ఖాళీ స్థలాలు, రోడ్ల పై చెత్త వేస్తే జరిమానా
స్వచ్ఛ టాయిలెట్ల నిర్మాణం
జిల్లాలో నాలుగు మున్సిపాలిటీలు
మెదక్ మున్సిపాలిటీ, మార్చి 21 : మెదక్ మున్సిపాలిటీ స్వచ్ఛ సర్వేక్షణ్లో మెరుగైన ర్యాంకు కోసం పోటీ పడుతున్నది. మెదక్ మున్సిపాలిటీకి 2020 సంవత్సరంలో జాతీయ స్థాయిలో(దక్షిణాది జోన్) 24వ స్థానం, రాష్ట్ర స్థాయిలో 6వ స్థానం లో నిలిచింది. పరిశుభ్రతలో మార్పులు తీసుకొచ్చారు. రోడ్ల మీద చెత్త వేయకుండా తడి, పొడి చెత్త కోసం డబ్బాలు ఏర్పాటు చేశారు. స్వచ్ఛ టాయిలెట్లను ప్రజలందరూ వినియోగించుకునేలా అవగాహన కల్పిస్తున్నారు. ఖాళీ ప్రదేశాలు, రోడ్లపై చెత్త వేయకుండా నిఘా పెట్టారు. చెత్త వేసిన వారికి జరిమానా విధిస్తున్నారు. తడి చెత్తతో సేంద్రియ ఎరువు తయారు చేయడం వంటి పనులు చేపట్టారు. చెత్తను తరలించడం కోసం వాహనాల వినియోగాన్ని పెం చారు.
5 చోట్ల స్వచ్ఛ టాయిలెట్లు
బహిరంగ ప్రదేశాల్లో మల, మూత్ర విసర్జన రహిత పట్టణంగా మార్చేందుకు ప్రభుత్వం స్వచ్ఛ తెలంగాణ మిషన్ ప్రారంభించడంతో 5 స్వచ్ఛ టాయిలెట్లను అందుబాటులోకి తీసుకొచ్చారు. ప్రధాన చౌరస్తాలో వ్యక్తిగత,సామూహిక మరుగుదొడ్లు నిర్మించడంతో పాటు మహిళల కోసం ప్రత్యేక టాయిలెట్లను ఏర్పాటు చేశారు.
టీపీఐ ఆధ్వర్యంలో తనిఖీలు..
కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ, స్వచ్ఛ భారత్ మిషన్ ఆధ్వర్యంలో ఏటా దేశవ్యాప్తంగా జనాభా అధారంగా ఆయా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో పారిశుద్ధ్య పనులపై ‘స్వచ్ఛ సర్వేక్షణ్’ పేరుతో ర్యాంకులు ఇస్తున్నది. ఇందులో భాగంగా ఉత్తమ ర్యాంకు సాధించడానికి మెదక్ మున్సిపాలిటీ పోటీ పడుతోంది.ఢిల్లీ నుంచి వచ్చిన క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సంస్థ థర్డ్ పార్టీ మెదక్ విచ్చేసి పర్యవేక్షించింది. వారిచ్చే మార్కుల ఆధారంగానే మున్సిపాలిటీకి ర్యాంకు లభించే ఆస్కారం ఉంది.
స్వచ్ఛ సర్వేక్షణ్లో మార్కులు …
స్వచ్ఛ సర్వేక్షణ్లో మూడు విభాగాల్లో 6 వేల మార్కులు ఉంటాయి. పౌరుల అభిప్రాయ సేకరణకు 1800, వ్యక్తిగత మరుగుదొడ్లు 1800, తడి, పొడి చెత్త సేకరణ, సేంద్రియ ఎరువుల తయారీకి 2400 ఉంటాయి. ఓట్ ఫర్ సీటీ యాప్ ద్వారా పౌరుల అభిప్రాయాన్ని తెలిపేందుకు మార్చి 31 వరకు గడువు ఉంది. ఓట్ ఫర్ యువర్ సిటీలో స్వచ్ఛ సర్వేక్షణ్ వెబ్ పోర్టల్లో మెదక్ను ఎంచుకొని పట్టణంపై అడిగే ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాలి. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ ఫోన్ ద్వారా కూడా వివరాలు సేకరిస్తోంది. పౌరుల అభిప్రాయానికి జోష్ ఆవార్డులు ప్రకటించే అవకాశం ఉంది.
జిల్లాలో నాలుగు మున్సిపాలిటీలు..
స్వచ్ఛ సర్వేక్షణ్-2021 పోటీ కోసం జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీలు పోటీ పడుతున్నాయి. మెదక్ మున్సిపాలిటీతోపాటు నూతనంగా ఏర్పాటైన తూప్రాన్, నర్సాపూర్, రామాయంపేట మున్సిపాలిటీలు తొలిసారిగా 10 నుంచి 25 వేల లోపు జనాభా కలిగిన మున్సిపాలిటీల కేటగిరిలో పోటీ పడుతున్నాయి.
ప్రజలు సహకరించాలి
స్వచ్ఛ మున్సిపాలిటీకి ప్రజలు సహకరించాలి. ఇంట్లో చెత్తను వేరు చేసి మీ ఇంటి వద్దకు వచ్చే వాహనాల్లో మాత్రమే వేయాలి. రోడ్లపై, ఖాళీ స్థలాల్లో వేస్తే చర్యలు తీసుకుం టాం. ప్రజలు సహకరిస్తే స్వచ్ఛతలో మున్సిపాలిటీ ప్రథ మ స్థానంలో నిలుస్తుంది.