కరోనాతో ప్రత్యామ్నాయం వైపు ప్రైవేట్ ఉద్యోగులు
ఫిష్పాండ్స్ ఏర్పాటుపై ఆసక్తి
ఖర్చు తక్కువ.. లాభాలు ఎక్కువ
సబ్సిడీని సద్వినియోగం చేసుకుంటూ ముందుకు.
చెన్నారావుపేట, ఏప్రిల్ 4: ఉన్నత చదువులు చదివినా.. ఉపాధి కోసం చేపల పెంపకాన్ని ఎంచుకున్నారు. కరోనా నేపథ్యంలో ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలు మూతపడడంతో అందులో పనిచేసే ఉద్యోగులు ప్రత్యామ్నాయం వెతుక్కుంటున్నారు. ఉన్న కొద్దిపాటి భూమిలో ఫిష్పాండ్స్ ఏర్పాటుచేసుకొని ఆర్థికంగా ఎదుగుతున్నారు. ఖర్చు తక్కువ.. లాభాలు ఎక్కువగా ఉండడంతో పాటు ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీని సద్వినియోగం చేసుకుంటూ ఈ రంగంలో రాణిస్తున్నారు వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేట మండలం చెన్నారావుపేటవాసులు. ఒకప్పుడు చేప పిల్లలు, చేపల చెరువులు చూడాలంటే ఆంధ్రా ప్రాంతానికి వెళ్లేవారు. ప్రస్తుతం చెన్నారావుపేట మండలంలో ఫిష్ను పెంచుతున్నారు. ఖర్చు తక్కువ.. లాభాలు ఎక్కువగా వస్తుండడంతో యువత వీటి పెంపకంపై ఆసక్తి చూపుతున్నారు. ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీని సద్వినియోగం చేసుకుంటూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. దాదాపు ఏడు నెలల్లోనే చేపపిల్లలు పెరిగి పెద్దవి కావడంతో వాటిని స్థానికంగా మార్కెట్లో విక్రయిస్తున్నారు.
కరోనా నేపథ్యంలో కొత్త అవతారమెత్తుతున్న ప్రైవేట్ ఉద్యోగులు..
కరోనా వైరస్ అన్ని వర్గాల వారికి తీరని నష్టాన్ని కలిగించింది. వీరిలో ముఖ్యంగా ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులు, అధ్యాపకుల కుటుంబ పోషణ భారమై బతుకుదెరువు కోసం కొత్తదారులు వెతుకుతున్నారు. కొందరు హోటల్స్, ఫాస్ట్ఫుడ్ సెంటర్లు పెట్టుకోగా మరికొందరు స్థానికంగా చేపల పెంపకాన్ని చేపడుతున్నారు. ఉన్న కొద్దిపాటి భూమిలో చేపల చెరువులను ఏర్పాటు చేసి అందులో ఫిష్ను పెంచుతున్నారు. చెన్నారావుపేట మండలం కోనాపురం గ్రామానికి చెందిన తుమ్మలపల్లి అశోక్ ఎంఎస్సీ(కెమిస్ట్రీ), బీఈడీ పూర్తిచేశాడు. నర్సంపేటలోని ఓ ప్రైవేట్ కళాశాలలో రసాయన శాస్త్ర అధ్యాపకుడిగా పనిచేసేవాడు. కరోనా లాక్డౌన్ వల్ల కళాశాలలు ప్రస్తుతం మూతబడ్డాయి. దీంతో జీవితం ప్రశ్నార్థకంగా మారిన తరుణంలో జిల్లా మత్స్యశాఖాధికారిని కలిశాడు. అతడి ప్రోత్సాహంతో అశోక్ తనకున్న వ్యవసాయ భూమిలో చేప పిల్లల పెంపకం వైపు మొగ్గు చూపాడు.
పెంపకం ఇలా..
చేప పిల్లల పెంపకానికి సారవంతమైన వ్యవసాయ భూమి కావాలి. మట్టిని చేయితో పిసికితే ముద్ద అయ్యే నేలలు వీటికి అనువుగా ఉంటాయి. రెండున్నర ఎకరాల నుంచి అర ఎకరం భూమిలో కూడా చేపల చెరువును ఏర్పాటు చేయవచ్చు. ప్రభుత్వం మాత్రం రెండున్నర ఎకరాల వ్యవసాయ భూమి కలిగిన వారికి 40శాతం సబ్సిడీ ఇస్తుంది. చెరువు తవ్వి, గుంత తీసినందుకు ఈ సబ్సిడీ వర్తిస్తుంది. సీడింగ్ యజమాని మాత్రమే తీసుకురావాల్సి ఉంటుంది. బొచ్చ, రవ్వు, బంగారు తీగ లాంటి చేపలు మాత్రమే పెంచేందుకు ఈ చెరువులు అనుకూలంగా ఉంటాయని అధికారులు చెబుతున్నారు. చేప పిల్లలకు మొదటి నెల వరకు 30 నుంచి 32 శాతం ప్రొటీన్లు కలిగిన రెండు మిల్లీమీటర్ల పరిమాణంలో ఉన్న ఫీడ్(పల్లిచెక్క, తవుడు మిశ్రమం) అందివ్వాలి. రెండు నుంచి మూడు నెలల వరకు 3 మి.మీ. పరిమాణం కలిగిన ఆహారాన్ని, నాలుగు నుంచి ఏడు నెలల వరకు 4 మి.మీ. పరిమాణం గల ఆహారాన్ని ఇవ్వాలి. ప్రతి రోజూ సూర్యోదయానికి ముందు, సూర్యాస్తమయం తర్వాత రెండు పూటలా అందించాల్సి ఉంటుంది. ప్రతి 10 రోజులకోసారి చేపపిల్లల సగటు బరువును లెక్కించి వాటి పరిమాణంలో 4శాతం ఫీడింగ్ ఇవ్వాలి.
ఇవి కూడా చూడండి..
ఫాల్కే అవార్డును దోస్త్ రాజ్ బహదూర్కు అంకితం చేస్తున్నా: రజినీకాంత్
రైతులకు మద్దతు తెలిపినందుకే కేంద్రం మమ్మల్ని శిక్షిస్తోంది: కేజ్రీవాల్