మణుగూరు రూరల్, జనవరి 17: రేగా విష్ణు మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా సేవలను విస్తరిస్తామని ట్రస్ట్ చైర్మన్, ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే రేగా కాంతారావు అన్నారు. ప్రస్తుతం కంటి శస్త్ర చికిత్సలు చేయిస్తున్నామని, ఇకపై మరిన్ని సేవలు అందించేందుకు ఏర్పాట్లు చేస్తామని అన్నారు. ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇంతకుముందు కంటి వైద్య శిబిరం నిర్వహించి ఆపరేషన్లు అవసరమైన వారిని గుర్తించారు. వారిలో మరో 50 మందిని ఐదో బ్యాచ్గా సోమవారం మణుగూరు 100 పడకల ఆస్పత్రి వద్ద నుంచి హైదరాబాద్ పంపించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాంతారావు వారితో మాట్లాడుతూ సికింద్రాబాద్ పుష్పగిరి కంటి ఆస్పత్రిలో అందించే మెరుగైన వైద్య సేవల గురించి వివరించారు. అనంతరం భోజన సౌకర్యం కల్పించి హైదరాబాద్ తీసుకెళ్లేందుకు ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్సు ఎక్కించారు. మండల పరిషత్ కో ఆప్షన్ సభ్యుడు జావీద్పాషా, నాయకులు తాళ్లపల్లి యాదగిరిగౌడ్, ముద్దంగుల కృష్ణ, తాతా రమణ, మట్టపల్లి సాగర్, రవి, వెంకట్, సృజన్, తురక రామకోటి పాల్గొన్నారు.
రక్తదానం మహాదానం
అత్యవసర సమయంలో క్షతగాత్రులను ఆదుకునేందుకే రేగా విష్ణు మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేసినట్లు ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే రేగా కాంతారావు తెలిపారు. పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బ్లడ్ బ్యాంక్ పోస్టర్లను ఆవిష్కరించి మాట్లాడారు. వారం రోజుల్లో బ్లడ్ బ్యాంక్ నుంచి సేవలు ప్రారంభమవుతాయన్నారు.