తెలంగాణ రాష్ర్టానికే తలమానికంగా ఉన్న ఏడుపాయల వనదుర్గాభవానీ ఆలయం అన్ని హంగులతో అభివృద్ధి చెందుతున్నది. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఎంతో ప్రసిద్ధిగాంచిన ఈ ఆలయాన్ని టీఆర్ఎస్ ప్రభుత్వం అభివృద్ధి చేస్తున్నది. దినదినాభివృద్ధి చెందుతున్న ఈ ఆలయానికి భక్తుల తాకిడి రోజురోజుకూ పెరుగుతున్నది. అందుకు అనుగుణంగా ప్రభుత్వం సౌకర్యాలు కల్పిస్తున్నది. ఇప్పటికే ఇక్కడ శాశ్వత ప్రాతిపదికన షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణానికి భూమిపూజ చేశారు. రూ.3.16 కోట్లతో పనులు చేపట్టనున్నారు. అంతేకాకుండా దాతల సహకారంతో కాటేజీల నిర్మాణానికి ప్రయత్నాలు మొదలు పెట్టారు. వసతుల కల్పనతో భక్తులకు ఇబ్బందులు తీరనున్నాయి.
పాపన్నపేట, అక్టోబర్ 22: పవిత్ర పుణ్యక్షేత్రం మెదక్ జిల్లా పాపన్నపేట మండలం ఏడుపాయల వనదుర్గా భవానీమాత ఆలయం దినదినాభివృద్ధి చెందుతున్నది. పెరుగుతున్న భక్తుల సంఖ్యకు అనుగుణంగా ఇక్కడ వసతులు కల్పించడంపై ఆలయ అధికారులు, ప్రజాప్రతినిధులు కృషిచేస్తున్నారు.
మహిమాన్విత క్షేత్రం..
ఏడుపాయల వనదుర్గా భవానీమాత ఆలయానికి శతాబ్దాల చరిత్ర ఉంది. అప్పట్లో కారడివిగా ఉన్న ఏడుపాయల్లో వనదుర్గా భవానీమాత స్వయంభూగా వెలిసినట్లు చరిత్ర చెబుతున్నది. మహిమాన్విత క్షేత్రంగా భక్తులు విశ్వసిస్తారు. రానురాను అమ్మవారి పేరు దశదిశలా వ్యాపించడంతో భక్తుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నది. దీంతో అక్కడ దుకాణాలు సైతం వెలిశాయి. కోట్లాది రూపాయల ఆదాయం ఉన్న ఏడుపాయల్లో శాశ్వత ప్రాతిపదికన ఒక్క దుకాణా సముదాయం లేకపోవడం గమనార్హం. ఏటా మహాశివరాత్రితో పాటు మాఘ అమావాస్య, దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఇక్కడ వైభవంగా నిర్వహిస్తారు. ఏడాది పొడుగునా లక్షలాది మంది భక్తులు అమ్మవారి దర్శనానికి వస్తుంటారు. ఆదివారం, సెలవు రోజులు, ముఖ్య దినాల్లో భక్తుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. దుర్గామాత దర్శనానికి తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి భక్తులు తరలి వస్తుంటారు. ఇంత పెద్ద చరిత్ర కలిగిన ఏడుపాయల్లో శాశ్వత షాపింగ్ కాంప్లెక్స్ లేదు. మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి, ఆలయ ఈవో సార శ్రీనివాస్ ప్రత్యేక చొరవ తీసుకుని ఏడుపాయల్లో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించాలని ఆలోచనకు వచ్చారు. ఆలయానికి సంబంధించిన రూ.3.16 కోట్లతో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించేందుకు శ్రీకారం చుట్టారు. దీంతో కొన్ని దశాబ్దాలుగా గుడారాలు వేసుకొని, రేకుల ద్వారా తాత్కాలికి షెడ్లు ఏర్పాటు చేసుకుని దుకాణాలు నిర్వహిస్తున్న వ్యాపారులు బాధలు తీరనున్నాయి.
80 వరకు దుకాణాల సముదాయం నిర్మాణం..
ఏడుపాయల్లో పాత దేవాదాయశాఖ కార్యాలయం పక్కన మంజీర నది తీరాన షాపింగ్ కాంప్లెక్స్ నిర్మిస్తామని ఆలయ ఈవవో సార శ్రీనివాస్ వెల్లడించారు. ప్రస్తుతం ఉన్న గుడారాలను, రేకుల షెడ్లకు సంబంధించిన తాత్కాలిక దుకాణాలను తొలగించి, అదే వరుస క్రమంలో దుకాణాల నిర్మాణం చేపడతామని తెలిపారు. నది పొడవునా రూ.3.40 కోట్లతో సుమారు 80 వరకు దుకాణాలతో సముదాయం నిర్మించనున్నట్లు వెల్లడించారు. ఐదు దుకాణాలకు మధ్యలో మెట్లు వేస్తూ మరో ఐదు దుకాణాలు వరుసగా నిర్మించడానికి ప్లాన్ రూపొందించారు. కాగా, ఈ దుకాణాల పైన దాతల సహాయంతో భక్తుల నివాసం కోసం కాటేజీలు సైతం నిర్మించేందుకు ఆలయ అధికారులు కృషిచేస్తున్నారు. ఇది సాకారమైతే ఇక్కడి వచ్చే భక్తులు బసచేయడానికి సౌకర్యం ఏర్పడుతుంది. ఈ పాటికే దుకాణాల సముదాయం స్థలాన్ని శుభ్రం చేయడానికి ప్రయత్నించగా, మంజీర వరదల మూలంగా పనులు నిలిచిపోయాయి. త్వరలోనే షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణ పనులు ప్రారంభిస్తామని అధికారులు వెల్లడించారు.
సంతోషంగా ఉంది..
పవిత్ర పుణ్యక్షేత్రం ఏడుపాయల వనదుర్గా భవానీ మాత సన్నిధిలో శాశ్వత ప్రాతిపదికన దుకాణ సముదాయం నిర్మించడానికి పూనుకోవడం చాలా సంతోషంగా ఉంది. పూర్తిగా ఆల య నిధులతో ఈ షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం చేపడుతున్నాం. నేను 2019లో ఆలయ ఈవోగా బాధ్యతలు చేపట్టా. అప్పట్లో రూ.2.25 కోట్ల నిధులు ఉండే, ప్రస్తుతం ఆ నిధి రూ.5 కోట్ల వరకు పెరిగింది. ఆ డబ్బులతో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం చేపడతాం. ఆలయానికి వచ్చే భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తాం. ఎమ్మెల్సీ శేరి సుభాశ్రెడ్డి, ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి సహకారంతో ఆలయాన్ని మరింతగా అభివృద్ధి చేస్తాం.
-సార శ్రీనివాస్, ఏడుపాయల వనదుర్గా భవానీమాత ఆలయ ఈవో