తక్కువ ధరలకే కూరగాయలు, వస్తువులు
చిరు వ్యాపారులు, వినియోగదారుల్లో ఆనందం
ఊట్కూర్, ఏప్రిల్ 4 : మండలకేంద్రంలో నిర్వహిస్తున్న సంతకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తుంది. కొద్ది నెలల కిందట సర్పంచ్ సూర్యప్రకాశ్రెడ్డి కృషితో ఏర్పాటు చేసిన సంత బజార్ను ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. 40 ఏండ్లుగా కనుమరుగైన సంత తిరిగి పూర్వ వైభవాన్ని సంతరించుకొని వినియోగదారులతో కళకళలాడుతుంది. మండల కేంద్రంతోపాటు చుట్టు పక్కల గ్రామాల్లో అధిక శాతం పేదలు నివసిస్తుండటంతో కార్మికులు, దినసరి కూలీలతోపాటు ఉద్యోగులు, వ్యాపారులు బుధవారం నిర్వహించే సంతలో కూరగాయలు, పండ్లు, ఆకు కూరలు కొనుగోలు చేసేందుకు మొగ్గు చూపుతున్నారు. సంతలో కూరగాయలు, పండ్లతోపాటు నిత్యావసర సరుకులు తక్కువ ధరలకే దొరుకుతుండటంపై కొనుగోలుదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
క్రమంగా వినియోగ దారులు పెరుగడంతో మక్తల్, నారాయణపేట, ధన్వాడ, మరికల్, జక్లేర్, పులిమామిడి, దామర్గిద్ద తదితర గ్రామాలు, పట్టణాలకు చెందిన సుమారు 300 మందికి పైగా వ్యాపారులు తాజా కూరగాయలు, నిత్యావసర సరుకులు, మాంసం, చేపలు, దుస్తులు, చెప్పులు, వ్యవసాయ పరికరాలు, రక రకాల వస్తువులను తెచ్చి విక్రయిస్తున్నారు. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు సంతను నిర్వహిస్తుండటంతో సామాన్యులతోపాటు ఉద్యోగులకు సైతం అనుకూలంగా ఉంది. గ్రామంలో సంత ఏర్పాటుతో దూర ప్రాంతాలకు వెళ్లి కొనుగోలు చేయాల్సిన అవసరం లేకుండా పోయిందని స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇదే క్రమంలో తమకు పనిభారం తగ్గి డబ్బు, సమయం ఆదా అవుతుందని మహిళలు, స్థానికులు పేర్కొంటున్నారు. కొద్ది నెలల కిందట ఏర్పాటైన సంత క్రమంగా విస్తరిస్తూ వినియోగ దారులతో కళకళ లాడుతుండటంపై అటు చిరు వ్యాపారులు, ఇటు వినియోగదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.