జడ్చర్లటౌన్, ఏప్రిల్ 8 : జడ్చర్ల పురపాలక సంఘం ఎన్నికల ప్రక్రియ వేగవంతమైంది. ఇప్పటికే వార్డుల విభజన పూర్తయి ఓటర్ల జాబితాను రూపొందించి అభ్యంతరాలను స్వీకరిస్తున్నారు. జాబితాపై వచ్చిన అభ్యంతరాల పరిశీలన అనంతరం 11న తుది జాబితాను ప్రచురించనున్నారు. గురువారం రిజర్వేషన్లు ఖరారు చేస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. మున్సిపాలిటీలో మొత్తం 27 వార్డులకుగానూ 13 మహిళలకు, 14 పురుషులకు కేటాయించారు. వీటిలో జనరల్కు 6 వార్డులు, జనరల్ మహిళలకు 8, బీసీ మహళలకు 4, బీసీ జనరల్కు 5, ఎస్సీ ఆన్రిజర్వ్కు 2, ఎస్సీ మహిళకు 1, ఎస్టీ ఆన్రిజర్వ్కు 1 వార్డు కేటాయించారు. రెండు, మూడు రోజుల్లో వార్డులవారీగా రిజర్వేషన్లను అధికారులు ప్రకటించనున్నారు. మున్సిపల్ చైర్మన్ స్థానం రిజర్వేషన్ వివరాలు తెలియాల్సి ఉంది. ఈ నేపథ్యంలో పురపాలక సంఘంలో ఎన్నికల వేడి మొదలైంది.
అఖిలపక్షంతో సమావేశం
మున్సిపాలిటీలో వార్డుల విభజన, ఓటర్ల జాబితా ప్రచురణపై గురువారం మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ సునీత ఆధ్వర్యంలో అఖిలపక్ష నాయకుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నిబంధనల ప్రకారం వార్డుల విభజన, ఓటర్ల జాబితాను ప్రచురించినట్లు తెలిపారు. ఓటర్ల జాబితాపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే గడువులోగా ఫిర్యాదు చేయాలని సూచించారు. మున్సిపల్ ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు అందరూ సహకరించాలని కోరారు. సమావేశంలో వివిధ పార్టీల నాయకులు మురళి, నర్సింహులు, నిత్యానందం, అశోక్యాదవ్, మీనాజ్, జాకీర్అలీ, కృష్ణయ్య, జగన్, నసీర్, అమరవాది ప్రభు, మోపతయ్య, మున్సిపల్ మేనేజర్ శ్రీను, టీపీవో నరేశ్, ఏఈ కిరణ్, ఆర్వో శశిధర్ ఉన్నారు.