద్ధిని చవిచూసింది మునుగోడు మండలంలోని చీకటిమామిడి గ్రామం. పచ్చదనం, పరిశుభ్రతపై ప్రజల్లో అవగాహన పెరిగిందని, ఏండ్ల నాటి సమస్యలకు పల్లె ప్రగతి కార్యక్రమం దారి చూపిందని అధికారులు, పాలకవర్గం, గ్రామం రూపురేఖలు మారడంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
చీకటిమామిడి జనాభా 2,526. సుమారు 605 కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. గతంలో గ్రామంలోని ప్రధాన వీధుల్లో మూడు ఫీట్ల లోతు గుంతలు ఉండేవి. వీటిలో వర్షపు, మురుగు నీరు నిలిచి వార్డులన్నీ అస్తవ్యస్తంగా ఉండేవి. చెత్తను ఎక్కడ పడితే అక్కడ వేసేవారు. జనావాసాల్లో కంపచెట్లు, పిచ్చిమొక్కలతో దోమ ల బెడద అధికంగా ఉండేది. రాష్ట్ర ప్రభు త్వం చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా గ్రామసభ ఏర్పాటు చేసుకొని ఊళ్లో పేరుకుపోయిన సమస్యలను గుర్తించారు. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం అందుబాటులో ఉన్న నిధుల ను వినియోగించి వాటిని పరిష్కరించుకున్నారు.
రూ.20లక్షలతో మురుగుకాల్వలు…
గ్రామంలో మురుగు నీటి వ్యవస్థను మెరుగుపర్చేందుకు పంచాయతీ నిధుల నుంచి సుమారు రూ.20లక్షలతో కాల్వలను నిర్మించారు. ఇందులో సుమారు రూ.12లక్షలు అండర్గ్రౌండ్ డ్రైనేజీకి ఖర్చయింది. వర్షపు నీరు నిలిచే వార్డులను గుర్తించి రూ.4.5లక్షలతో సీసీ రోడ్లును ఏర్పాటు చేశారు.
10 నూతన స్తంభాలు…
గ్రామంలో 10 నూతన విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేసి లూజువైరు సమస్యను పరిష్కరించారు. రాత్రివేళ వెలుగు కోసం రూ.4లక్షలతో స్తంభాలకు 100 ఎల్ఈడీ బల్బులు అమర్చారు. కంపచెట్లు, పిచ్చిమొక్కలను తొలగించారు. పడావుపడ్డ ఇండ్లు, గోడలను కూల్చివేశారు.
హరితమయం…
పల్లె ప్రగతి, హరితహారంలో భాగంగా నాటిన మొక్కలతో చీకటిమామిడి హరితమయంగా మారింది. గ్రామంలోని సర్వే నంబర్ 51లో అర ఎకరం విస్తీర్ణంలో పల్లె ప్రకృతి వనాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో పూలు, పండ్ల జాతికి చెంది 2వేల మొక్కలు నాటారు. పంచాయతీ పరిధిలోని ఆవాసమైన రాజీవ్నగర్లో సర్వే నంబర్ 249లో వెయ్యి మొక్కలతో పల్లె ప్రకృతి వనాన్ని ఏర్పాటు చేశారు. ఎవెన్యూ ప్లాంటేషన్ కింద మునుగోడు శివారు నుంచి కొంపల్లి శివారు వరకు 1,400 మొక్కలు నాటారు. వీటి సంరక్షణకు రూ.1.43లక్షలతో ట్రీగార్డులను సైతం అమర్చారు. ఇంటి ఆవరణల్లో నాటేందుకు గ్రామస్తులకు 10,800 మొక్కలు పంపిణీ చేశారు.
వైకుంఠ ధామం…
సర్వే నంబర్ 51లో రూ.12.6 లక్షలతో వై కుంఠధామాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో రెండు బర్నింగ్ పాయింట్లు, దింపుడు కల్లాలు, స్నానాల గదులు, పూజగది, ఆఫీస్ రూం నిర్మించారు. సకల వసతులతో ఉన్న ఈ వైకుంఠధామం త్వరలోనే గ్రామస్తులకు వినియోగంలోకి రానుంది.
ట్రాక్టర్ ద్వారా చెత్త సేకరణ…
పల్లె ప్రగతిలో భాగంగా రూ.10లక్షలతో ట్రాక్టర్, ట్రాలీ, ట్యాంకర్ను ప్రభుత్వం సమకూర్చింది. దీని ద్వారా రోజు విడిచి రోజు పంచాయతీ సిబ్బంది చెత్తను సేకరిస్తున్నారు. చెత్తను వేసేందుకు రూ.70వేలతో ఇంటికి రెండు బుట్టల చొప్పున పంపిణీ చేశారు. సర్వే నంబర్ 51లో రూ.2.5లక్షలతో ఏర్పాటు చేసిన కంపోస్టు షెడ్లో సేంద్రియ ఎరువును తయారు చేస్తున్నారు. ఇప్పటి వరకు సుమారు 2 క్వింటాళ్ల ఎరువు తయారుకాగా గ్రామంలోని హరితహారం మొక్కలకు వేశారు. పనికిరాని చెత్తను వేసేందుకు రూ.50వేలతో డంపింగ్యార్డును సైతం ఏర్పాటు చేశారు.
గ్రామం పరిశుభ్రంగా మారింది…
గతంలో చీకటిమామిడి గ్రామం సమస్యల నిలయంగా ఉం డేది. అపరిశుభ్ర వీధులతో ప్రజలు ఇబ్బందులు పడేవారు. రాష్ట్ర ప్రభుత్వం అమలుచేసిన పల్లె ప్రగతితో గ్రామం పూర్తిగా పరిశుభ్రంగా మారింది. ప్రభుత్వం సమకూర్చిన ట్రాక్టర్ ద్వారా రోజు విడిచి రోజు చెత్త సేకరణ చేస్తున్నాం. ప్రణాళికబద్ధమైన కార్యక్రమాలతో పచ్చదనం, పరిశుభ్రతపై గ్రామస్తులకు మంచి అవగాహన ఏర్పడింది.
చల్లా లింగస్వామి, పంచాయతీ కార్యదర్శి
ఏండ్లనాటి సమస్యలు తీరినయ్…
మా గ్రామంలో ఎంతోకాలంగా పరిష్కారానికి నోచుకోని సమస్యలు పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారా తీరినయ్. సీసీ రోడ్లు, మురుగుకాల్వల నిర్మాణంతో పారిశుధ్యం మెరుగుపడింది. హరితహారం, పల్లె ప్రకృతి వనాల్లో నాటిన మొక్కలతో ఆహ్లాదకర వాతావరణం ఏర్పడింది.
తాటికొండ సంతోష, సర్పంచ్