శ్రీశైలం ఫిబ్రవరి 16 : శ్రీశైల క్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. 11 రోజులపాటు జరిగే బ్రహ్మోత్సవాల్లో 6వ రోజు గురువారం ఉదయం చైర్మన్ చక్రపాణిరెడ్డి ఆధ్వర్యంలో భ్రమరాంబ, మల్లికార్జున స్వామి, అమ్మవారికి వివిధ పూజలు చేసినట్లు ఈవో లవన్న తెలిపారు. అష్టాదశ శక్తిపీఠాల్లో ఆరోశక్తి పీఠం, ద్వాదశ జ్యోతిర్లింగాల్లో రెండోదైన శ్రీశైల మహాక్షేత్రంలో వేడుకలు భక్త శోభితమై కైలాసాన్ని తలపించాయి. సాయంత్రం పుష్పపల్లకీ ఉత్సవం శోభాయమానంగా సాగింది. పల్లకీని వివిధ పూలతో అలంకరించారు.
కళాకారుల విభిన్న వేషాలు, డప్పు చప్పుళ్ల మధ్య గ్రామోత్సవం శోభాయమానంగా జరిగింది. గంగాధర మండపం మొదలు నందిమండపం వరకు, నంది మండపం నుంచి క్షేత్ర పాలకుడు బయలు వీరభద్రుడి వరకు పురవీధుల్లో ఊరేగించారు. కళాకారుల జానపదాలు, కోలాటాలు, జాంజ్పథక్, వివిధ విన్యాసాల సందడి మధ్య ఊరేగింపు కొనసాగింది. పల్లకీపై ఉన్న ఆదిదంపతులను దర్శించుకొని భక్తులు తన్మయత్వంతో పులకించిపోయారు. ఏడో రోజు శుక్రవారం స్వామి, అమ్మవారు గజ వాహనంపై ఊరేగనున్నారు. కార్యక్రమాల్లో ఆలయ ధర్మకర్తల మండలి సభ్యులు విజయలక్ష్మి సుబ్బరాయుడు, ఏసీ వెంకటేశ్, ఏఈవోలు హరిదాసు, ఫణీందర్ప్రసాద్, సీఎస్వో అయ్యన్న, పర్యవేక్షకులు రవికుమార్, దేవిక, భక్తులు పాల్గొన్నారు.