వైకుంఠ ఏకాదశి వేడుకలకు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా వైష్ణవాలయాలు ముస్తాబయ్యాయి. యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి బాలాలయం, పాతగుట్ట క్షేత్రం, నల్లగొండ రామాలయం, సూర్యాపేటలోని వేంకటేశ్వరాలయంలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. గురువారం ఉదయం 6.49 గంటలకు యాదాద్రి బాలాలయంలో శ్రీస్వామి వారు తూర్పు ద్వారాన, పాతగుట్ట లక్ష్మీనారసింహుడు ఉత్తర రాజగోపురం గుండా భక్తులకు దర్శనమిన్వనున్నారు. ఒమిక్రాన్ నేపథ్యంలో వైకుంఠ ఏకాదశి పర్వాలు ఆంతరంగికంగానే నిర్వహించనున్నట్లు ఆలయ
ఈఓ ఎన్.గీత తెలిపారు. మరోవైపు.. యాదాద్రీశుడి అధ్యయనోత్సవాలు బాలాలయంలో గురువారం ప్రారంభం కానున్నాయి. ఈ నెల 18 వరకు జరిగే ఉత్సవాల్లో 6 రోజులపాటు అలంకార సేవలు వైభవంగా నిర్వహించనున్నారు.
యాదాద్రి, జనవరి 12 : వైకుంఠ(ముక్కోటి) ఏకాదశి వేడుకలకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆలయాలు ముస్తాబయ్యాయి. సూర్యాపేటలో వేంకటేశ్వరస్వామి ఆలయం, నల్లగొండ రామగిరిలోని సీతారామచంద్రస్వామి ఆలయం, యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి బాలాలయం, పాతగుట్ట క్షేత్రం ముస్తాబయ్యాయి. గురువారం ఉదయం 6.49గంటలకు బాలాలయంలో స్వామి వారు తూర్పు ద్వారం, పాతగుట్ట లక్ష్మీనారసింహుడు ఉత్తర రాజగోపురం ద్వారా దర్శనం ఇవ్వనున్నట్లు ఆలయ ప్రధానార్చకుడు మోహనాచార్యులు తెలిపారు. వైకుంఠ ఏకాదశి ఉత్సవాల్లో భాగంగా బాలాలయంతో పాటు పాతగుట్టను విద్యుద్దీపాలు, మామిడి తోరణాలు, పూలతో అలంకరించారు.
వచ్చే ఏడాది ఉత్తర దిశగా దర్శనం..
సీఎం కేసీఆర్ అంకుఠిత దీక్షతో చేపట్టిన యాదాద్రి పునర్నిర్మాణంలో మరో ఘట్టం ఆవిష్కృతం కానుంది. యాదాద్రిలో గతంలో లేని స్వామి వారి ఉత్తర ద్వారం అద్భుతంగా నిర్మించారు. వచ్చే ఏడాది నుంచి స్వామి వారు ఉత్తర ద్వారం గుండా దర్శనం ఇవ్వనున్నారు. ఇందుకోసం ఉత్తరాన ద్వితీయ ప్రాకారంలోని పంచతల రాజగోపురం ఐదంతస్తతులతో నిర్మించారు. ఉత్తరానికి అధిపతి కుబేరుడు. సాక్షాత్తు తిరుమల తిరుపతి వేంకటేశ్వరుడికి అప్పు ఇచ్చిన పుణ్యమూర్తైన కుబేరుడు ఆధీనంలో ఉన్న ప్రాంతం ఉత్తరం. వైకుంఠ ఏకాదశి రోజు ఉత్తర దిశగా స్వామి వారు భక్తులకు దర్శనమిస్తారు. గతంలో ఉత్తర ద్వారం లేకపోవడంతో ముక్కోటి ఏకాదశి పర్వదినాన తూర్పు ద్వారాన్నే ఉత్తర ద్వార దర్శనానికి ఉపయోగించేవారు. ప్రస్తుతం యాదాద్రి నారసింహుడి ఆలయ పునర్నిర్మాణంతో ముక్కోటి దర్శన భాగ్యాన్ని ఉత్తరం నుంచే చేసుకునే వీలు కలిగింది.
నేటి నుంచి అధ్యయనోత్సవాలు
బాలాలయంలో స్వామి అధ్యయనోత్సవాలు నేటి నుంచి ఈ నెల 18వ తేదీ వరకు 6రోజుల పాటు నిర్వహించనున్నారు. అధ్యయనోత్సవాల్లో భాగంగా స్వామి అలంకార పురపాట్ సేవలను వైభవంగా నిర్వహించనున్నట్లు ఆలయ ఈఓ ఎన్.గీత తెలిపారు. గురువారం ఉదయం గరుఢ వాహనంపై వైకుంఠ నాథుడిగా, సాయంకాలం మత్స్యావతారం విష్ణుమూర్తిగా, 14న ఉదయం వేణుగోపాలుడిగా, సాయంకాలం గోవర్ధనగిరిధారిగా, 15న ఉదయం రామావతారం, సాయంకాలం వేంకటేశ్వర స్వామిగా, 16న ఉదయం వెన్నకృష్ణుడు, సాయంకాలం కాళీయవర్ధనుడిగా, 17న ఉదయం వటపత్రసాయి, సాయంత్రం వైకుంఠనాథుడిగా, 18న ఉదయం నరసింహ స్వామి అలంకార సేవ నిర్వహించి అధ్యయనోత్సవాలకు పరిసమాప్తి పలకనున్నారు.