జూబ్లీహిల్స్ : రహ్మత్నగర్ డివిజన్లో రూ. 1 కోటి 45 లక్షలతో నిర్మించతలపెట్టిన మల్టీ పర్పస్ ఫంక్షన్హాల్ నిర్మాణ పనుల జాప్యంపై జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. కార్పొరేటర్ సీఎన్ రెడ్డితో కలిసి ఫంక్షన్హాల్ నిర్మాణం చేపట్టనున్న హబీబా ఫాతిమా (హెచ్ఎఫ్) నగర్లోని క్వారీ స్థలాన్ని పరిశీలించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజల సౌకర్యార్థం చేపడుతున్న పనులను త్వరితగతిన ప్రారంభించడమే కాక వాటిని సకాలంలో పూర్తి చేయాల్సిన భాద్యత అధికారులపై ఉందన్నారు. పేద ప్రజలు శుభకార్యాలు జరుపుకోవాలంటే ఫంక్షన్ హాల్లకు లక్షలాది రూపాయలు ఖర్చు చేసి ఇబ్బందుల పాలవుతున్నారని, ఇలాంటి ఇబ్బందులు ఉండకుండా ఈ భారీ ఫంక్షన్ హాల్లు నిర్మిస్తున్నామన్నారు.
అభివృద్ది కార్యక్రమాలకు ప్రారంభోత్సవం చేపట్టిన అనంతరం పనులు మొదలు పెట్టకపోతే ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లుతుందని అన్నారు. ప్రభుత్వ కార్యక్రమాలతో పాటు పేద ప్రజల పండుగలు.. వివాహాది శుభకార్యాలకు అనుకూలంగా ఉండేందుకు చేపడుతున్న మల్టీ పర్పస్ ఫంక్షన్ హాల్ నిర్మాణం పనులు వెంటనే ప్రారంభించాలని ఈ సందర్భంగా అధికారులకు సూచించారు.