తలపై గాంధీ టోపీ ధరించి, వాస్కోట్, పంచతో అందరినీ ఆప్యాయంగా పలుకరించే స్వాతంత్య్ర సమరయోధుడు వేమవరపు మనోహర్ పంతులు ఇక లేరు. గురువారం రాత్రి ఆయన అనారోగ్యంతో మృతిచెందారు. రామన్నపేట మండలం జనంపల్లికి చెందిన ఆయన ఎన్నో ఉద్యమాల్లో పాల్గొన్నారు. రాజకీయ నాయకుడిగా, సామాజిక వేత్తగా, ఆదర్శ రైతుగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. జనం మనిషిగా గుర్తింపు పొందారు.
రామన్నపేట, అక్టోబర్ 21 : ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు, జనం మనిషి వేమవరపు మనోహర్ పంతులు హైదరాబాద్లోని కిమ్స్ దవాఖానలో చికిత్స పొందుతూ గురువారం రాత్రి 7గంటలకు మృతి చెందారు. రామన్నపేట మండలం జనంపల్లి గ్రామంలో 1921జనవరి 1న వెంకటరత్నం, సత్తమ్మ దంపతులకు జన్మించిన మనోహర్ పంతులు భారత స్వాతంత్య్రో ద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. రాజకీయ నాయకుడిగా, సామాజిక వేత్తగా, ఆదర్శ రైతుగా ప్రజల హృదయాలను చూరగొన్న మహోన్నతుడు ఆయన.
ఉద్యమం వైపు అడుగులు…
విద్యార్థి దశలోనే ఉద్యమాల పట్ల ఆకర్షితుడైన మనోహర్ పంతులు ఆర్యసమాజం ద్వారా హిందూమత పరిరక్షణకు కృషి చేశారు. జవహర్లాల్ నెహ్రూ స్థాపించిన భారత్ సేవక్ సమాజ్కు రామన్నపేట సమితి ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. ఆంధ్ర జన సంఘం, ఆంధ్ర మహాసభ, గ్రంథాలయోద్యమాల్లో పాల్పంచుకున్నారు. రజాకారుల బారి నుంచి ప్రజలను రక్షించడానికి, ఆత్మరక్షణకు ఆయుధాలు పట్టి గుండ్రాంపల్లి, వాయిలపల్లి రజాకార్ల క్యాంపులపై దాడులు చేశారు. 1985లో అలహాబాద్లో జరిగిన అఖిలభారత స్వాతంత్య్ర సమరయోధుల సమావేశంలో భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ చేతుల మీదుగా సిల్వర్ మెడల్ను పొందారు. 1989లో భారత ప్రభుత్వం ఆయన్ను స్వాతంత్య్ర సమర యోధుడిగా గుర్తించింది.
నిరంతరం ప్రజాసేవలో…
నిజాం సంస్థానం ఇండియన్ యూనియన్లో విలీనమైన తర్వాత మనోహర్ పంతులు జనంపలి ్లకేంద్రంగా అనేక సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. నిరంతరం ప్రజాసేవలో నిమగ్నమయ్యారు. గ్రామానికి రెండుసార్లు సర్పంచ్గా, జడ్పీటీసీగా ఏక గ్రీవంగా ఎన్నికయ్యారు. పంతులు ఆర్థిక సాయంతో ఎందరో నిరుపేద విద్యార్థులు డాక్టర్లు, ఇంజినీర్లు, ప్రొఫెసర్లుగా ఉన్నత స్థానాల్లో స్థిర పడ్డారు. మనోహర్ పంతులు జనంపల్లిలో బాలికల గురుకుల పాఠశాల ఏర్పాటుకు పది ఎకరాలు, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు మూడున్నర ఎకరాల భూమిని దానం చేశారు.
మనోహర్ పంతులు మృతి పట్ల నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య గురువారం ఒక ప్రకటనలో సంతాపం తెలిపారు. నిజాయితీకి నిలువెత్తు నిదర్శనం, విలువలతో కూడిన రాజకీయాలు చేసి నేటి తరానికి మార్గదర్శకుడిగా నిలిచారని కొనియాడారు.