ధూళిమిట్ట, ఏప్రిల్ 3: జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ధూళిమిట్ట మండల కేంద్రంలోని రైతు వేదిక భవనంలో తహసీల్దార్ అశోక్ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రంపై రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా రైతులు పలు అంశాలను లేవనెత్తారు. టార్పాలిన్ కవర్లు, ధాన్యం కొనుగోలుకు సరిపడా గోనెసంచులు, ధాన్యం తూకం వేసే సమయంలో అధికంగా కటింగ్ చేస్తున్నారని, అటువంటి పొరపాట్లు జరుగకుండా చూడాలని కోరారు. తహసీల్దార్ స్పంది స్తూ తామెప్పుడూ రైతులకు అందుబాటులోనే ఉంటామని, ఎటువంటి తప్పు జరగకుండా చూస్తామని హామీ ఇచ్చారు. రైతులు తేమ శాతం 17% వుంటేనే కొనుగోలు కేంద్రానికి తీసుకురావాలని సూచించారు. ధూళిమిట్టలో 703 మంది రైతులు 923 ఎకరాల్లో పంట సాగు చేశారని, దాదాపు 2339 మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందన్నారు. 35వేల గోనె సంచులు, 1435 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి 60 లారీ ట్రిప్పులు అవసరమవుతాయని తహసీల్దార్ తెలిపారు. సమావేశంలో మద్దూరు జడ్పీటీసీ గిరి కొండల్ రెడ్డి, ధూళిమిట్ట మండల స్పెషల్ ఆఫీసర్ రమణాచారి, ఉపసర్పంచ్ పోతరాజు మధు, యూత్ కాంగ్రెస్ మం డలాధ్యక్షుడు కమలార్ యాదవ్, ఏఈవోలు శివరాం, పూజ, వీఆర్వో యాదగిరి,గ్రామ టీఆర్ఎస్ అధ్యక్షుడు స్వర్గం లక్ష్మయ్య, రైతు సమన్వయ సమితి గ్రామ కో ఆర్డినేటర్ దుబ్బుడు మహేందర్, రైతులు పాల్గొన్నారు.
కొమురవెల్లిలో రైతులకు అవగాహన సదస్సు
రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని కొమురవెల్లి ఇన్చార్జి తహసీల్దార్ నీలిమ అన్నారు.శనివారం కొమురవెల్లి మండల కేంద్రంతో పాటు కిష్టంపేటలో రైతులకు ధాన్యం కొనుగోలుపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు గ్రామాల్లో ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నదన్నారు. సమావేశంలో జడ్పీటీసీ సిలువేరు సిద్దప్ప, సర్పంచ్లు సార్ల లత, బీమనపల్లి కరుణాకర్, వైస్ ఎంపీపీ కాయిత రాజేందర్రెడ్డి, ఆర్ఐ రమేశ్, ఏఈవో మంజుల, రైతు సమన్వయ సమితి గ్రామ కో ఆర్డినేటర్లు స్వాములపల్లి కనకాచారి, కొత్త రవీందర్రెడ్డి, రైతులు పాల్గొన్నారు.