ఉమ్మడి మెదక్ జిల్లాలో మంగళవారం మాఘ అమావాస్య జాతరలు వైభవంగా జరిగాయి. ప్రముఖ పుణ్య క్షేత్రాలతో పాటు పలు ఆలయాలు కిటకిటలాడాయి. సిద్దిపేట జిల్లా కోహెడ మండలం కూరెల్ల గ్రామ శివారు కొండల్లో వెలసిన ప్రతాప రుద్ర సింగరాయ జాతర ప్రకృతి ఒడిలో ఘనంగా జరిగింది. కూడవెల్లి త్రివేణి సంగమంలో భక్తులు పుణ్యస్నానాలు చేశారు. రామలింగేశ్వరాలయంలో మెదక్ ఎంపీ , టీఆర్ఎస్ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు కొత్త ప్రభాకర్రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. మెదక్ జిల్లా ఏడుపాయల వనదుర్గామాతను సుమారు లక్షకు పైగా భక్తులు దర్శించుకున్నారు. వేకువజామునే మంజీరా నదిలో స్నానాలు చేసి, అమ్మవారికి మొక్కులు చెల్లించారు. ఆలయాల దర్శనంతో భక్తులు పులకించారు.
కోహెడ, ఫిబ్రవరి 1 : భక్తులు కోరిన కోర్కెలు తీర్చే స్వామిగా ప్రసిద్ధి గాంచిన ప్రతాపరుద్ర సింగరాయ లక్ష్మీనర్సింహాస్వామి జాతర మంగళవా రం భక్తజనసంద్రమైంది. గ్రామ సర్పంచ్ గాజుల రమేష్జ్యోతి దంపతులు పంచామృత అభిషేకం చేసి స్వామి వారికి తొలిపూజ చేశారు. మండలంలోని కూరెల్ల గ్రామ శివారులోని సింగరాయ లొద్దిలో ఉన్న సింగారయ గుట్టల్లో వెలిసిన స్వామిని దర్శించుకునేందుకు వేలాది మంది భక్తులు తరలివచ్చారు. జాతర స్థలంలో తూర్పు నుంచి పడమరకు ప్రవహించే మోయతుమ్మెద వాగులో స్నానాలు చేసి గుట్టపై వెలిసిన లక్ష్మీనర్సింహాస్వామిని దర్శించుకున్నారు. ఆయా శాఖ లకు సంబంధించిన అధికారులు హాజరయ్యారు. పోలీసులు భారీ బందోబసు ఏర్పాటు చేశారు. అనంతరం చెట్లకింద వంటలు చేసుకుని కుటుంబ సమేతంగా సహాపంక్తి భోజనాలు చేశారు.