అంబర్పేట : ఇంట్లో నుంచి బయటకు వెళ్లిన ఓ వ్యక్తి అదృశ్యమైన సంఘటన నల్లకుంట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…కట్టంగూర్ సరళ, యాదగిరిలు భార్యాభర్తలు, వీరు స్థానిక దయానంద్నగర్లో నివాసముంటున్నారు. సరళ ఇండ్లల్లో పని చేస్తుంటుంది.
యాదగిరి వాటర్ ప్రూప్ వర్కర్గా పని చేస్తున్నాడు. ఈ నెల 1 న ఉదయం ఆరున్నరకు సరళ పనికి వెళ్లింది. ఇంట్లో ఆమె భర్త యాదగిరి, కుమారుడు ఉన్నాడు. పని పూర్తిచేసుకొని తిరిగి 11.30 సమయంలో ఆమె ఇంటికి వచ్చింది. ఇంట్లో కుమారుడు ఒక్కడే ఉన్నాడు. భర్త కనిపించలేదు.
వెంటనే యాదగిరి గురించి కొడుకుని ఆడుగగా, ఏదో పని ఉందని బయటకు వెళ్లాడని సమాధానం ఇచ్చాడు. ఇంట్లోనే ఫోన్ పెట్టి వెళ్లాడు. దీంతో అతని గురించి తెలిసినవారు,బంధువులు, చుట్టుపక్కల వెతికినా ఫలితం కనిపించలేదు. దీంతో నల్లకుంట పోలీసులకు ఫిర్యాదు చేసింది.
యాదగిరి మానసిక స్థితి బాగలేదని, డిసెంబర్ 31న ఉరి వేసుకొని ఆత్మహత్యకు ప్రయత్నించాడని ఫిర్యాదులో పేర్కొన్నది. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.