సంగమేశ్వర, బసవేశ్వరతో నాలుగు నియోజకవర్గాలకు సాగునీరు
3.45 లక్షల ఎకరాలు సస్యశ్యామలం
వారం రోజుల్లో డీపీఆర్ పంపాలి
ఆరునెలల్లో ఇంట్రిగేటెడ్ మార్కెట్ పనులు పూర్తి చేయాలి ఆర్థిక మంత్రి హరీశ్రావు
మెదక్, సంగారెడ్డి జిల్లాల అధికారులతో సమీక్ష
హాజరైన ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు
సంగారెడ్డి మార్చి 23 (నమస్తే తెలంగాణ): సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాల పనుల కోసం రెండు నెలల్లో రెండర్లను ఆహ్వానించనున్నట్లు ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు తెలిపారు. రెండు ఎత్తిపోతల పథకాల నిర్మాణం కోసం వారం రోజుల్లో డీపీఆర్ అంచనాలు పంపాలని ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. మంగళవారం హైదరాబాద్లోని మర్రిచెన్నారెడ్డి మానవవనరుల కేంద్రంలో మంత్రి జిల్లా ఎమ్మెల్యేలతో కలిసి నీటిపారుదల శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కొమురవెల్లి మల్లన్న సాగర్ కాల్వల ద్వారా సింగూరు ప్రాజెక్టుకు వచ్చే నీటిని సంగారెడ్డి, జహీరాబాద్, నారాయణఖేడ్, అం దోల్ నియోజవకర్గాలకు సాగునీరు అందించాలన్న లక్ష్యంతో సీఎం కేసీఆర్ సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాలకు శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాలు పూర్తయితే జహీరాబాద్, నారాయణఖేడ్, సంగారెడ్డి నియోజకవర్గాలకు సాగునీరు అందుతాయన్నారు. రెండు ఎత్తిపోతల పథకాల ద్వారా 3.45 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. బసవేశ్వర ఎత్తిపోతల పథకం ద్వారా నారాయణఖేడ్ నియోజకవర్గంలోని అన్ని మండలాలకు సాగునీరు అందించనున్నట్లు చెప్పా రు. సీఎం కేసీఆర్ సూచనలకు అనుగుణంగా ఎక్కువ ఆయకట్టుకు సాగునీరు అందేలా ఇరిగేషన్ అధికారులు చూడాలని సూచించారు. సంగారెడ్డి జిల్లా సర్కిల్ పరిధిలోని ప్యాకేజీ 17, 18, 19 కాళేశ్వరం ప్రాజెక్టు పనులు జరుగుతున్న తీరును మంత్రి హరీశ్రావు ఇరిగేషన్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. వేగంగా పనులు పూర్తయ్యేలా ప్రణాళికాబద్ధంగా పనిచేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఇరిగేషన్ అధికారులు సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాల ద్వారా ఏయే మండలాలకు సాగునీరు అందుతాయనే విషయాన్ని మంత్రి హరీశ్రావుకు వివరించారు. సమీక్షా సమావేశంలో మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి, ఎమ్మెల్యేలు మదన్రెడ్డి, పద్మాదేవేందర్రెడ్డి, క్రాంతి కిరణ్, గూడెం మహిపాల్రెడ్డి, భూపాల్రెడ్డి, మాణిక్రావు, ఎమ్మెల్సీలు ఫరీదుద్దీన్, భూపాల్రెడ్డి, సంగారెడ్డి సీఈ అజయ్కుమార్, సంగారెడ్డి ఎస్ఈ మురళీధర్, ఈఈ మధుసూదన్రెడ్డి , నర్సాపూర్ ఈఈ నగేశ్ పాల్గొన్నారు.
ఆరునెలల్లో ఇంట్రిగేటెడ్ మార్కెట్ పనులు పూర్తి చేయాలి
జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల్లో ఇంటిగ్రేటెడ్ వెజ్, నాజ్వెజ్ మార్కెట్ నిర్మాణ పనులను ఆరు నెలల్లో పూర్తి చేయాలని మంత్రి హరీశ్రావు అధికారులను ఆదేశించారు. మంగళవారం హైదరాబాద్లోని మర్రి చెన్నారెడ్డి మానవవనరుల కేం ద్రంలో జిల్లా అధికారులతో సంగారెడ్డి, అందోల్, జహీరాబాద్, తెల్లాపూర్, పటాన్చెరు, నారాయణఖేడ్ మున్సిపాలిటీల్లో వెజ్, నాన్వెజ్ మార్కెట్, శ్మశానవాటికల నిర్మాణ పనుల పురోగతిపై సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రైతు వేదికల తరహాలో ఇంటిగ్రేటెడ్ వెజ్, నాన్వెజ్ మార్కెట్ నిర్మాణ పనులు వేగంగా పూర్తి చేయాలన్నారు. మార్కెట్లల్లో అన్ని మౌలిక సదుపాయాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. నిర్మాణం పనుల్లో ఎక్కడైనా సమస్యలు తలెత్తితే నేరుగా తన దృష్టికి తీసుకురావాలని అధికారులకు సూచించారు. జిల్లాలో మిషన్ భగీరథ పథకంలో భాగంగా పాఠశాలలు, ఆలయాలు, ప్రార్థనా మందిరాలు, వైకుంఠధామాలు, రైతువేదికలకు మంచి నీటి సౌకర్యం కల్పించాలని ఆదేశించారు.