
కరోనా కారణంగా మూతబడిన అన్ని విద్యాసంస్థలు బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఇన్నాళ్లుగా ఆన్లైన్ పాఠాలు విన్న విద్యార్థులు ఇక ప్రత్యక్ష తరగతులకు హాజరుకానున్నారు. గతేడాది మార్చి 24న దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించడంతో అన్ని విద్యాసంస్థలు బంద్ అయ్యాయి. వైరస్ వ్యాప్తి కాస్త తగ్గుముఖం పట్టి కేసులు తగ్గుతున్నాయని ఈ ఏడాది ఫిబ్రవరి 1న పాఠశాలలు తిరిగి ప్రారంభించినా మళ్లీ కేసుల సంఖ్య పెరగడంతో బడులు మూతబడ్డాయి. రాష్ట్రంలో లాక్డౌన్ పరిస్థితులు పూర్తిగా తొలగిపోయి పరిస్థితులు సాధారణంగా మారుతున్న వేళ తిరిగి పాఠశాలలను ప్రారంభించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. అంగన్వాడీ పాఠశాలల నుంచి పీజీ వరకు అన్ని విద్యాసంస్థలు తెరుచుకోనున్నాయి. అధికారులు ఇప్పటికే అన్ని విద్యాలయాలను శానిటైజ్ చేసే ప్రక్రియ చేపట్టారు. పాఠశాలలు తెరుస్తున్న వేళ అన్ని జాగ్రత్తలు తీసుకునేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
మహబూబ్నగర్, ఆగస్టు 30 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కరోనా దెబ్బతో రాష్ట్రవ్యాప్తంగా మూతబడి న విద్యాసంస్థలు బుధవారం నుంచి తెరుచుకోనున్నా యి. ఇన్నాళ్లుగా ఆన్లైన్ పాఠాలు విన్న విద్యార్థులకు ప్రత్యక్ష తరగతులు పునఃప్రారంభం కానున్నాయి. కరోనా కేసులు పెరగడంతో గతేడాది మార్చి 24న దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించడంతో విద్యాసంస్థలు బంద్ అయ్యాయి. కేసు లు కాస్త తగ్గుముఖం పట్టడంతో ఈ ఏడాది ఫిబ్రవరి 1న పాఠశాలలు తిరిగి ప్రారంభించినా మళ్లీ కేసులు పెరగడంతో నెల రోజుల్లోనే బడులు మూతపడ్డాయి. క్రమంగా కేసుల సంఖ్య పెరుగుతూ.. ఆగస్టులో తగ్గుముఖం పట్టాయి. రాష్ట్రంలో పరిస్థితులు సాధారణంగా మారుతున్న తరుణంలో పాఠశాలలు ప్రారంభించేందు కు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. అంగన్వాడీ నుం చి పీజీ వరకు అన్ని విద్యాసంస్థలు ప్రారంభం కానున్నాయి. విద్యాసంస్థలతోపాటు రెసిడెన్షియల్ పాఠశాలలు సైతం తెరుచుకోనున్నాయి.
అన్ని విద్యాలయాల్లో శానిటైజేషన్..
ఉమ్మడి జిల్లాలోని అన్ని విద్యాలయాల్లో శానిటైజేషన్ విజయవంతంగా పూర్తయింది. పాఠశాల ప్రాంగణంలో పెరిగిన పిచ్చి మొక్కలు తొలగించి తరగతి గదులు శుభ్రం చేశారు. మధ్యాహ్న భోజనానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే ఉన్న పాత బియ్యాన్ని టెండర్ వేసి విక్రయించేందుకు ఓ వైపు ఏర్పాట్లు చేస్తూనే.. మరోవైపు కొత్తగా బియ్యం కోసం అధికారులు ఇండెంట్ పెట్టారు. పాఠశాలల్లో తాగునీటి ఇబ్బంది లేకుండా మిషన్ భగీరథ కనెక్షన్లు సిద్ధం చేసేందుకు అధికారులతో సమన్వయం చేసుకుంటున్నారు. ఇప్పటికే అనేక పాఠశాలలకు నల్లా కనెక్షన్లున్నా.. లేని చోట హెచ్ఎంలు పంచాయతీలు, మున్సిపాలిటీల ద్వారా నల్లా కనెక్షన్లు తీసుకునే పనుల్లో ఉన్నారు.
పీయూలో హాస్టల్స్ ఓపెన్..
రాష్ట్రంలో ఏ విద్యాసంస్థలో వసతి గృహాలు తెరవకపోయినా.. పాలమూరు విశ్వవిద్యాలయంలో మాత్రం విద్యార్థుల కోసం అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ హాస్టల్ ఓపెన్ చేశారు. విద్యార్థులకు పరీక్షల దృష్ట్యా ఇబ్బంది లేకుండా ఉండేందుకు ఈ ఏర్పాట్లు చేసినట్లు అధికారులు వెల్లడించారు. అప్పటికే యూనివర్సిటీలోని టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ దాదాపుగా అందరికీ వ్యాక్సినేషన్ పూర్తి చేయడంతో హాస్టల్ వెంటనే ప్రారంభించే అవకాశం ఏర్పడింది. యూనివర్సిటీ పరిధిలో సుమారు 50వేల మంది విద్యార్థులుండగా.. అందులో దాదాపుగా 500 మంది ప్రస్తుతం పీయూ హాస్టల్లో ఉంటున్నారు. విద్యార్థులంతా ప్రశాంతంగా పరీక్షలు సైతం రాసి ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు.
సర్వం సిద్ధం..
ఉమ్మడి జిల్లాలో ప్రైవేటు, ప్రభుత్వ పాఠశాలలు కలిపి 4,187 ఉన్నాయి. ఇందులో 5,23,602 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఇక పాలమూరు విశ్వవిద్యాలయం పరిధిలో ప్రభుత్వ, ప్రైవేటు డిగ్రీ కళాశాలలు 85 ఉన్నాయి. ఉమ్మడి జిల్లాలో 87 గురుకులాలు ఉన్నాయి. వీటిలో మొత్తం 33,240 మంది విద్యనభ్యసిస్తున్నారు. వీరంతా రేపటి నుంచి బడులకు వెళ్లనున్నారు. ఆయా ప్రాంతాల్లోని పంచాయతీ సిబ్బంది, మునిసిపల్ వర్కర్లు పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అన్ని గదులను శానిటైజ్ చేస్తున్నారు. అలాగే తాగునీటి కనెక్షన్లను పునరుద్ధరించారు. ట్యాంకులను శుభ్రం చేస్తున్నారు.
ప్రైవేటుకు కళ్లం వేయాలి..
ఉమ్మడి జిల్లాలో కొన్ని చోట్ల కార్పొరేట్ స్కూళ్లను తలపించే యాజమాన్యాలు విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి ముక్కుపిండి అధిక ఫీజులు వసూలు చేస్తున్నారు. కొవిడ్ పేరిట ఆన్లైన్ క్లాసులు బోధిస్తూ రెగ్యులర్ క్లాసుల మాదిరిగా కొన్ని చోట్ల ఫీజులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఇప్పుడు తిరిగి పాఠశాలలు ప్రారంభం కావడంతో స్కూల్ ఫీజులు పెంచేందుకు, అదనపు ఫీజులు వడ్డించేందుకు సిద్ధం అవుతున్నారని తల్లిదండ్రులు వాపోతున్నారు. అధికారులు ఇలాంటి స్కూళ్ల యాజమాన్యాలకు కళ్లెం వేయాలని కోరుతున్నారు.
వ్యాక్సిన్ వేసుకుంటేనే అనుమతి..
పాలమూరు యూనివర్సిటీలో వ్యాక్సినేషన్ క్యాంపు ఏ ర్పాటు చేసి దాదాపుగా 98 శాతానికి పైగా సిబ్బందికి వ్యా క్సిన్ ఇప్పించాం. వ్యాక్సిన్ వేయించుకోని సిబ్బందికి అనుమతి లేదని చెప్పాం. వచ్చే వారం రెండో డోస్ కోసం యూ నివర్సిటీలోనే వ్యాక్సినేషన్ క్యాంపు ఏర్పాటు చేస్తున్నాం. వ్యాక్సిన్ వేసుకోవడం వల్ల విద్యార్థులకు సిబ్బంది నుంచి వైరస్ సోకే ప్రమాదం లేదు. 18 ఏండ్లు నిండిన విద్యార్థులు సైతం విధిగా వ్యాక్సిన్ వేసుకోవాలని సమాచారం పంపించాం. సెప్టెంబర్ 1 నుంచి ప్రత్యక్ష తరగతులు ప్రారంభమవుతున్న సందర్భం గా కొవిడ్ జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ప్రతి విద్యార్థి తప్పనిసరిగా మాస్కు ధరించేలా నిబంధన విధించాం. గుంపులుగా జమ కాకుండా చర్యలు తీసుకుంటున్నాం. హాస్టళ్లు, తరగతి గదుల్లో విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉండేలా చూస్తున్నాం.
అన్ని ఏర్పాట్లు పూర్తి..
ఇప్పటికే జిల్లాలోని 533 ప్రభుత్వ పాఠశాలల్లో శానిటైజేషన్ పూర్తయింది. పాఠశాలల్లో మొలిచిన పిచ్చిమొక్కలు తొలగించడంతోపాటు నల్లా కనెక్షన్ లేని చోట మిషన్ భగీరథ కనెక్షన్ ఇచ్చేందుకు ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. తాగునీటికి ఇబ్బంది లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నాం. మధ్యాహ్న భోజనం కోసం పాత బియ్యాన్ని పక్కకు పెట్టి కొత్త బియ్యం కోసం ఇండెంట్ పెట్టాం. విద్యార్థులే మాస్కులు తెచ్చుకోవాలి. తరగతి గదిలో ఫిజికల్ డిస్టెన్స్ ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటూ పాఠాలు బోధించనున్నాం.
పాఠశాలల్లో శుభ్రత
వనపర్తి టౌన్, ఆగస్టు 30 : రాష్ట్రవ్యాప్తంగా బుధవారం నుంచి పాఠశాలల ను ప్రారంభించనున్న నేపథ్యలో యుద్ధప్రాతిపదికన సుచి శుభ్రత చేపడుతున్నా రు. సీఎం కేసీఆర్ పిలుపులో భాగంగా అన్నిచోట్ల ప్రజాప్రతినిధులు, అధికారు లు చొరవ తీసుకొని క్షేత్ర స్థాయిలో పాఠశాలల శుభ్రతకు నడుం బిగించారు. ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, జిల్లా చైర్మన్లు, ఎంపీటీసీలు, సర్పంచులు, పారిశుధ్య కార్మికులు భాగస్వాములయ్యారు. పాఠశాలల్లో పేరుకుపోయిన ముళ్ల పొదలు, చెత్తాచెదారం తొలగిస్తున్నారు. తరగతి గదులు శుభ్రపరిచి ఫాగింగ్ చేపడుతున్నారు. మరుగుదొడ్లు క్లీన్ చేశారు. శానిటైజేషన్ వేగవంతం చేశారు. జిల్లావ్యాప్తంగా 544 ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో మొత్తం 82 వేల మంది విద్యార్థులు సెప్టెంబర్ 1 నుంచి పాఠశాలలకు హాజరుకానున్నారు. వీటితోపాటు కళాశాలలు కూడా ప్రారంభం కానున్నాయి. సెప్టెంబర్ 2 నుంచి విద్యార్థులకు ఫ్రీపాస్లు, రూట్ పాస్లు, స్టూడెంట్ పాస్లు జారీ చేయనున్నట్లు డిపో మేనేజర్ రాజు తెలిపారు. విద్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని కోరారు.
యుద్ధప్రాతిపదికన పనులు..
జిల్లా కేంద్రంతోపాటు అన్ని మున్సిపాలిటీల్లో అధికారులు, ప్రజాప్రతినిధులు పాఠశాలల పరిశుభ్రతలో భాగమయ్యారు. వారిని బాధ్యులుగా కేటాయించి రోజువారీ దశలవారీగా పారిశుధ్యం, శానిటేషన్ పనులు చేపట్టాం. వ్యక్తిగత మరుగుదొడ్లు శుభ్రం చేశాం. తరగతి గదుల్లో హైపోక్లోరైట్ ద్రావణం పిచికారీ చేశాం.
సర్వం సిద్ధం..
ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలోని 544 పాఠశాలల్లో పారిశుధ్య పనులు చేపట్టి సర్వం సిద్ధం చేశాం. ప్రతిరోజూ జిల్లా సెక్టోరియల్ అధికారులు, ఎంఈవోలు పాఠశాలలను పర్యవేక్షించారు. హెచ్ఎంలను బాధ్యులుగా చేసి పనులు వేగవంతమయ్యేలా చేశాం. భౌతిక దూరం, శానిటేషన్, మాస్కులు, విద్యార్థులు వచ్చాక ఏ విధమైన చర్యలు తీసుకోవాలో అనే దానిపై చర్చించాం.