సాధారణ దారాన్నే వినియోగించాలంటున్న పర్యావరణ ప్రేమికులు గాలి వీస్తే ఆకాశంలో పక్షిలా పతంగి చిందులేస్తుంది. అటు ఇటు కదులుతూ వయ్యారాలు పోతుంది. ఆకాశానికి రంగులద్దినట్టు అందంగా ముస్తాబై విభిన్న రంగుల్లో మురిపిస్తాయి. అట్లాంటి పతంగుల సందడి నగరంలో షురూ అయింది. వయేభేదం లేకుండా గాలిపటాలను ఎగురవేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పటికే ఎటు చూసినా ఏ ప్రాంతలో చూసినా పతంగుల వేడుకల ఏర్పాట్లు సాగుతున్నాయి. సంక్రాంతి రోజైతే కొంతమంది కోడిపందాల మాదిరిగా పతంగులు పందాల్లో నిమగ్నమవుతుంటారు. పోటాపోటీగా ఎగురవేస్తుంటారు. అయితే పతంగుల విషయంలో చిన్నపిల్లలకు సంబంధించి తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రాణాలు గాల్లో కలిసే అవకాశం ఉంటుందనినిపుణులు హెచ్చరిస్తున్నారు. అదేసమయంలో పతంగులను ఎగురవేయద్దని ఎవరూ అనడం లేదు. కానీ.. దానికి వినియోగించే మాంజాలపైనే పక్షి ప్రేమికులు ఆక్షేపణ చెబుతున్నారు. పర్యావరణ హితం కోసం ప్రభుత్వాలు ఇప్పటికే చైనా మాంజాలపై నిషేధం విధించాయి.
ఏపీకి బారులు
చౌటుప్పల్, జనవరి 12 : యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ పట్టణంలో బుధవారం వాహనాల రద్దీ నెలకొంది. సంక్రాంతి పండుగకు హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్కు ప్రజలు పెద్ద ఎత్తున తరలి వెళ్తుండడంతో 65వ జాతీయ రహదారిపై వాహనాలు బారులుదీరాయి. దీంతో చౌటుప్పల్ బస్టాండ్ ఎదురుగా, మండలంలోని పంతంగి టోల్ప్లాజా వద్ద స్వల్ప ట్రాఫిక్ జామ్ అయ్యింది. ట్రాఫిక్ పోలీసులు వెంటనే క్లియర్ చేశారు. జాతీయ రహదారి పక్కన వాహనాలు నిలుపడాన్ని నిషేధించారు. వాహనదారులు ఫాస్టాగ్ వినియోగిస్తుండడంతో టోల్ప్లాజా వద్ద వాహనాల రద్దీ స్వల్పంగా ఉంది. వచ్చిన వాహనాలు వచ్చినట్లు వెళ్తున్నాయి.
రేపు భోగి.. ఎల్లుండి సంక్రాంతి
రామగిరి, జనవరి 12 : శుక్రవారం భోగి, శనివారం సంక్రాంతి పండుగ జరుపుకోవాలని దూప, దీప, నైవేద్య పథకం అసోసియేషన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, వైదిక బ్రాహ్మణ సంఘం జిల్లా అధ్యక్షుడు పెన్నా మోహనశర్మ బుధవారం ఒక ప్రకటనలో సూచించారు. ఆదివారం కనుమ పండుగ ఉంటుందని పేర్కొన్నారు. శుక్రవారం తెల్లవారుజామున భోగి మంటలు వేసేందుకు ప్రజలు సిద్ధమవుతున్నారు. కాగా, సంక్రాంతి పండుగ సందర్భంగా పట్టణాలు, ఇతర ప్రాంతాల్లో ఉన్నవారు సొంతూళ్లకు రావడంతో పల్లెల్లో సందడి నెలకొంది.
వెరైటీ డిజైన్లు..
యాదాద్రి, జనవరి 12 : సంక్రాంతి వచ్చిందంటే ఎక్కడ చూసినా పతంగుల సందడి చిన్నా, పెద్ద గాలిపటాలను ఎగుర వేసేందుకు ఆసక్తి చూపుతారు. యువత పోటీపడి పెద్ద పెద్ద పతంగులను ఎగురవేస్తుంటారు. అయితే.. గతంలో కాగితాలతో తయారు చేసుకునే పతంగులు ఇప్పుడు రెడీమేడ్ అయ్యాయి. నోట్ల రూపంలో, రాజకీయ నాయకులు, సినీ హీరోలు, క్రికెటర్లు, ప్రముఖుల ఫొటొలతో తీరొక్క గాలి పటాలు మార్కెట్లోకి వచ్చాయి. ప్లాస్టిక్ పేపర్లపై రకరకాల బొమ్మలతో, తీరొక్క మోడళ్లలో ఆకర్షణీయంగా దర్శనమిస్తున్నాయి. మహారాష్ట్రలోని నాగ్పూర్ నుంచి రాకెట్ పతంగులు, రాజస్థాన్ రాష్ట్రం జైపూర్ నుంచి ఫ్యాన్సీ, ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్ నుంచి కవర్ కట్టింగ్, హైదరాబాద్లోని ధూల్పేట్లోప్రత్యేకంగా చేసిన పేపర్ పతంగులు మార్కెట్లో విక్రయిస్తున్నారు. ఒక్కోటి రూ.10 నుంచి 500 వరకు ధరలు ఉన్నాయి. హాలీవుడ్, ఏక్పాండ్, దోపాండ్, దో ఆంకే దోగుండే, బాంబే, కలకత్తా, లంగోట్, లంగోట్ నామ, దులంద, పట్టేదారి, జాంబియా పేర్లతో పతంగులను విక్రయిస్తున్నారు.
ఇంటింటా ఘుమ ఘుమలు..
నేరేడుచర్ల, జనవరి 12 : సంక్రాంతి పండుగ పిండి వంటలకు ప్రత్యేకం ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో పండుగకు వారం రోజుల ముందు నుంచే రకరకాల పదార్థాలు పెద్ద మొత్తంలో చేసుకుంటారు. ఈ క్రమంలో పండుగ సమీపించడంతో పిండి వంటలతో ఇంటింటా ఘుమఘుమలు వస్తున్నాయి. ఈ పండుగకు ఎక్కువగా సకినాలు, గారెలు, కారపూస, లడ్డూలు, అరిసెలు ఎక్కువగా చేసుకుంటారు. విదేశాల్లోని తమ పిల్లల కోసం కొందరు ప్రత్యేకంగా తయారు చేయించి పంపిస్తుంటారు. పిండి వంటల తయారీతో పలువురు మహిళలు ఉపాధి కూడా పొందుతున్నారు.
400 అయినా దొరుకని నాటుకోడి
అడ్డగూడూరు, జనవరి 12 : సంక్రాంతికి వచ్చే కొత్త అల్లుళ్లకు కోడిపుంజు కోసి, మటన్తో మర్యాద చేయాలని అత్తింటివారు అనుకుంటారు. కానీ.. నాటుకోడి, మటన్ రేటు వింటే ఘాటు నాశాలానికి ఎక్కుతున్నది. నిన్నమొన్నటి వరకు నాటుకోడి కిలో రూ.350 వరకు ఉండేది. పండుగ సందర్భంగా నాలుగొందలైనా దొరుకని పరిస్థితి. అదేవిధంగా మార్కెట్లో మటన్ ధర రూ.800 వరకు ఉంది. ఒకప్పుడు గ్రామాల్లో ఎక్కడ చూసినా నాటుకోళ్లు కనిపించేవి. ప్రస్తుతం పెద్దగా కనిపించడంలేదు. ధర పెరుగడానికి ఇదోక కారణమని ప్రజలు పేర్కొంటున్నారు.
జాగ్రత్తలు తప్పనిసరి
వీటితోనే ప్రమాదం..
నైలాన్, చైనీస్, గ్లాస్ కోటెడ్ ఉన్న కాటన్ మాంజాలపై నిషేధం కొనసాగుతున్నది. ఎందుకంటే పక్షులు, జంతువులకే కాదు మనుషులకూ తిప్పలు తప్పవని పర్యావరణ ప్రేమికులు హెచ్చరిస్తున్నారు. పతంగులు ఎగురవేసేందుకు మాంజాను కాకుండా సాధారణ దారాన్నే వినియోగించాలని పర్యావరణ ప్రేమికులు సూచిస్తున్నారు.
పక్షుల పాలిట యమపాశం
ప్రతిఏటా చైనా మాంజా పక్షుల పాలిట యమపాశంలా మారుతున్నది. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ) నిబంధనల మేరకు పతంగుల యాజమాన్యాలు సాధారణ దారాలనే విక్రయించాలి. గాలిపటాలు ఎగురవేసినప్పుడు అత్యధికంగా భారీ వృక్షాలు, విద్యుత్ స్తంభాలకు చుట్టుకుంటాయి. అందువల్ల పక్షులతోపాటు మనుషులూ ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రజలందరూ దీనిని అర్థం చేసుకోవాలి.
అనేక పక్షులను రక్షించాం
చైనా మాంజా వల్ల అనేక పక్షులు ప్రమాదాలకు గురవుతున్నాయి. ఇలా ప్రమాదాల బారిన పడిన అనేక పక్షులను రక్షించాం. పావురాలు, కాకులు, గద్దలు.. ఎన్నో పక్షులకు ఉరితాళ్లుగా మారాయి. పతంగులను సాధారణ ధారాలతోనే ఎగురవేస్తే జీవవైవిధ్యాన్ని కాపాడిన వారమవుతాం. అందుకు నగరవాసులందరూ కంకణం కట్టుకోవాలి. పావురాలకు హాని కలిగించడం పీసీఏ యాక్ట్, సెక్షన్ 11 ప్రకారం చట్ట విరుద్ధం.
జీవవైవిధ్యం దెబ్బతినొద్దు..
పావురమైనా.. పాలపిట్టయినా.. రామచిలుకైనా.. అన్ని పక్షులనూ కాపాడితేనే పర్యావరణంతోపాటు జీవవైవిధ్యత ఉట్టిపడుతుంది. అట్లాంటి సమాజాన్ని ప్రజలందరూ కోరుకున్నప్పుడే సుసంపన్నమైన ఆలోచనలతో సమాజం ముందుకు సాగుతుంది. చైనా మాంజానే కాదు పర్యావరణానికి హానికలిగించే ప్లాస్టిక్ను సైతం నిషేధించాలి. అధికారులు నిరంతరం పర్యవేక్షించాలి.