జహీరాబాద్ మున్సిపాలిటీలో రూ. 6.18 కోట్ల ఆస్తి పన్ను వసూళ్లే లక్ష్యం
వసూలైనవి రూ.5.85 కోట్లు
వసూళ్లు కావాల్సినవి రూ.14.32 లక్షలు
ఇంటింటికీ వెళ్లి అవగాహన కల్పిస్తున్న అధికారులు
జహీరాబాద్, ఏప్రిల్ 3 : జహీరాబాద్ మున్సిపాలిటీలో అధికారులు వంద శాతం పన్ను వసూళ్లే లక్ష్యంగా పని చేశారు. పట్టణంలో అధికారులు ఇంటింటికీ వెళ్లి ప్రజలకు అవగాహన కల్పించి, ఆటోలు, ప్లెక్సీల ద్వారా ప్రచారం చేసి మొండి బకాయిలను వసూలు చేస్తున్నారు. 2020-21 ఆర్థిక సంవత్సరంలో జహీరాబాద్ మున్సిపల్ టార్గెట్ రూ.6.18 కోట్లు కాగా, అధికారులు మార్చి 31 వరకు రూ.5.85 కోట్లు వసూలు చేశారు. మున్సిపల్లో 97.61 శాతం పన్ను వసూలు చేశారు. వందశాతం ఆస్తి పన్ను వసూలు చేసేందుకు కమిషనర్ సుభాశ్రావు, డీఈఈ దీప్చంద్, రెవెన్యూ అధికారి ప్రభాకర్ ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. మున్సిపాలిటీ పరిధిలో పన్ను వసూలు చేసేందుకు 9 ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి వసూలు చేస్తున్నారు. నిత్యం కాలనీల్లో పర్యటిస్తూ బిల్లులు వసూలు చేస్తున్నారు. జహీరాబాద్ పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం అభివృద్ధి పనులు చేస్తుంది. ప్రతి ఇంటికీ తాగునీరు సరఫరా చేసేందుకు మిషన్ భగీరథ పనులు చేస్తుంది. ప్రజలకు అన్ని ఒకే చోట కొనుగోలు చేసేందుకు సమీకృత మార్కెట్ను నిర్మిస్తున్నారు. కాలనీల్లో సీసీ రోడ్లు, మురుగు కాల్వల నిర్మాణ పనులు చేపట్టారు. పట్టణ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వైకుంఠధామాలు నిర్మించారు. పట్టణ ప్రగతిలో భాగంగా పార్కులను నిర్మించారు. ప్రధాన రోడ్డును విస్తీర్ణం చేసి రోడ్డుకు ఇరువైపులా మొక్కలు నాటారు. ఆకుపచ్చని పట్టణం చేసేందుకు కాలనీలు, పార్కుల్లో నాటారు.
వంద శాతం పన్ను వసూళ్లే లక్ష్యం
ఆస్తి పన్ను వసూళ్ల కోసం ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి 97.61 శాతం వసూలు చేశాం. మొండి బకాయిలు వసూలు చేసేందుకు కాలనీల్లో పర్యటిస్తున్నాం. ప్రజలు సకాలంలో ఆస్తి పన్ను చెల్లించి పట్టణాభివృద్ధిలో భాగస్వాములు కావాలి.