కోహీర్, జనవరి 19 : ఆలుగడ్డ పంటకు మద్దతు ధర ప్రకటించకుండా కేంద్రం తాత్సారం చేస్తున్నది. ఆలుగడ్డ పంట సాగుతో మద్దతు లభించకపోవడంతో అన్నదాతలు అయోమయానికి గురవుతున్నారు. ఆలు గడ్డ పంటను సాగు చేయడంలో కోహీర్ మండలం జిల్లాలో పేరుగాంచింది. ఈ ప్రాంతంలో పుష్కలంగా ఉన్న నీటి వనరులు, సారవంతమైన భూమి ఉండడంతో ఆలుగడ్డను పండించేందుకు రైతన్నలు మొగ్గు చూపుతున్నారు. చేనులో విత్తనం నాటిన మూడు నెలలకే పంట చేతికందుతుందని, తాము లాభాల బాట పడుతామనే విశ్వాసంతో రైతన్నలు మరింత ఆసక్తి చూపుతున్నారు. సంగారెడ్డి జిల్లా కోహీర్ మండలంలోని కవేలి, దిగ్వాల్, మాచిరెడ్డిపల్లి, పీచెర్యాగడి, మద్రి, మనియార్పల్లి, బిలాల్పూర్, వెంకటాపూర్, తదితర గ్రామాల్లో రెండు వేల ఎకరాలకు పైగా ఆలుగడ్డ పంటను సాగు చేశారు. ఆలు విత్తనాలు పంజాబ్ రాష్ట్రం జలంధర్ నుంచి తీసుకువచ్చి రైతులు తమ పొలాల్లో నాటారు. మూడు నెలల క్రితం విత్తనం నాటిన రైతుల పొలాల్లో ఆలుగడ్డలను సేకరిస్తున్నారు. అయితే, వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడంతో కొంతవరకు దిగుబడి తగ్గింది. ఆలుగడ్డ పంటలో అధిక దిగుబడి రావాలంటే చలి, మంచు అధికంగా ఉండాలి. కానీ, అక్టోబర్, నవంబర్లో కూడా వర్షాలు కురువడంతో రైతన్నలు నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. రూ.900 నుంచి రూ.1000 60కిలోల విత్తన బస్తాను కొనుగోలు చేశారు. ఎకరానికి రూ.30వేల వరకు పెట్టుబడి కోసం ఖర్చు చేశారు. పొలంలో మూడు నెలల క్రితం విత్తనాలు నాటిన రైతన్నలు ఆలుగడ్డ పంటను సేకరించడంతో నిమగ్నమయ్యారు.
అనుకూలించని వాతావరణం..
గతేడాది ఒక్కో విత్తనం బస్తాకు 15 నుంచి 20 బస్తాల వరకు దిగుబడి లభించింది. కానీ, ఇప్పుడు మాత్రం అందులో సగానికి పడిపోయింది. కొంతమంది రైతుల పొలాల్లో ఆరు నుంచి ఎనిమిది బస్తాల దిగుబడి మాత్రమే లభిస్తున్నది. గోనె సంచుల కొనుగోలు, రవాణా చార్జీలు కూడా పెరిగాయి. దీంతో రైతులకు నష్టాలను తెచ్చిపెడుతుంది. మండలంలోని ఆయా గ్రామాల్లో 2,200 ఎకరాల్లో పంటను సాగు చేస్తున్నారు. సంగారెడ్డి జిల్లాలో అత్యధికంగా సాగు చేస్తున్నా రైతులను మాత్రం ఆదుకోవడంలో కేంద్ర ప్రభుత్వం వెనుకబడింది. మద్దతు ధర కల్పించకుండా కాలయాపన చేస్తున్నది. పెట్టుబడి ఖర్చులు కూడా తిరిగి వచ్చే పరిస్థితులు కనిపించడం లేదు. కేంద్ర ప్రభుత్వం తమను ఆదుకోవాలని ఆయా గ్రామాల రైతులు కోరుతున్నారు.
మద్దతు ధర కల్పించాలి
వేరే పంటలకు మద్దతు ధర ఉన్నట్టుగానే ఆలుగడ్డకు కూడా కేంద్ర ప్రభు త్వం మద్దతు ధరను ప్రకటించాలి. ప్రస్తుతం మా ర్కెట్లో కిలో గడ్డ రూ.10 నుంచి 12 మాత్రమే కొంటున్నరు. నేను ఆగ్రా, జలంధర్ నుంచి తీసుకువచ్చి 80బస్తాల ఆలుగడ్డ విత్తనం వేశాను. మార్కెట్లో ఆలుగడ్డకు మద్దతు ధర ఉంటేనే రైతులకు మంచి జరుగుతుంది.
కోల్డ్ స్టోరేజీలను నిర్మించాలి
ఆలుగడ్డ విత్తనం కోసం ప్రతీ ఏడాది ఆగ్రా, జలంధర్ వెళ్తున్నం. కోల్డ్ సోరేజీలు ఉంటే విత్తనం ఇక్కడే దొరుకుతుంది. ఈ సారి వాతావరణం సరిగాలేకపోవడంతో దిగుబడి సగానికంటే తక్కువగా వస్తున్నది. నేను ఐదు ఎకరాల్లో విత్తనం వేశాను. పంట దిగుబడి చాలా తగ్గుతున్నది. కేంద్రం వెంటనే రైతులను ఆదుకోవాలి.
-మాణిక్రెడ్డి, చింతల్ఘట్, కోహీర్ మండలం