సూర్యాపేట, జనవరి 30(నమస్తే తెలంగాణ) : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దళిత బంధు పథకాన్ని పకడ్బందీగా నిర్వహించేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నాం.. ఫిబ్రవరి 5నాటికి సూర్యాపేట జిల్లాలో లబ్ధిదారుల ఎంపిక పూర్తి కానుంది.. నియోజకవర్గానికి వంద చొప్పున తొలివిడుత 400 మంది దళిత కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున అందనున్నాయి. ఇప్పటికే జిల్లాకు రూ.50 కోట్లు వచ్చాయి. స్కీం ఇంప్లిమెంట్ కోసం ప్రతి నియోజకవర్గానికి ఒక ప్రత్యేక అధికారిని నియమించాం. క్షేత్ర స్థాయిలో కమిటీలు ఉంటాయి. లబ్ధిదారులు ఏ యూనిట్ ఎంచుకున్నా.. వారు ఆర్థిక పరిపుష్టి సాధించే వరకూ అధికార యంత్రాంగం తోడ్పాటు ఉంటుంది’ అని సూర్యాపేట జిల్లా కలెక్టర్ వినయ్కృష్ణారెడ్డి తెలిపారు. జిల్లాలో దళిత బంధు అమలుపై ‘నమస్తే తెలంగాణ’తో ఆయన ప్రత్యేకంగా మాట్లాడారు.
దళిత బంధు లబ్ధిదారులు అన్ని విధాలుగా ఆర్థికాభివృద్ధి సాధించడమే లక్ష్యం.. యూనిట్ల ఎంపిక మొదలు లబ్ధిదారులు ఎంచుకునే వ్యాపారమైనా, మరే ఇతర ఉపాధి అయినా సరే.. వారికి అవసరమైన సలహాలు, సూచనలతో పాటు మార్కెటింగ్ వరకూ సహకారం కొనసాగుతుంది.. అని కలెక్టర్ వినయ్కృష్ణారెడ్డి స్పష్టం చేశారు. జిల్లాలో దళిత బంధు పథకం అమలు, లబ్ధిదారుల ఎంపిక తదితర విషయాలపై ‘నమస్తే తెలంగాణ’తో ఆయన ముచ్చటించారు. ఆ వివరాలివీ..
జిల్లాకు రెండు విడుతల్లో దళిత బంధు పథకం వర్తిస్తుంది. ముందుగా తుంగతుర్తి నియోజకవర్గ పరిధిలోని తిరుమలగిరి మండలం మొత్తానికి వర్తింపజేస్తాం. దాదాపు 2,500దళిత కుటుంబాలకు రూ.10లక్షల చొప్పున తొలి విడుతలో మంజూరు కాగా, తాజాగా ముఖ్యమంత్రి కేసీఆర్ నియోజకవర్గానికి వంద మంది చొప్పున స్కీం వర్తింపజేసేలా తీసుకున్న నిర్ణయంతో జిల్లాలో మరో 400 మందికి లబ్ధి కలుగనున్నది. 400 కుటుంబాలకు మార్చి నెలాఖరు నాటికి యూనిట్ల గ్రౌండింగ్ పూర్తి కావాల్సి ఉంది. అయితే,
మార్చి 12 నాటికే పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటాం.
ఫిబ్రవరి 5లోగా లబ్ధిదారుల ఎంపిక పూర్తి
దళితులు అయితే చాలు.. నాలుగు నియోజకవర్గాల్లో వంద మంది చొప్పున ఫిబ్రవరి 5 నాటికి లబ్ధిదారులను ఎంపిక చేస్తాం. ఎంపిక ప్రక్రియకు ప్రత్యేకంగా కార్యాచరణ అంటూ ఏమీ ఉండదు. దళితులై, స్థానికుడైతే చాలు. ఇప్పటికే తొలి విడుతగా జిల్లాకు రూ.50 కోట్లు వచ్చాయి. పథకం అమలుకు ప్రతి నియోజకవర్గానికి ఒక ప్రత్యేక అధికారిని నియమించడం పూర్తయ్యింది. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం వారు పనిచేస్తుంటారు. క్షేత్ర స్థాయిలో కమిటీలు ఉంటాయి.
ఆర్థికంగా బలోపేతం అయ్యే వరకూ నిరంతర పర్యవేక్షణ
దళిత బంధు లబ్ధిదారులకు రూ.10లక్షలు ఇచ్చి చేతులు దులుపుకోవడం ఉండదు. ప్రతి లబ్ధిదారుడి ఇంటికీ ఓ బృందం వెళ్తుంది. యూనిట్ ఎంపిక మొదలుకుని యూనిట్ పని విధానం, నెలవారీ ఆదాయ, వ్యయాలు, మార్కెటింగ్ తదితర అన్నింటినీ పర్యవేక్షిస్తారు. లబ్ధిదారులు ఆర్థిక పరిపుష్టి సాధించేంత వరకూ పర్యవేక్షణ కొనసాగుతుంది.
యూనిట్ ఎక్కడైనా పెట్టుకోవచ్చు..
లబ్ధిదారుల ఎంపిక మాత్రమే జిల్లాలో జరుగుతుంది. లబ్ధిదారులు ఎంచుకునే వ్యాపారమైనా, వాహనాలు, ఇతర యూనిట్లు ఏవైనా సరే రాష్ట్రంలో ఎక్కడ లాభాలు వస్తాయనుకుంటే అక్కడే పెట్టుకోవచ్చు.
సరైన యూనిట్ ఎంపిక చేసుకోవాలి
పది లక్షల రూపాయలను నూరు శాతం సబ్సిడీగా ఇస్తుండడంతో ఈ అవకాశం పోతే మళ్లీ ఇంత మంచి అవకాశం రాదేమో అని ఎవ్వరూ అనుకోవద్దు. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఆర్థికంగా బలోపేతం కావడానికి సరైన యూనిట్ను ఎంపిక చేసుకోవాలి. ఇప్పటి వరకు 47 రకాల యూనిట్లు ఉండగా అందులో ఏదైనా ఎంపిక చేసుకోవచ్చు. అవే కాకుండా మరే ఇతరత్రాలైనా ఎంపిక చేసుకునే వెసులుబాటు ఉంది. అయితే ఎవరు, ఎలాంటి యూనిట్ ఎంపిక చేసుకున్నా వాటి పనితీరు, లాభ నష్టాలపై అధికారులు పూర్తిగా వివరిస్తారు.