కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్లో మరోసారి ఉమ్మడి నల్లగొండ జిల్లాకు మొండిచెయ్యే చూపించింది. ప్రజల డిమాండ్ ఉన్న ఏ ఒక్క ప్రాజెక్టుకూ ప్రాధాన్యత దక్కలేదు. హైదరాబాద్- విజయవాడ హైస్పీడ్ రైలు మార్గం, బీబీనగర్-నడికుడి లైన్ డబ్లింగ్ ఊసే లేదు. ఘట్కేసర్ నుంచి రాయగిరి వరకు ఎంఎంటీఎస్ రైళ్ల పొడిగింపు అంశం కూడా ప్రస్తావన లేదు. దీంతోపాటు ఈ ఏడాది ప్రపంచ పర్యాటక ఉత్తమ గ్రామంగా ఎంపికైన పోచంపల్లిలో ఐఐహెచ్టీ ఏర్పాటు చేయాలన్న డిమాండ్ను కేంద్రం పట్టించుకోలేదు. సైనిక్ స్కూల్ ఏర్పాటుతోపాటు కేంద్రీయ, నవోదయ విద్యాలయాల అప్గ్రెడేషన్ డిమాండ్ కూడా చెవి కెక్కలేదు. ఇవిలా ఉంటే అంతకంతకూ పెరుగుతున్న పెట్రోలియం ఉత్పత్తుల ధరల అదుపుపైనా ప్రజలు పెట్టుకున్న ఆశలు ఆవిరయ్యాయి. వీటి ప్రస్తావన లేకపోవడంతో భవిష్యత్తులో పెరుగబోయే నిత్యావసర వస్తువుల ధరలను తలుచుకుని సామాన్యులు బెంబెలెత్తే పరిస్థితులు నెలకొన్నాయి. ఇక వివిధ రకాల సెస్లతో ప్రజలపై అదనపు భారం మోపేందుకు కేంద్రం సిద్ధపడుతున్నది. ఇక ప్రతి బడ్జెట్ వైపు ఆశగా చూసే ఆదాయపన్ను చెల్లింపుదారులకు ఈ సారి ఎలాంటి మినహాయింపులు లభించలేదు. ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలు కేంద్ర బడ్జెట్పై తీవ్ర ఆక్షేపణ వ్యక్తం చేస్తున్నాయి. వివిధ రాజకీయ పక్షాలు, వ్యాపార, మధ్య తరగతి వర్గాలు మండిపడుతున్నాయి. ఇది ప్రజల ఆకాంక్షలకు ఏమాత్రం సంబంధం లేని బడ్జెట్ అని విరుచుకుపడుతున్నాయి.
నల్లగొండ ప్రతినిధి, ఫిబ్రవరి 1(నమస్తే తెలంగాణ) : నల్లగొండ జిల్లా ప్రయోజనాలపై కేంద్రం నీళ్లు చల్లింది. మంగళవారం ప్రవేశ పెట్టిన బడ్జెట్పై అన్ని వర్గాల ప్రజలు నిరుత్సాహం వ్యక్తం చేశారు. ఏండ్ల తరబడి జిల్లా ప్రజలు ఆశిస్తున్న రైల్వే ప్రాజెక్టులకు తోడు ఏ ఒక్క డిమాండ్ను కూడా కేంద్రం పరిగణలోకి తీసుకోకపోవడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నారు. ఐదు దశాబ్ధాల కిందట నిర్మించిన బీబీనగర్-నడికుడి రైల్వే లైన్ డబ్లింగ్, రెండు తెలుగు రాష్ర్టాల రాజధానులను కలుపుతూ సికింద్రాబాద్ – విజయవాడ మార్గంలో హైస్పీడ్ రైల్వేలైన్ నిర్మాణం చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. యాదాద్రి, నల్లగొండ, సూర్యాపేట జిల్లాల పరిధిలోని 65వ నంబర్ జాతీయ రహదారి వెంట రైల్వే లైన్ నిర్మిస్తే ప్రజా, సరుకు రవాణా పరంగా గణనీయమైన మార్పులకు అవకాశం ఉన్నది.
విద్యాసంస్థలకు దక్కని ప్రాధాన్యం..
జిల్లాకో సైనిక్ స్కూల్ ఏర్పాటు చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ డిమాండ్ను పట్టించుకోలేదు. గతేడాది ఆదివాసి, గిరిజన ప్రాంతాల్లో ఏకలవ్య స్కూళ్ల ఏర్పాటుపై కేంద్రం చేసిన ప్రకటన గిరిజనుల్లోనూ ఆశలు రేకెత్తించగా.. తాజాగా ఆ ఊసే ఎత్తలేదు. వైద్యరంగానికి సంబంధించి ఎయిమ్స్ అభివృద్ధికి నిధుల ప్రస్తావన లేదు. నల్లగొండ, మిర్యాలగూడ కేంద్రీయ విద్యాలయాల అప్గ్రెడేషన్ ఊసేలేదు.
ఉద్యోగులు, సామాన్యుల్లో తీవ్ర అసంతృప్తి
ఈ బడ్జెట్లో ఉద్యోగులకు, సామాన్యులకు పెద్దగా ప్రయోజనం కలుగకపోనూ పెట్రో, గ్యాస్ ధరలతో అదనపు భారాలు తప్పవన్న చర్చ సర్వత్రా వ్యక్తమైంది. ఇక ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు ఈ ఏడాది కూడా ఊరట లభించలేదు. ఐటీ స్లాబ్స్ను యథాతథంగా కొనసాగించడం వారిని తీవ్ర నిరుత్సాహ పరిచింది. వ్యవసాయ రంగానికి సంబంధించి అద్దెకు యంత్రపరికరాల పథకం, సేంద్రియ సాగుకు ప్రోత్సాహం, వచ్చే ఏడాదిని తృణధాన్యాల సంవత్సరంగా ప్రకటించడం, అంగన్వాడీల్లో సౌకర్యాల కల్పన, ధరణి తరహాలోనే ఒకే దేశం- ఒకే రిజిస్ట్రేషన్ విధానం లాంటి నిర్ణయాలు ఓ మాదిరిగా కనిపిస్తున్నాయి. మొత్తంగా చూస్తే బీజేపీ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన కేంద్ర బడ్జెట్ ఉమ్మడి జిల్లా ప్రజలను తీవ్ర నిరాశకు గురిచేసింది.
ఊసే లేని ఎంఎంటీఎస్
ఘట్కేసర్ నుంచి రాయగిరి వరకు ఎంఎంటీఎస్ పొడిగింపు డిమాండ్ ఏండ్ల తరబడి వినిపిస్తున్నది. సీఎం కేసీఆర్ యాదాద్రి పుణ్యక్షేత్రాన్ని అత్యంత వైభవంగా తీర్చిదిద్దుతున్న నేపథ్యంలో ఈ మార్గం పొడిగింపు ఎంతో ఉపయుక్తం కానుంది. కానీ దీనిపైనా కేంద్రం తీరు తీవ్ర నిరాశపర్చింది. ఈ మార్గాన్ని పొడిగించేందుకు 2016-17 ఆర్థిక సంవత్సరంలోనే ఆమోదం తెలిపిన కేంద్రం.. 2020 నాటికే పనులు పూర్తి చేయాలని నిర్ణయించినా కార్యరూపం దాల్చలేదు. ఖాజీపేట మార్గంలో రాయగిరి వరకు 34 కిలోమీటర్ల మేర మరో లైన్ ఏర్పాటునూ కేంద్రం విస్మరించింది. మోటమర్రి-విష్ణుపురం డబుల్ లైన్కు గత జూలైలో ఆమోదం తెలిపినా పట్టింపులేదు.
పోచంపల్లి ఐఐహెచ్టీపై నిరాశ..
దేశంలోనే ఇక్కత్ వస్త్ర పరిశ్రమకు ప్రసిద్ధి చెందిన భూదాన్ పోచంపల్లిలో ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ(ఐఐహెచ్టీ) ఏర్పాటు చేయాలని రాష్ట్ర మంత్రి కేటీఆర్ ఎన్నోసార్లు కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. కానీ ఐఐహెచ్టీతో పాటు చేనేతపై విధించిన జీఎస్టీ విషయంలోనూ కేంద్రం ఏమాత్రం సానుకూలత చూపలేదు. ప్రపంచ పర్యాటక సంస్థ గుర్తింపుతోనైనా నిధులు వస్తాయని ఆశించగా నిరాశే మిగిలింది.
వ్యవసాయ రంగంపై చిన్నచూపు..
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో వ్యవసాయ రంగాభివృద్ధికి కేటాయింపులు లేవు. దేశ ప్రజల కడుపునింపే రైతాంగానికి శూన్య హస్తం చూపించారు. వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టేలా నల్ల చట్టాల అమలుకు దారులు పరుస్తున్నది. రైతాంగం కన్నెర్రజేస్తే దేశంలో బీజేపీ కనుమరుగవుతుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. పారే పొలానికి నీరు రాకుండా అడ్డుకట్ట వేసినట్టుగా బడ్జెట్ ఉన్నది.
రోగ్యంపై పట్టింపు లేదా…
కరోనాతో దేశ ప్రజలు కన్నీరు పెడుతుంటే బడ్జెట్లో వైద్య రంగాన్ని విస్మరించడం విచారకరం. అరకొర కేటాయింపులు చూస్తే కేంద్ర ప్రభుత్వానికి ప్రజారోగ్యంపై ఎలాంటి పట్టింపు లేనట్లే కనిపిస్తున్నది. కేంద్రం బడ్జెట్ ప్రవేశపెట్టడంలో పూర్తిగా విఫలమైంది. బడ్జెట్లో అన్ని రంగాలకు ప్రాధాన్యం ఇస్తున్నామని ప్రకటనలకే పరిమితమయ్యారు తప్ప వాస్తవ పరిస్థితి విరుద్ధంగా ఉన్నది. తాజా బడ్జెట్తో పేద, సామాన్య ప్రజలకు ఒరిగేదేమీలేదు.
రైతులపై కేంద్రానికి దయ లేదు..
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ నిరాశాజనకంగా ఉంది. వ్యవసాయ రంగ అభివృద్ధిపై కేంద్రానికి ఏమాత్రం చిత్తశుద్ధి లేదు. వ్యవసాయ రంగాన్ని ఆదుకునే దిశగా బడ్జెట్లో ప్రాథమ్యాలు కల్పించలేదు. కేంద్ర ప్రభుత్వ చర్యలతో వ్యవసాయ రంగం మరింత సంక్షోభంలో కూరుకుపోయే ప్రమాదం ఉన్నది. రైతులను ఆదుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి లేదన్నది ఈ బడ్జెట్తో తేలిపోయింది.
మహిళా సాధికారితకు గొడ్డలిపెట్టు..
కేంద్ర బడ్జెట్ మహిళా సాధికారతకు గొడ్డలిపెట్టుగా మారింది. గ్రామీణ ప్రాంత మహిళలు రుణాలపై ఆధారపడి వృత్తి, వ్యాపారాలు నిర్వహిస్తుంటారు. చిన్న తరహా వ్యాపారాలు కొనసాగిస్తున్న క్రమంలో రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలు ఎంతో ఆసరా, భరోసా కల్పించాయి. కానీ, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ గుది బండలా మారింది. కేంద్రం ప్రకటించిన బడ్జెట్ మహిళల అభ్యున్నతికి మోకాలడ్డడం విచారకరం.
ఉద్యోగులను విస్మరించింది..
కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్లో విద్య, వైద్య రంగ ఉద్యోగులను విస్మరించింది. ఆదాయపన్ను పరిమితి పెంచితే బాగుండేది. మధ్య తరగతి ఉద్యోగులు, ప్రజలకు బడ్జెట్ ఆశాజనకంగా లేదు. సామాన్య ప్రజలకు ఉపయోగపడే విధంగా లేదు. బడ్జెట్ పూర్తి నిరాశాజనకంగా ఉన్నది.